Thursday, August 1, 2013

రాష్ట్రాన్ని రావణ కాష్టంచేస్తున్న రాజకీయాలు


1) రాజకీయుల స్వరూప స్వభావాలు :-

ష రాజకీయులు తమను న్యాయసమీక్షా పరిధికి లోబడని వారుగా తలుస్తున్నారు.

ష రాజ్యాంగ బద్దంగా ప్రవర్తించాలన్న దృష్టి వారిలో కలిగ్గానిక్కూడా (అస్సలేమాత్రం) కానరావడం లేదు.

ష తమపోకడకు రాజ్యాంగబద్దత అన్న రంగుపులమాలన్న తపన మాత్రం దండిగా ఉంది.

ష రాజకీయులందరూ ప్రజాస్వామ్యమన్న పదాన్ని తరచుగా వాడేస్తుంటారు. ఆచరణలో మాత్రం రాచరిక - నియంతృత్వ - వైఖరినే కలిగుంటారు.

ష పేరుకు మాత్రం ప్రజాసేవకులమంటుంటారు. చేతలలో అంతటా పెత్తందారీ తనమే చూపిస్తుంటారు.

ష తమది అనుకున్న దాని ప్రయోజనం కొరకు, అనేకులకు మేలు కలిగించే వాటినైనా బలిపెడుతుంటారు.

ష కనీసం మూడో వంతుకు పైగా నేరచరితో, నేరారోపణపై న్యాయవిచారణో కలిగిన వారుగా ఉన్నారు.

ష ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవడమే సర్వత్రా కనిపిస్తున్నది. అది ప్రజాస్వామ్య స్ఫూర్తిని హత్య జేయడంతో సమానం.

ష ఓటరును స్వతంత్రంగా తన నిర్ణయాన్ని ప్రకటించనీయకుండా రాజకీయులు చేస్తున్న పనులు ఎన్నో!

1) అందులో ముఖ్యమైనది; అతణ్ణి అజ్ఞానంలో ఉంచడమూ తప్పవగాహన కలిగించడము అన్నది.

2) మతం పేరున, కులం పేరున, ప్రాంతం పేరున, పార్టీపేరున, ఓటరును తన పర అన్న ఆవేశాలకు లోను చేసి గుండు గుత్తగా ఓట్లు దండుకోవాలనుకోవడం.

3) స్థానికంగా ఉండే గుంపు నాయకులకు, వారి వారి స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుతామనే ఆశ జూపి ఓట్లు దండుకోవడం.

4) స్థానికంగా ప్రజలలో ఉండే సమస్యల్ని ఆసరా చేసుకుని వారిని శతృమిత్ర సమూహాలుగా విడగొట్టి విభజించి పాలించు అన్న కుటిల నీతిని అమలు చేసి ఊరుమ్మడితనాన్ని తలెత్తకుండా చేయడం.

5) ప్రజలకు అందాల్సిన నిధులను తాము మింగగలిగినంత మింగి, ఆ మిగిలిన దాన్నైనా తామేదో జనం కొరకు దానం చేస్తున్నట్లో వరాలిస్తున్నట్లో మభ్యపెట్టి వారిని లొంగదీసుకోవడం

6) చివరి యత్నంగా ఓటును, అప్పటికి ఉన్న డిమాండు ననుసరించి ఎంత ధరైనా చెల్లించికొనడం

7) మానసిక సమతుల్యత ఉంటే ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తారేమోనన్న అనుమానంతో, వారిని మత్తులో ముంచేటందుకు మద్యాన్ని ఏరులా పారించడం.

8) ఆశకు, ప్రలోభాలకు లొంగనివారిపై దాదాగిరిని ప్రయోగించడం. కడతేర్చడం.

యోచనాశీలులారా!

ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు కాదంటారా? ఒక్కమాట! రాజ్యాంగాన్ని అమలు చేసే స్థానాలలోకి చొరబడ్డవారు ఇలాటి దిక్కుమాలిన పనులు చేయడానికి తెగబడే అవకాశం ఉందని అంబేద్కర్‌ లాంటి మేధావులు ఆనాడే ఊహించి మనల్ని హెచ్చరించారు కూడాను. వారి మాటల్నే వినండి.

1) రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు పరచే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది కూడా చెడ్డదైపోవడం ఖాయం. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దానిని అమలు పరిచే వారు మంచివారైతే అది మంచిదవడం కూడా ఖాయం.

2) రాజ్యాంగపు పనితీరు కేవలం రాజ్యాంగ స్వరూపంపైన మాత్రమే ఆధారపడి ఉండదు. అది దేశానికి శాసన నిర్మాణ, కార్య నిర్వాహక, న్యాయ - శాఖలను అందించుతుంది. ఈ మూడు శాఖలు ప్రజలపైనా, వారు ఏర్పరచుకున్న పార్టీలపైనా ఆధారపడి ఉంటాయి. భారత ప్రజలు, వారి పార్టీలు ఎలా నడచుకుంటాయో ఎవరు చెప్పగలరు? అవి తమ ఆశయాలను సాధించుకోవడానికి రాజ్యాంగ విధానాలను అనుసరిస్తాయా? విప్లవ విధానాలనా? వారు విప్లవ విధానాలను అనుసరిస్తే రాజ్యాంగం ఎంతమంచిదైనా, విఫలమై పోతుందనడానికి ఏ జ్యోతిష్కుడూ అక్కరలేదు.

3) రాజకీయ విధానాలన్నవి హక్కులూ విధులకు చెందిన సమస్యగా ఉంటాయి. పౌరుడు కడకు ఎవరికి విధేయుడుగా ఉండాలన్నది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి సమాధానం ఒక్కటే.

అత్యయిక పరిస్థితుల్లో పౌరుడు కేంద్రానికే విధేయత చూపాలి. రాష్ట్రాలకు కాదు. ఇందుకు సందేహం లేదు. ఎందుకంటే కేంద్రం మాత్రమే సమష్టి లక్ష్యాల కోసం పని చేయగలదు. అత్యయిక పరిస్థితుల్లో రాష్ట్రాలు తమ సొంత, స్థానిక ప్రయోజనాలతోబాటు, దేశ ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకోవాలి.

4) కులాల, తెగల రూపంలో ఉన్న మన పాత శతృవులతోబాటు, పరస్పర విరోధ తత్వాలతో ఉన్న అనేక రాజకీయ పార్టీలను చూస్తున్నాము. ఈ వాస్తవం నన్ను మరీ కలచి వేస్తున్నది. భారతీయులు తమ తత్వాలకు (కుల,మత, ప్రాంత, పార్టీ, వర్గతత్వాలకు) అతీతంగా దేశాన్ని చూస్తారా? లేక దేశాన్ని కంటే మిన్నగా - అతీతంగా - తమ తత్వాలను చూస్తారా? నాకు తెలియడం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం. దేశానికి అతీతంగా పార్టీలు తమతత్వాన్ని చూసినట్లైతే మన స్వాతంత్రం తప్పక కోల్పోతుంది. కనుక స్థిరమైన నిశ్చయంతో మన మీ ప్రమాదాన్నుండి దేశాన్ని కాపాడుకోవాలి. మన చివరి రక్తపుబొట్టు వరకు స్వాతంత్రాన్ని రక్షించుకోడానికి కంకణం కట్టుకోవాలి.

5) మనది ప్రజాస్వామ్య దేశం. కానీ మన దేశం దీనిని నిలబెట్టుకోగలుగుతుందా? కోల్పోతుందా? ఇదీ నా మనస్సుకు పై విషయమంత ఆంధోళనా కలిగిస్తోంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం నియంతృత్వానికి దారితీసే ప్రమాదమూ ఉంది. ఇప్పుడే పుట్టిన మన ప్రజాస్వామ్యం తన స్వరూపాన్ని అలా ఉంచుకునే ఆచరణలో నియంతృత్వానికి దారితీయవచ్చు. ఈ దిగజారుడు ప్రారంభమైతే జరిగే ప్రమాదం మరీ పెద్దదిగా ఉంటుంది. అది జరక్కుండా ఉండాలంటే ముందుగా మనం చేయాల్సింది మన మన సాంఘిక లక్ష్యాలను సాధించుకోడానికి మనం రాజ్యాంగ పద్దతులకు కట్టుబడి ఉండడమే. రక్తపాతంతో కూడిన తిరుగుబాటు పద్దతులను మనం విడిచి పెట్టాలి. సత్యాగ్రహాలు, సహాయనిరాకరణ, శాసనోల్లంఘన వంటి పద్దతులను విడిచిపెట్టాలి. రాజ్యాంగ పద్దతులు అందుబాటులో ఉండగా, రాజ్యాంగేతర పద్దతులను అవలంబించడంలో అర్ధం లేదు. రాజ్యాంగేతర పద్దతులు అరాచకత్వానికి వ్యాకరణం లాటివి. వీటిని మనం ఎంత త్వరగా వదులుకుంటే అంత మంచిది.

6) ఇండియాలో భక్తిభావం లేదా వీరపూజ రాజకీయాలలో చాలా పెద్ద పాత్ర వహిస్తోంది. .... మత విషయంలో భక్తి ముక్తికి ఒక మార్గం కావచ్చుగానీ, రాజకీయాలలో భక్తి లేదా వీరపూజ దివాళా కోరుతనానికీ, తద్వారా ఏర్పడే నియంతృత్వానికీ సూటిదారి అవుతుంది.

7) సోదరభావం లేనంతకాలం ఆర్థిక, సాంఘిక, రాజకీయ న్యాయం అమలవదు. సోదరత్వం లేకుంటే, స్వాతంత్య్రం, సమానత్వం అనేవి లోతుకు వెళ్ళని పై పై రంగు పూతలు మాత్రమే.

8) మన ముందున్న కర్తవ్యాల గురించి ఇవి నా భావాలు. ఇవి కొందరికి రుచించకపోవచ్చు. ఈ దేశంలో రాజకీయాధికారం కొందరికే ఏకస్వామ్యంగా ఉందనడంలో అబద్ధం లేదు. చాలా మంది బరువు మోసే పశువులు గానే కాదు బలిపశువులు గానూ ఉన్నారనడంలో అబద్దం లేదు. ఈ ఏకస్వామ్యం కేవలం ప్రజల అభివృద్ధి అవకాశాలను నిర్మూలించడమే కాదు, వారికి జీవితమంటే అర్థమేలేకుండా చేసేసింది.

9) వివక్షకు గురైన వర్గాలలో, తమ సొంత గుర్తింపు కై పడే ఆరాటం ఒక వర్గపు పోరాటంగా మారనివ్వకూడదు. అది ఇంటిని ముక్కలు చేయడానికి దారితీస్తుంది. అది నిజంగా ఒక ప్రళయ దుర్ముహూర్తమే.

10) ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టాలంటే అది ప్రజల చేత నడపబడేదిగా ఉండాలి. అది జరగకుండా, ప్రజల కొరకు నడపబడే ప్రభుత్వాన్ని కోరడమంటే ప్రజాస్వామ్యాన్ని కోల్పోయినట్లే. కనుక ప్రజలచేత నడుపబడే ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పనికంటే దేశ సేవ అనదగ్గది మరొకటిలేదు.

(4-11-1948, 25-11-1949 తేదీలలో రాజ్యాంగ సభలో అంబేద్కర్‌ చేసిన ప్రసంగ వ్యాసాలనుండి)

ష వాక్స్వాతంత్య్రాన్ని గురించి, భావ ప్రకటనా స్వేచ్చ గురించి అంబేద్కర్‌ ఏమన్నాడో చూడండి.

''భావ ప్రకటనా స్వాతంత్య్రం అనేది చాలాకాలంగా స్థిరపడిన ప్రాథమిక సూత్రం. అది రాజ్యాంగం చేత కాపాడబడుతూ ఉంది. అంత మాత్రాన బాధ్యతా రహితంగా ఏది పడితే అది ప్రసంగించడం గానీ, ప్రచురించడం గానీ చేసే పరిపూర్ణ హక్కును అది ఇవ్వదు. అదుపులేని మితిమీరిన స్వేచ్చను అది ఇవ్వదు. ఇష్టానుసారం ప్రసంగాలకు రక్షణ ఇవ్వదు. పైగా దానిని దుర్వినియోగం చేసే వారిని శిక్షిస్తుంది.

ష ప్రాతిపదికగా ఉండదగ్గ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పి ప్రస్తుత రాష్ట్ర సమస్యను విశ్లేషిస్తాను.

రాజ్యాంగ రచనోద్దేశాన్నంతటిని రాజ్యాంగంలోని ప్రస్తావన ప్రకటిస్తోంది. అది రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరుస్తోంది. ఆ మొత్తాన్ని క్లుప్తీకరిస్తే దాని రూపం ఇలా ఉంటుంది.

ష ''సోదరభావము, సమైక్యత, అఖండత, సమానాభివృద్ధి, సమగ్రాభివృద్ధి'' అన్న ఐదు లక్ష్యాల కొరకే రాజ్యాంగాన్ని ఆ విధంగా రూపొందించుకోవడం జరిగింది.

కనుక రాజ్యాంగంలోని ఏ అధిశాసనాలకు గాని అర్థాలు చెప్పుకోవాలన్నా, వ్యాఖ్యానం చేయాలన్నా వివరణ లిచ్చుకోవాలన్నా అవన్నీ పై ఐదు లక్ష్యాల సాధనకు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నది పట్టి చూసుకుంటుండాలి. ఈ ఐదు లక్ష్యాలను కూడా ప్రజాస్వామ్య బద్దంగానే చేరవలసి ఉంటుంది.

యోచనాశీలురైన పాఠక మిత్రులారా!

పై భావాల వెలుగులో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరుగుతున్న కుహనా రాజకీయ పోకడలను వీక్షించి సమీక్షించే పని చేద్దాం.

ఇంతకూ తెలంగాణా విభజన ఉద్యమం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యమైందేనా?

సమా :- రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి నాకున్న అవగాహన ప్రకారం ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రాజ్యాంగ స్పూర్తికి అనుగుణ్యత కలిగుంది కాదు. నిజానికి ఇక్కడ నడుస్తున్న ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమాలూ రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతికూలమైనవే. ఇక ఉత్తరాంధ్ర సీమ ఉద్యమాలు సరేసరి. ఎందుకంటే?

రాజ్యాంగంలోని 2, 3 ఆర్టికల్సు రాష్ట్రాల విభజనకు సంబంధించిన శాసన రూపాలు. అందులోనూ 3వ ఆర్టికలు (అధికరణము, పరిచ్చేదము, అధిశాసనము అన్న పదాలూ ఆర్టికల్‌ అన్నదానికి సమానార్థకాలే). కొన్ని చిన్న రాష్ట్రాలను కలిపి ఒకటి చేయడానికీ, ఉన్న రాష్ట్రాన్ని విభజించడానికీ, సరిహద్దులను, పేర్లను మార్చడానికీ వీలు కలిపిస్తున్నది. ఈ ఆర్టికలును సక్రమంగా అన్వయించుకోవాలంటే 1) ఆ పని చేయడానికి అధికారం ఎవరికుంది? 2) ఎందుకు చేయాలి 3) ఎప్పుడు చేయాలి? అన్నది సక్రమంగా నిర్ధారించుకోగలగాలి ఆ వివరాలివిగో.

1) మూడవ ఆర్టికలును అమలుపరిచే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది.

2) దేశ ప్రయోజనాలకు, పాలనా సౌలభ్యంకొరకు, పైన ప్రస్తావన లక్ష్యాల నెరవేర్పు కొరకు అవసరమన్నప్పుడే అది చేయాలి.

ష ఒక ప్రాంత ప్రజలు తామువిడిపోవాలని కోరుకుంటే చేయాలా? చేయవచ్చా?

సమా :- చేయనఖ్ఖరలేదు. పై లక్ష్యాలకు ఆటంకంగా ఉంటే చేయకూడదు కూడా.

రాష్ట్రం మొత్తం రాష్ట్రాన్ని విభజించమని కోరితే విభజించేపని చేయవచ్చా?

సమా :- దేశ ప్రయోజనాలు, రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణ్యత ఉంటే చేయవచ్చు. లేకుంటే చేయకూడదు. అప్పుడైనా సమస్య రాష్ట్రానిదై ఉండకూడదు. దేశానిదై ఉండాలి.

ష రాష్ట్ర ప్రభుత్వం ఇష్టపడితే విభజన చేయాల్నా?

సమా :- ఇది అధికారంలో ఉన్న పార్టీ ఇష్టపడితే అన్న అర్ధాన్నిస్తున్నది. అంతమాత్రాన చేయడానికి వీల్లేదు.

ష పోనీ కేంద్ర ప్రభుత్వం ఇష్టపడితే ఆ పని చేసే అధికారం ఉంటుందా దానికి?

సమా :- రాజ్యాంగ హృదయాన్ని బట్టి అయితే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ అధికారంలేదు. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పరచిన పార్టీకి మెజారిటీ ప్రజల ఆమోదం ఉన్నప్పటికీ రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వానికీ ఆ అధికారాన్నివ్వలేదు. అధికారం చేతికి అందుకున్నప్పటికీ ఆ పార్టీగానీ, ప్రభుత్వంగానీ దేశం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించలేరు కనుక. అట్టి స్వభావం మన ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థరీత్యా పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. పార్లమెంటు అదిన్నీ లోక్‌ సభే దేశం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించగలుగుతుంది. రాష్ట్రాల విభజన, కలయికలన్న విషయంలో నిర్ణయం తీసుకోవలసింది పార్లమెంటు మాత్రమే అంటున్నామంటే, దేశ ప్రజలంతా కలసి చేయవలసిన నిర్ణయమది అని అంటున్నామనే. కనీసం దేశ ప్రజలలో పెద్ద భాగం తీసుకోవలసిన నిర్ణయమది అనంటున్నామన్నమాట.

రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజలు కోరారనిగానీ, రాష్ట్ర ప్రజలంతా కోరుకున్నారనిగానీ, రాష్ట్రంలోని అధికార పార్టీ ఇతర పార్టీలు కోరాయని గానీ, రాష్ట్ర ప్రభుత్వం కోరిందని గానీ, కేంద్ర ప్రభుత్వం కోరిందని గానీ, కేంద్రంలో అధికార పార్టీ ఇష్టపడిందని గానీ '3' వ ఆర్టికలును అమలు చేయనక్కరలేదు. అస్సలా ఆర్టికలు ఈ కూటాల ఇష్టాయిష్టాల నెరవేర్పు కొరకుగా ఏర్పడింది కానేకాదు. అందునా ప్రాంతీయ అసమానతల నేపధ్యం నుండి పుట్టుకొచ్చిన ఆంధోళనోధ్యమాల వత్తిడిననుసరించైతే దానిని అమలు చేయనే కూడదు.

ష కనుకనే రాష్ట్రంలో చాలా కాలం క్రితమే ఏర్పడి కొనసాగుతున్న మూడు ఉద్యమరూపాలూ ప్రజాస్వామ్యపు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యత కలిగినవి కాదంటున్నాము. అవి మూడు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలను సమానాభివృద్ధి లక్ష్యంగా అభివృద్ధి పరచడానికి గానీ, దేశ ప్రయోజనాల నాశించి గాని పుట్టుకొచ్చినవి కావు. వాటన్నింటి ప్రధాన లక్ష్యం తమయొక్క, తమగుంపు యొక్క, లేదా తమ ప్రాంతం యొక్క ప్రయోజనాల నుద్దేశించినవీ, ఆ విషయంలో ఇతరుల ప్రయోజనాలకు భంగం కలిగినా పరవాలేదనుకునేటివిగానే ఉన్నాయి. చిన్న నా బొజ్జకు శ్రీ రామరక్ష సిద్దాంతమే వాటన్నింటిదీ. బాగాలోతుగా పరిశీలించి చూస్తే గత 60 ఏండ్లుగానూ వీటిని పట్టుకున్న వారు (1) రాజకీయ పార్టీలు - వాటి అధికార రాజకీయాలు,.

2) బడాబడా పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారీ వ్యాపార వేత్తలు (ఇన్వెష్టర్సు) మాత్రమేనని తేలుతుంది.

ష అంబేద్కర్‌ ఆనాడే చెప్పినట్లు దేశంలో ప్రజాస్వామ్యం పేరునా, పార్టీల పేరునా కూడా ఏకస్వామ్యమే అమలవుతోంది. రాజకీయ క్షేత్రాలన్నీ ప్రజాస్వామ్యాన్ని ఏ నాడో తుంగలో తొక్కేశాయి.

ఆ నాడాయనన్నది ఈనాడు మరింత స్పష్టమైన రూపు ధరించి ఉంది. ప్రజాస్వామ్యం ఎలాగూలేదు సరే పార్టీ స్వామ్యమూ నామమాత్రమే. బృందస్వామ్యంగానీ, నాయక స్వామ్యంగానీ మాత్రమే వాస్తవంలో నడుస్తోంది. ఈ నిజం రాజకీయ నాయకులందరకూ తెలుసు. దీనిని ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా మార్చలేమనీ తెలుసు. ఇంకా సరిగా చెప్పాలంటే, చాలమందికైతే, అలా మార్చడం రాజకీయం తెలియని తనమేననీ అనిపిస్తుంటుంది. అధికారం, పదవీ ఎన్నాళ్ళుంటాయో తెలియని అనిశ్చిత స్థితి ఉంది. ఈ స్థితికి చేరడానికే జీవితమూ, ధనమూ కూడా చాలా ఖర్చైంది. కనుక దీపం ఉండగనే ఇల్లు చక్క బెట్టుకో అన్న ఒకే ఒక్క సూత్రం పనిచేస్తూ ఉంది ఎక్కువలో ఎక్కువ మందిలో ఇలాటి పరిస్థితుల్లో ''రంకునేర్చినమ్మబొంకనేర్చదా'' అన్నట్లు ప్రతి రాజకీయ వ్యాపారీ త్యాగాల గురించి, దేశాన్ని గురించీ, ప్రజల గురించి తెగవదరు తుంటాడు. జనం కోసమే బ్రతుకుతున్నట్లు నటిస్తుంటాడు.

ఈ మధ్యనే జరిగిన ఒకటి రెండు సంఘటనలను ఉదహరించుకుంటే వీరి బాగోతం ఇట్టే బట్టబయలౌతుంది. 1) నేరచరితులు, నేరారోపణల వల్ల నిర్భంధంలో ఉన్నవాళ్ళు, శిక్షలు ఖరారైన వాళ్ళు ప్రజాప్రతినిధులుగ ఉండదగరు. అట్టివారు మరికొంత కాలం పాటు ఎన్నికలలో పాల్గొనడానికీ అనర్హులవుతారు. అని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. కొన్ని పరిశోధనా విభాగాలందించిన సమాచారం మేర ప్రజాప్రతినిధులుగ, మంత్రులుగ శాసన సభలలోనూ, పార్లమెంటులోనూ, జిల్లా పరిషత్తులలోనూ చేరి ఉన్న వారిలో మూడో వంతుకు పైగా సుప్రీంకోర్టు తీర్పుననుసరించి అనర్హులవుతారు. కొంతమందైతే హత్యారాజకీయాల క్రింద శిక్షలు పడికూడా పై కోర్టుకు అప్పీలు చేసుకోవడమనే వెసులు బాటును వాడుకుని ప్రజాప్రతినిధులుగనే అధికారంలో ఉండగలుగుతున్నారు.

అస్సలు విషయమేమంటే, పార్టీలన్నీ కలసి కోర్టులు పార్లమెంటు సార్వభౌమాధికారంలో తలదూర్చుతున్నాయి. ఆ పని చేయకుండేలా రాజ్యాంగ సవరణ చేస్తాము అన్న వైఖరిని కనబరుస్తున్నాయి.

2) ఇలాటిదే మరో ఘటన, స.హచట్టం కేంద్ర కమీషనర్‌ తీర్పుకు సంబంధించింది. రాజకీయ పార్టీలూ స.హ చట్టం పరిధిలోకి వస్తాయి. ఎందుకంటే అవి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా ప్రజాధనాన్ని వాడుకుంటున్నాయి కనుక అంటూ ఆ వివరాలనూ (అవి ఎన్ని వందల కోట్లు ప్రజాధనాన్ని వాడుకున్నాయోనన్న వివరాలనూ) బహిరంగంగా ప్రకటించి ఆ పార్టీలు స.హ. చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలను ప్రారంభించాలి. అన్నదే ఆ తీర్పు ఆ దేశం.

గగ్గోలు పెట్టేశాయి ఆ పార్టీలన్నీ. మేము ఆ చట్ట పరిధిలోకి రాము అనన్నాయి. ఇప్పుడున్న చట్టం ప్రకారం వస్తామనే గనక అన్నట్లైతే, పార్లమెంటులో పార్టీలను మినహాయించేలా సవరణ చట్టాన్ని తీసుకొస్తాము అంటూ నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నాయి. ప్రజల సొమ్ముతో బ్రతుకుతూ, ప్రజాధనం నుండే జీతభత్యాలు తీసుకుంటూ ప్రజల నుండి సేకరించిన విరాళాలు వగైరాల జమా ఖర్చులు ప్రజలకు చూపించండి అంటే, అది మేము చేయము అనంటున్న పార్టీల నేమనాలి? ఇక ఈ రకంమంద దేశ సమైక్యతను, అఖండతను, సమానాభివృద్ధిని కాంక్షిస్తాయని, అందుకు అవసరమైన సోదర భావాన్ని ప్రజల్లో నెలకొల్పుతాయని అనుకోగలమా?

అంబేద్కర్‌ భయపడ్డ రెండు అరిష్టాలూ మన నెత్తి మీద కొచ్చిపడ్డాయి. 1) ప్రజాస్వామ్యం పేరున నియంతృత్వం చెలామణి కావడం, 2) రాజ్యాంగాన్ని అమలు పరచాల్సిన స్ధానాలలోకి చెడ్డ వారు - అయోగ్యులు - వచ్చి చేరడం పరాయి పాలన అంతమైందేగానీ, ప్రజలకు స్వతంత్రం రాలేదింకా ఈ దేశంలో.

రాజకీయ నటనాధురీణాలు

1) తెలుగుదేశం పార్టీ వాడు కాంగ్రెసు వైకాపా కుమ్మకయ్యాయంటాడు.

2 కాంగ్రెసు వాడు తె.దే.పా, వైకాపా కుమ్మకయ్యాయంటాడు.

3. వైకాపా వాడు కాంగ్రెసు తెలుగుదేశం కుమ్మక్కయ్యాయంటాడు.

ష వీరికిదేమి పోయేకాలం? ఇన్ని నిజాలుంటాయా? ఇవన్నీ నిజాలేననుకోడానికి ప్రజలు వెంగళప్పలా? ఇన్ని నిజాలుండవన్నది. ఎంత నిజమో అయినా, వీటిని మూటినీ మోసే మందజనంలో ఉంటూనే ఉన్నారన్నదీ అంతే నిజం.

ష తమతమ ఆశయాలను రాజ్యాంగ బద్ద పద్దతుల ద్వారానే సాధించుకోవాలిగాని, రాజ్యాంగేతర పద్ధతులను అనుసరించనేకూడదు అని అంబేద్కర్‌ చెప్పాడు.

ష బందులు, రాస్తారోకోలు వగైరాలన్నీ రాజ్యాంగ విరుద్దమైన వని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ జరుగుతున్నదేమిటి? ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగ బద్దంగా బందులు చేసుకుంటుంటే అటకాయిస్తున్నారు పోలీసులు అని పార్టీలంటున్నాయి.

ష భావ ప్రకటనా స్వేచ్చ పేరున, వాక్స్యాతంత్య్రం పేరున బెదిరింపులు, బండబూతులు తిట్టుకుంటున్నారు.

ష పేరుపెట్టి మరీ తిట్టడం, బొమ్మచేసి దానిని చెప్పుతో కొట్టడం లాంటివేవీ అప్రజాస్వామికంగా అనిపించడంలేదెవరికీ

ష ఈ మధ్యనే ఒక సీనియర్‌ మోస్టు రాజకీయ నాయకుడు, కె.కె. అంటారు; సమైక్యాంధ్ర అని నువ్వంటే ఎలా, కలిసుండాలంటే ఇద్దరూ అంగీకరించాలి. అందులో ఒకడు విడిపోతానంటే ఇక కలిసుండడం ఎలా? అంటూ విడాకుల ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు. ప్రాంతాన్ని విడగొట్టడానికి ఆ ప్రాంత వాసులు విడిపోతామంటే సరిపోదన్నంత అవగాహనైనా లేని ఈ రకాన్ని చూసిఏమనుకోగలం.

మరోకాయన టి.ఆర్‌.ఎస్‌ చతుష్టయంలో ఒకడు హరీష్‌రావంటారు. సమైక్యాంధ్ర అని సీమాంధ్ర వాళ్ళంటే ఎలా? సమైక్య అని అందరూ అనాలిగాని అనంటాడు. గొప్పలాజిక్కే. సమైక్యవాదాన్ని ఏదో ఒక ప్రాంతం వాడు అనకూడదన్నమాట, అంటే అది హేతుబద్దం కాదన్నమాట. ఒక వాదాన్ని చేపట్టడానికి ఆవాదం యొక్క అవసరం బలం తెలిసుంటే చాలుగాని, అతడే ప్రాంతం వాడు, ఆ మాట అన్ని ప్రాంతాల వాళ్ళు అంటున్నారా, లేదా? అన్న దాన్ని బట్టి దాని యోగ్యతా యోగ్యతలుంటాయన్న మాట. బాగుంది వివేకం. వీరిరువురి లెఖ్ఖన రేపు తెలంగాణలో ఏదో మూలనున్నవారు మేము తెలంగాణలో ఉండమంటే పొమ్మనాల్సిందే నన్నమాట. ఇతర ప్రాంతాలవాళ్ళు అదేంటిరా ఎందుకు కలిసుండవు? మనమంతా ఒక్కటే అనకూడదన్నమాట. ఇక ఇదే వరవడి దేశంలోని వివిధ ప్రాంతాలు, వర్గాల మంద మేము వేరుగా ఉంటామననగానే వేరు బెట్టాల్సిందేనన్నమాట. గొప్పతర్కమే. గొప్ప సమష్టి భావనే.

విడిపోడానికొప్పుకుంటే అన్నదమ్ముల్లా కలిసుందాం. కాదంటావా ఖబడ్దార్‌, తరిమేస్తాను, అగ్ని గుండం చేస్తాను. అంటాడొకడు.

ప్రాధేయపడండి. ఉండనిస్తాం. పొట్టపట్టుకుని వచ్చిన వాళ్ళ పొట్టగొట్టం లాటి దయాధర్మపు మాటలాడతాడు మరొకడు. ఇదంతా ప్రజాస్వామ్యమే. రాజ్యాంగ బద్దమేనని కాబోలు.

అంబేద్కర్‌ చిన్న రాజ్యాలు అభివృద్ధి చెందుతాయన్నాడు అంటూ విభజన కోరేవారంటుంటారు. నిజానికిది అంబేద్కర్‌కు అపవ్యాఖ్యానం చేయడమే. ప్రాంతీయ అసమానతలను స్ధిరీకరించే చిన్న రాష్ట్రాలను అతడు ఉద్దేశించింది? అదలా ఉంచి చిన్న రాష్ట్రాలు ఎంతగా బలహీనపడ్డాయో చూడమంటారొకడు, చిన్న రాష్ట్రాలెలా అభివృద్ధి చెందాయో చూడమంటాడింకొకడు. వీడొక రెండు రాష్ట్రాలను, వాడొక రెండు రాష్ట్రాలను ఉదహరిస్తుంటారు. ఆ రాష్ట్రాల వాస్తవ పరిస్థితేమిటో, జనాభా పరిమాణమెంతో అవెందుకు అభివృద్ధి చెందాయో, ఏయే అంశాలలో అభివృద్ధి చెందాయో, ఇవెందుకు బలహీనపడ్డాయో, ఏయే విషయాలలో బలహీన పడ్డాయో వాటిని వివరించరు. అదలా ఉంచి రెండు ఉదాహరణలు మన రాష్ట్రానికెలా అన్వయిస్తాయో అస్సలేమాట్లాడరు.

ఆంధ్రప్రదేశ్‌

సుమారు 9 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం మనది. అంత పెద్ద రాష్ట్రాల వల్ల దేశం మొత్తం ప్రయోజనాలకు భంగం కలగవచ్చు. కనుక రెండుగా విభజించదగిందే అయితే ఆ విభజన రాజ్యాంగాశయాలకు దోహదకారిగా ఉండగలిగేదిగా ఉండాలి. ప్రాకృతిక వనరులూ, సామాజిక వనరులూ సమానంగా పంపిణీ అయ్యేందుకు, పరిపాలనలో సౌలభ్యత నెలకొనేందుకూ, జాతీయ ఐక్యత, సోదర భావము నెలకొనేందుకూ, సమానాభివృద్దికీ దోహదపడే రీతిలో ఉండాలా విభజన. ఆ రీతిగా విభజించి ఎల్లలు నిర్ణయించుకోడానికి మూడు ప్రాంతాల వారూ ముఖ్యంగా తెలంగాణవాదులు అంగీకరించగలరా? అంగీకరించలేనపుడు రాజ్యాంగ స్ఫూర్తిని గురించిగానీ, రాజ్యాంగం ప్రకారం అనిగాని అననేకూడదు.

ష ప్రజాస్వామ్య వ్యవస్ధలో; ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నవాడు, 1) తన నియోజక వర్గానికి గానీ, 2) జిల్లాకుగానీ, 3) తన ప్రాంతానికి గానీ ప్రాధాన్యతనిస్తూంటే; అతడు ప్రజాస్వామ్యాన్ని గురించి తెలియనివాడైనా అయ్యుండాలి. ప్రజాస్వామ్యం అమలవడం ఇష్టం లేనివాడైనా అయ్యుండాలి. అట్టివాడు మంత్రిగా ఉండడానికి మాత్రం తగడు.

ష అలాగే ఒక అసెంబ్లీ నియోజక వర్గం నుండి ఒక పార్టీ వ్యక్తిగా ఎన్నికలలో నిలిచిగెలిచిన వాడు (నిజానికి గెలిచినవాడు అనకూడదు ఎన్నికైనవాడు అనే అనాలి, ఎందుకనో తెలుసా?, నియోజక వర్గానికి మొత్తానికి ప్రతినిధిగా కాక తన మండలానికో, తన పార్టీ వారికో మాత్రమే ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడనుకోండి. అతడిక రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి శాసన సభ్యునిగా పనికిరాడనే అర్థం.

ష అలాగే అతడొక శాసన సభ్యునిగా శాసన సభలో రాష్ట్ర ప్రయోజనాలను గురించి పట్టించుకోకుండా కేవలం తన పార్టీ ప్రయోజనాలో, తన నియోజక వర్గ ప్రయోజనాలో మాత్రమే చూసుకుంటున్నాడనుకోండి. అప్పుడుకూడా అతడు శాసన సభ్యునిగా ఉండదగడు. భారతరాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని ఇలా అర్ధం చేసుకుంటేనే సరిగా అర్థం చేసుకున్నట్లు.

ష రాష్ట్ర విభజనాధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందనడంతోనే అది దేశ సమస్య అనీ, దేశ ప్రయోజనాలకొరకుగా చేయవలసిన పని అనీ తేల్చేసినట్లు. కనుకనే ఒక ప్రాంతంగానీ, ఒక రాష్ట్రంగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, అసెంబ్లీగానీ, కడకు కేంద్ర ప్రభుత్వమైనా ఈ పని చేయలేదు. అది మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహించే సభ మాత్రమే చేయదగినది అని చెపుతోంది రాజ్యాంగం.

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న దేమిటి?

రాజకీయ ప్రాబల్యం కల వ్యాపారస్తులు, రాజకీయ వ్యాపారస్తులు, జాతీయ, రాష్ట్రీయ, ప్రాంతీయ పార్టీలు వారి వారి స్వప్రయోజనాలకోసం ప్రజల్ని పావులుగా వాడుకుంటూ ఆడుకుంటున్న ఆటగా తయారై ఉందిది. నిజంగా వారంతా తెగ వేదనపడిపోతున్నట్లు మాట్లాడే అభివృద్ధి కొరకు ఇదంతా అన్నట్లైతే, ఆ అభివృద్ధి ప్రాంతాల విభజన దగ్గరలేదు నిజానికి అది అధికార వికేంద్రీకరణ జరిగి, స్థానిక ప్రభుత్వాలేర్పడి, నిర్ణయాధికారం, పర్యవేక్షణాధికారం. చైతన్యవంతులైన పౌరులతో కూడిన గ్రామసభలకు దఖలవడం దగ్గరుందది. అది జరిగిన రోజున రాజకీయాలు వ్యాపార స్వభావాన్ని కోల్పోతాయి. దాంతో పంపిణీ వ్యవస్ధ సక్రమపడుతుంది.

ఇక మూడు ప్రాంతాల రాజకీయాల్లోనూ నోటితుత్తరగాళ్ళున్నారు. అందులో కె.సి.ఆర్‌. నెం.1 ఆయనే తెలంగాణా రాజ్యాధిపతి అన్నట్లుంటుందాయన వాగ్దోరణి. ఉండనిస్తాం. తిండితిననిస్తాం. కడుపు పట్టుకొన్నవాళ్ళను వెళ్ళగొట్టం అంటాడు. సరిహద్దులు దాటేదాకా పారగొడతామంటాడు. మూడు ప్రాంతాలలోని ఈ రకమంతా అంబేద్కర్‌ చెప్పిన ప్రజాస్వామ్యం పేరున సాగే నియంతలన్నమాట. అవి తాత్కాలికంగా ప్రజల్ని రెచ్చగొట్టడానికి పనికి వస్తాయేగాని, ఒక ప్రణాళికగా అమలు చేయడానికి పనికి వచ్చేవికావు. ఇంకా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నా స్థలాభావం సమస్య ఉంది గనుక, ముఖ్యమైన మరొక్క విషయం చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను.

రాజధాని సమస్య

1. హైద్రాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.

2. తెలంగాణ రాజధానిగనే ఉండాలది.

3. కేంద్రపాలిత ప్రాంతంగా ఉండాలి.

4. దేశానికి రెండో రాజధానిగా ఉండాలి.

5. కొంతకాలం పాటు ఉమ్మడి రాజధానిగ ఉండాలి.

ఇవే ఈనాడు హైద్రాబాద్‌ విషయంలో వినవస్తున్న వాదనలు ముందుగా ఒక్క విషయం మనమందరం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. తెలంగాణా రూపంలో రాష్ట్ర విభజన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. అదలా ఉంచండి. ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేకాంధ్ర, సమైక్యాంధ్ర అన్న మూడు వాదాల వాళ్ళూ రాజ్యాంగానుకూలత అంశాన్ని ప్రక్కన బెట్టే వారివారి స్వప్రయోజనాల దృష్టినుండే ఎవరియత్నాలు వాళ్ళు చేస్తూ వచ్చారు గనుక, వాటన్నంటి పర్యవసానంగా నెట్టుకొచ్చిన వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడేమి చేస్తే ఉన్నంతలో అందరకూ మేలు జరుగుతూందనేదే మనముందున్న ప్రధానాంశం అవుతోంది. పట్టించుకోవలసిన దీనిని ప్రక్కన బెట్టి గతాన్ని తవ్వుకుంటూ వాదులాడుకోవడం అవివేకం.

అసలింత ప్రాధాన్యత హైద్రాబాద్‌కు ఎందుకొచ్చింది?

మిగిలిన రాష్ట్రాభివృద్దినంతా ప్రక్కన పెట్టేసి, హైద్రాబాద్‌ను సర్వాంగేణా అభివృద్ధి పరచాలన్న తీర్మానం చేసుకుని మరీ, అటు రాజకీయులు, ఇటు పారిశ్రామికులూ, ప్రైవేటు పెట్టుబడిదారీ వర్గాలు విద్య, వైద్య ఔషధరంగాలతో సహా హైద్రాబాద్‌నే కేంద్రం చేసుకోవడం వల్ల వచ్చిన తిప్పలివి. మొత్తం రాష్ట్రానికంతటికీ వలస ప్రాంతంగా తయారు చేసేశారు దీనిని. ఒక మోస్తరు రాష్ట్రమంతగా తీరికూర్చుందది.

రాజ్యాంగ స్ఫూర్తి కనుగుణ్యంగా, ప్రజాస్వామ్య సమాజవాద సిద్దాంతాల కనుగుణ్యంగా ఆలోచిస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంపైనా ప్రత్యేక దృష్టి పెట్టి దానిని అభివృద్ధి పరచరాదు. అది సమానాభివృద్ధి అన్న రాజ్యాంగాశయానికి విరుద్దం దానికి మారుగా సిద్దాంతపరంగా చూస్తే ప్రణాళిక ఇలా ఉండాలి.

మండల స్థాయిలో చిన్న పట్టణాలు, ప్రతి జిల్లాకు ఒక మహానగరము, అందులో విద్య వైద్య రంగాలతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు, ప్రాకృతిక సహజవనరుల లభ్యతననుసరించి పెద్ద పరిశ్రమల ఏర్పాటు, వాటిల్లో స్థానికులకు, స్థానికేతరులకు 60 :40 నిష్పత్తిలో చట్టబద్దంగా ఉద్యోగావకాశాలు, అన్నవి ఆర్థిక సమానత్వం కోసమూ సోదర భావము నెలకొనడానికి, ప్రతిజిల్లాలోనూ సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నిర్భంధ ఉచిత విద్య, వైద్య సేవలు భోజన వసతులతో సహా ఏర్పాటు చేసి సాంఘిక సమానత్వాశయంతో స్థానిక ప్రభుత్వాల అజమాయిషీలో అవి నిర్వహింపబడేట్లు ఏర్పాట్లు చేయడమూ, రాజకీయ సమానత్వానికై అధికార వికేంద్రీకరణ రూపంలో స్థానిక ప్రభుత్వాలకు అధికారాలప్పగించి చైతన్యవంతమైన ఓటరులతో కూడి గ్రామ సభలు పాలనలో ప్రత్యక్ష భాగస్వాములయ్యేలా శ్రద్ధ తీసుకుంటే అప్పుడు మాత్రమే రాజ్యాంగ ప్రధానాశయమైన ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రజాస్వామ్యమన్నది ఆచరణలోకి రాగలుగుతుంది. అప్పుడు రాష్ట్రమూ సమానాభివృద్ధి కాక, సర్వోన్నతాభివృద్ధి నందడానికీ సూటైన దారి ఏర్పడేది. ఇప్పటికేగాదు, ఎప్పటికైనా మనం - జనం - అనుసరించాల్సిన శాస్త్రీయపద్దతి ఇదే.

విభజన కోరుకుంటున్న వాళ్ళూ, అయిపోయిందిగా సర్దుకుపోదాం అనుకుంటున్న వాళ్ళూ, ఇష్టం లేకున్నా చేసేదేమీ లేక ఊరుకుంటున్న వాళ్ళూ కూడా కొత్తరాజధాని తమ తమ జిల్లాలలో వస్తే బాగుండుననే అనుకుంటున్నారు, ఎందుకని? వారందరి ఆలోచనలూ, అనుభవాలూ కూడా ఎక్కడ రాజధాని ఏర్పడితే అక్కడ మాత్రమే అన్ని రకాల అభివృద్దీ కేంద్రీకృతమవుతుందనీ, మిగిలిన ప్రాంతాలు వివక్షకు గురవుతానే ఉంటాయనీ హెచ్చరిస్తున్నాయి కనుక. వరవడిగా మారిన దీనిని - ఈ ఆలోచననూ ప్రక్కకు నెట్టేయకుండా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా - ప్రణాళికారచనే సాధ్యపడదు. ముందీవైఖరినశించాలి. అందుకేంచేయాలి?

1) రాజధాని ప్రధానంగా పాలన నిర్వహణ కేంద్రంగా మాత్రమే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకుగాను మరీ పెద్ద పరిశ్రమలకు అవకాశమివ్వకపోవడము. మరీ విస్తారంగా స్థలసేకరణ చేయకుండడము నిబంధన రూపంలో తయారుచేయాలి.

2) రాజధాని లేని జిల్లాలలో పట్టణాల నగరాల అభివృద్ధికి అవసరమైన ప్రత్యేక కేటాయింపులు, పారిశ్రామిక క్షేత్రాల అభివృద్ధికి రాజధానిలోకంటె ఎక్కువ అవకాశాలు కల్పించాలి.

3) విభజనకు సంబంధించిన న్యాయబద్దమైన వాటాల పంపిణీ, నష్టపరిహారము రాష్ట్రం నుండి అందేట్లు దానితో పాటు అదనంగా ప్రతిజిల్లానూ అభివృద్ధి పరచేందుకు కేంద్ర నిధుల నుండి తగినంత మొత్తంలో నిధుల కేటాయింపు సత్వరం విడుదల జరగాలి.

4) నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసి యోగ్యులైన వారి పర్యవేక్షణలో అత్యవసర కార్య క్రమంగా నిర్ణయించి రెండేళ్ళలోపుగా పూర్తి చేయాలి. ఈ విషయంలో మళ్ళా వ్యాపార రాజకీయాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సంఘహితైషులైన పెద్దలూ, నిపుణులు, విశ్రాంత న్యాయమూర్తుల సమష్టితో పర్యవేక్షక మండలిని ఏర్పరచాలి. అఖిల పక్షాలకూ అందులో ప్రాతినిధ్యం ఉండేలా చూసుకుంటే మరీమంచిది.

5) రెండవ ఎస్‌.ఆర్‌.సి ఈ దేశావసరం. పనిలోపనిగా కేంద్రం దానిపై దృష్టిపెట్టి, దానిని అమలుపరిస్తే దాని ద్వారా రాష్ట్ర సరిహద్దుల ఏర్పాటులోగానీ, జిల్లాల పునర్మిర్మాణం విషయంలోగానీ ప్రస్తుత పరిస్థితులకు రాబోయే కాలానికీ అనుగుణంగా ఉండేలా శాస్త్రీయ పద్దతుల్ని పాటించవచ్చు. ఈ సందర్భంలో కె.సి.ఆర్‌. తెలంగాణను 24 జిల్లాలుగా చేసుకుంటాం అని ప్రకటించినట్లు సీమాంధ్ర జిల్లాలను కూడా ఒక శాస్త్రీయమైన హేతుబద్దమైన రీతిలో మరికొన్ని జిల్లాలుగా విభజించుకోడానికీ వీలుంటుంది.

ముగింపు :- ఇదంతా రాజ్యాంగంలోని ప్రస్తావన ద్వారా మనం భావిభారత నిర్మాణ లక్ష్యాలుగ ఏర్పరచుకున్న చిత్రాన్ని అర్థం చేసుకుని, ఆచరణాత్మకం చేయడానికి పూనుకున్నప్పుడే సాధ్యం. రెండు ప్రాంతాలూ ప్రాంతీయ తత్వం సమసిపోయేలా ఉద్యోగవ్యాపారాలతోనేగాక, వివాహ నివాస సంబంధాలలోనూ ఉమ్మడి తనం ఏర్పడేలా ఒక వరవడిని సృష్టించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయాలు ప్రజల పనులు చేసిపెట్టేవిగాకాక, ప్రజల పర్యవేక్షణలో పనిచేసేవిగా మార్పు చెందాల్సి ఉంది.

No comments:

Post a Comment