Tuesday, October 1, 2013

సంపాదకీయం

రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయ సంక్షోభాన్ని చూస్తుంటే, దేశం ఎటుపోతోంది? ఏమైపోవనుంది అన్న ఆందోళన కలుగుతోంది. ఒక్కడంటే ఒక్కడూ, సభ్యతా సంస్కారాలతోగానీ, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణ్యంగా గానీ, మాట్లాడుతున్న దాఖలా లేదు. జనంలో ఆవేశాలను రగిలించే పనినీ దాటి రాను రాను బూతులు తిట్టుకోవడంలోనూ పోటీ పడుతున్నారు. ఏ ఛానల్‌ను చూద్దామన్నా కనపడే దృశ్యాలూ, వినపడే మాటలూ ఒక్క తీరునే ఉంటున్నాయి. పెద్ద తరహా మనుషులకైతే అసహ్యాన్నీ కలిగిస్తున్నాయి. డబ్బులున్నాయి, పదవులున్నాయి వెంటమందా ఉంది కనక డాబూ దర్పం ప్రదర్శించడానికే అడ్డూ ఆపు ఉండడం లేదు గాని, నోరు తెరిస్తే చాలు వీళ్ళంతా ఎంత దిగజారిన (హీన) స్థాయి మనుషులో ఇట్టే తెలిసిపోతూ ఉంది.
పాలన పరమైన ఏ విషయాన్ని తీసుకున్నా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, వివక్ష పర్వతాకారంలో దర్శనమిస్తున్నాయి. దిక్కుమాలిన మంద, మందినెత్తిన పెత్తందారులై కూర్చుని, దేశానికే ప్రాణ స్థానీయమైన వ్యవసాయానికి ఆధారమైయున్న నీటి వనరుల్ని సంరక్షించుకునే, సద్వినియోగం చేసుకునే పనిలోనూ తప్పుడు పోకడలేపోతున్నారు. 40 ఏండ్ల క్రితం మొదలెట్టిన ఆనకట్టల నిర్మాణాలూ పూర్తికాలేదిప్పటికీ, ఆనాడు 4, 5 వందల కోట్లతో 2, 3 ఏండ్లలో నిర్మించగలమనుకున్నవి కాలం మారింది, ధరలు పెరిగాయి అన్న ఒకే ఒక ఒంకతో, వాస్తవంగా పెరిగిన ధరలకనుగుణ్యంగాకాక, అందుకు అనేకరెట్లు పెంచి తలాయింత దండుకుంటున్నారు. కట్టవలసి ఉన్న ప్రాజెక్టులన్నింటిపైనా 'లక్షా ఎనభై వేల కోట్లకు టెండర్లు పిలిచినట్లు, సుమారు 80, 90 వేల కోట్లు విడుదలైనట్లు లెక్కలు తెలుపుతున్నాయి. ఆ దామాషా ప్రకారం జరగాల్సిన పనులు థాబ్దాలు గడిచినా జరగనేలేదు. విడుదలచేసిన ఆ డబ్బులో ఎవరెవరికెంత ముట్టిందో, అసలు నిర్మాణం పనికి ఎంత చేరిందో తెలుసుకోగలిగితే సామాన్యుల గుండెలైతే ఆగిపోతాయి కూడా. పరాన్న భుక్కులు, రక్తం పీల్చే జలగలు అన్న పదాలు 100% వీరికి సరిపోతాయి.
ఒక్క ఉదాహరణ చెపుతాను 1988 నాడు ఎన్‌.టి. రామారావుగారు పులిచింతలకు శంకుస్థాపన చేసే నాటికి ప్రాజెక్టు నిర్మాణ వ్యయపు అంచనా 270 కోట్లు. 95 నాటికి దానిని 500 కోట్లన్నారు.
2011 నాటికి అది 1300 కోట్లయ్యింది. వాస్తవంగా నిర్మాణవేగం పెంచిందీ సమయం నుండే. గట్టిగా పూనుకుంటే 2 1/2 సం||లలో పూర్తి చేయగల నిర్మాణమది. సంకల్పించి 26 ఏండ్లు దాటింది. ప్రస్తుతం దాని నిర్మాణ వ్యయాన్ని 2,600 కోట్లంటున్నారు. మూడు వేల కోట్లని తలాకాస్త పంచుకున్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఇదీ పరిస్థితి.
రాజ్యాంగ నిర్మాతల దృష్టిలో మనమంతా 'ఒకేజాతి, ఒకే ప్రజ, దేశమంతా ఏకఖండమే' సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం, అన్న రెంటి కొరకుగా గీసుకున్నవే (ఏర్పరచుకున్నవే) రాష్ట్రాల, జిల్లాల సరిహద్దులన్నీ. ఈ విషయాన్నంగీకరించకుండా చేసే వాదనలుగానీ, కోరే కోర్కెలు గానీ, మరేవైనా గానీ, రాజ్యాంగానుకూలమైనవి మాత్రం కాజాలవు.
కేంద్రం తెలంగాణా విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని 3.10.2013 రాత్రి ప్రకటన వెలువడ్డ వెంటనే టిడిపి నేత చంద్రబాబు గారు, వైకాపా నేత జగన్‌గారూ (చంద్రన్న, జగనన్న గార్ల) రెండు ప్రకటనలు విడుదల చేశారు. ఆంధ్రజ్యోతి 4.10.2013 నాటి దినపత్రికలో వచ్చాయా వివరాలు.
చంద్రబాబు గారి ప్రకారం :- సోనియా గాంధీ (కాంగ్రెసు)కి, టి.ఆర్‌.ఎస్‌, వైకాపాలతో అవగాహనుంది.
జగన్‌గారి ప్రకారం :- ఈ రాష్ట్రంలో కాంగ్రెసు, చంద్రబాబు కలసి పొయ్యారు.
ఏమిటీ ప్రకటనలు? సిగ్గుపడే లక్షణం లేకపోవడం వల్లే, ఇంత విడ్డూరమైన వార్తలు వస్తున్నాయి. జనం ఇదేమిటని అడగరు సరికదా ఎవరి దొరని వాళ్ళు భుజాలకెత్తుకుని మోస్తుంటారు. ఈ దేశానికిది ఎంత విషాదకర పరిస్థితి?!
ఇవి చాలదన్నట్లూ, మేమూ ఆ బళ్ళో చదువుకున్నవాళ్ళమేనని చెప్పాలనో, మిగిలిన నాయకులూ ఇదే బాటన నడుస్తున్నారు. ప్రతివాడు మిగిలిన వారిని కాంగ్రెసుతో కుమ్మక్కైయారని బల్లగుద్ది మరీ ప్రకటనలు చేసేస్తున్నారు. ఈ మొత్తానికి అసలు కారణం -మూలవేరు -ఎక్కడుందో తెలుసా? గింత విత్తానికీ, కూసింత మత్తునీళ్ళకీ లొంగి, ఈ రకాన్నంతా ఎంపిక చేసి నెత్తికెత్తుకున్నారు చూడండి, ఆ బుద్దిహీనులైన ఓటర్ల మెదళ్ళలో ఉంది. తరవాతి కారణం, తిన్నదరగనంత సంపాదించుకుంటూనే, గింత చదువు సంధ్యా ఉండీ ఓటు వేయకుండా ఇండ్లలో పండడమో, క్లబ్బుల్లో వుండడమో చేస్తుండే రకం ఓటర్లు. మొత్తంమ్మీద ఈ పాపం అనర్హుల్ని ఎన్నుకున్న ఓటర్లదే. కనుక అనుభవించాల్సింది వాళ్ళే.
మేధావుల కర్తవ్యం
ధర్మ పక్షానికీ, అధర్మపక్షానికీ నేతృత్వం వహించేది మేధావులే. సామాన్యులు ఆ తలగలవాళ్ళకు శరీరంగా (భౌతిక శక్తిగా) పని చేస్తుంటారంతే. కనుకనే సామాజిక స్థితికీ, గతికీ కూడా మేధావులు నిమిత్త కారణం అవుతుంటారు.
ఎప్పటికప్పుడు అప్పటికున్న థ నుండి సమాజాన్ని నడిపించడానికి దిశా నిర్ధేశం చేస్తూ, చోదక శక్తిగా ఉంది, ఉంటున్నది ఉండగలిగిందీ కూడా మేధావులే.
చెడ్డవాళ్ళ దుర్మార్గం కంటే, మంచివాళ్ళ మౌనం మరింత ప్రమాదకరమైంది.
అసాంఘిక శక్తులింతగా పెచ్చరిల్లుతున్నాయంటే అందుకు కారణం అభ్యుదయ శక్తులు అసంఘటితంగా ఉండడమే.
సమర్థత ఉండీ అధర్మాన్ని నిలువరించక ఎవడు ఉపేక్ష వహిస్తాడో వాడు సమూలంగా నశిస్తాడు.
ఇలాటి సూక్తులు - కాచివడపోసిన సూత్రీకరణలు - అన్నీ మేధావుల నుద్దేశించి, వాళ్ళ కర్తవ్యాన్ని గురించి హెచ్చరిస్తున్నవే. మేధావులు మూడు సమూహాలుగ (రకాలుగా) ఉంటున్నారు. (1) దుష్ట మేధావులు (2) శిష్టమేధావులు (3) నిర్లిప్తమేధావులు ఈనాటి అపసవ్యతలలో ఎక్కువలో ఎక్కువ ఆ ముగ్గురిలోనూ ఒకటవరకం సాగిస్తున్న దురాగతాలే. ఇక శిష్టమేధావులు కొద్దిమంది ఉన్నా వారంతా ఎవరెవరి ప్రాధాన్యతలననుసరించి వారు, వారెంచుకున్న క్షేత్రాలలో క్రియాశీలంగా పని చేస్తూ పోతుంటారు. ఈ రకం క్రిందికి వచ్చేవారిలో ఎక్కువ మంది ప్రక్కవారితో కలవరు, కలుపుకుపోరు. వీరిలో నున్న స్వతంత్రాలోచనాశీలతే, తన అవగాహనపైనా నిర్ణయాలపైనా తనకున్న తనదే సరైందన్న దృష్టే; ఇతరులు చెపుతున్న దానిని సరిగా విననీయదు, పునరాలోచన చేయనీయదు. ఇలాటి మంచివారైన మేధావుల్ని బహుగా అనుభవంలో చూడడం ద్వారానే ఒక నానుడి పుట్టింది. ''సామాన్యుల్ని వెయ్యి మందినైనా ఒక బాటంట నడిపించవచ్చుగానీ, ఆలోచనా పరుల్ని నలుగుర్ని కొద్దికాలం కూడా ఏకబాటన నడపలేము'' అన్నదే అది. నలుగురు ఆలోచనాపరులూ ఏకాభిప్రాయానికి రాకపోగా, రాలేకపోగా, ఏకాభిప్రాయానికి వస్తే వాళ్ళు మేధావులెందుకవుతారయ్యా, అనే వాదననూ ముందుకు తెస్తున్నారు కొందరు. భిన్నాభిప్రాయాలున్న అంశాల్ని తాత్కాలికంగానైనా ప్రక్కనబెట్టి, వచ్చిపై బడ్డ అత్యవసర విషయాలలో, సమానాభిప్రాయం ఉన్న వరకైనా (తక్షణావసరము, మౌలికమునైన వాటివరకైనా) కలసి కదలగలిగితే ఎంత బావుణ్ణు
వీరిరువురూ కాక మిగిలిన మూడోరకం మేధావులు నిర్లిప్తమేధావులు. వీరికి విషయాలు అవగతమవుతూనే ఉన్నా, కొంత మేర పరిష్కారాలనూ సూచించగల మేధోసామర్ధ్యమున్నా, దేనినీ పట్టించుకోరు. ఎక్కడన్నా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మాత్రం అప్పటి కనిపించింది మాట్లాడేసి, ఇవన్నీ మాకూ తెలుసులేవో, ఊరకే వ్యర్ధ ప్రయత్నాలెందుకు చేస్తారు! ఊరుకుండండంటూ మరికాస్త నీరసాన్ని ఇంజెక్టు చేస్తారు పనిచేస్తున్న వాళ్ళకి. ఈ వర్గమే క్రియాశీల మేధావులకంటే అధికంగా ఉంటోంది.
దుష్ట మేధావులేమో స్వార్థ ప్రయోజనాలుంటాయి కనుక కలవగలిగిన ప్రతిచోటా కలిసిపోతూ, వచ్చిదాంట్లో వాటాలు పంచుకుంటూ సాగుతున్నారు. శిష్ఠమేధావులు తామనుకున్న దానికి పరిమితమై, కలసిపని చేయడానికంత సుముఖంగా లేరు, ఇక మూడోరకం మాటలకు పరిమితమై, పనికి సిద్దం కారు, పని చేసే వారిని వెనక్కులాగుతుంటారు.
స్వతంత్ర యోచనాశీలురైన మేధావులారా! ఇదే మనందరి ముందున్న, సమాజం ముందున్న అసలు సమస్య. దీని నుండి సమాజమనే శరీరంలో తలభాగానికి ప్రతీక అనదగ్గ శిష్ట మేధావులు ఉన్న నలుగురూ కలసి, నిర్లిప్త మేధావులలో కదలిక తేగలిగినంత వరకైనా వారినీ చైతన్యపరచి, అందరం కట్టగట్టుకుని దుష్టమేధావుల కుటిలయత్నాలను భగ్నం చేయడమూ, ప్రజా సంక్షేమానికి తగిన దిశా నిర్ధేశం చేస్తూ జన సమూహాన్ని ఆ దిశగా కార్యోన్ముఖులను చేయడము అన్న పనికై ఉద్యమించాల్సి ఉంది. ఈరకం పూనుకోకుండా ఈ దేశ ప్రజలకు కోరదగ్గ భవిష్యత్తే లేదు. అభ్యుదయ శక్తులు సంఘటితం కావడమన్నదగ్గరే అస్సలు సిసలు పరిష్కారం ఉంది. సామరస్య పూర్వక సహకార సంబంధాలే వర్తమాన సామాజికావశ్యకత అన్నది గమనించండి.
స్పందన - ప్రతిస్పందన
స్పం :- (1) :-  హేతువాదం తత్వం, సిద్దాంతం, సూత్రం, విధానంపై మీరు ఇంత కూలంకషంగా, వివరంగా వ్రాయడం సంతోషాన్ని కలిగించింది. ఇది మంచి సామాజిక పరిణామం. ఆశాజనకం. ఈ విషయంలో మిమ్ము మరోసారి అభినందిస్తున్నాను. 24-7-2013 నాటి లేఖ.
భువనగిరి నుండి మూర్తిగారి జనార్ధన్‌ గారిలా వ్రాస్తున్నారు మీరు చేస్తున్న హేతువాద పునర్వికాస యత్నానికి అభినందనలు. హేతువాదము, మరియు హేతువాద ఉద్యమ వికాసానికి చేపట్టవలసిన కార్యక్రమాలను మిత్రులతో చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా హేతువాద ఉద్యమాన్ని సామాన్య ప్రజలవద్దకు తీసుకురావాలి. కేవలం వేదిక వరకే పరిమితమైతే విస్తరించదు. హేతువాదం అందరికీ కావాలి. హేతువాద ఉద్యమం అందరిదీ. దాని ఫలాలు అందరికీ అందాలి. అది మనందరి సామాజిక బాధ్యతగా భావించాలి. విమర్శలు వస్తూనే ఉంటాయి. అది సహజం కనుక, మన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండాలని నా అభిప్రాయం. 6-8-2013 నాటి లేఖ.
ప్రతి స్పందన :- మూర్తి గారి జనార్ధన్‌గారికి; ఒక విషయంలో స్పష్టత రానంత వరకు, ఎవరెన్నెన్ని మాటలు, ఎంతగా మాట్లాడినా, అసలు విషయం ఆచరణలోకి రాదు. అదేమంటే; ఇంతకూ హేతువాదమంటే ఏమిటి? హేతువాదం పేరున ప్రజలలోకి తీసుకెళ్ళాల్సిన విషయాలేమేమిటి? అన్నది స్పష్టంగా తేలకుండా ఏమి ఉద్యమం చేస్తాము? హేతువాద ఉద్యమాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకెళ్ళాలన్నారు. ఎవరు తీసుకెళ్ళాలి? ఇంతకాలం ఆ పని ఎందుకు జరగలేదు?
నాకు తెలిసి ఈ ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పుకోవాలి. భావజాలాన్ని సమాజంలో విస్తరింపజేసే కార్యకర్తల నిర్మాణం జరగాలి. అదింత వరకూ సరైన రీతిలో, సరిపడినంతగా జరగలేదు. ఉద్యమ వ్యాప్తి సామాజికావసరమన్న విషయంగానీ, అది మన సామాజిక బాధ్యత అన్న విషయంగానీ, చేతల దాకా సాగేంత తపన లేదు ఉన్న నలుగురికైనా. కనుకనే అప్పుడప్పుడూ సందర్భం వచ్చినపుడు మాట్లాడుకోడానికో, సూచనలు, హెచ్చరికలు చేసుకోవడానికో పరిమితంగానే ఉంటోందది. ఈ విషయాన్నే సూత్రప్రాయంగా, ఉద్దేశ స్పష్టతతోబాటు తీవ్రతా ఉంటేనే పని జరుగుతుంటుందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు హేతువాదులమనుకుంటున్న వారిలో ఎక్కువ మందిలో ఉద్దేశ స్పష్టతలేదు. ఉన్న కొద్ది మందిలో ఉండాల్సినంత తీవ్రత లేదు. ఇదే ప్రధాన కారణం.
ఇక రెండో సమాధానం, హేతువాదాన్ని సామాన్యుల దగ్గరకు తీసుకువెళ్ళడం ఒక పట్టాన అయ్యే పనికాదు. ముందుగా ఒకింత యోచనాపరుల దగ్గరకైనా తీసుకెళ్ళే పని చేయగలిగితే తొలిథలో అక్కడికదే గొప్ప. దీనంతటికీ ముందు సిద్దాంతం గుది గుచ్చబడాలి. లేకుంటే ఒక్కో ముఖం నుండి ఒక్కో హేతువాదం పుట్టుకొస్తుంటుంది. అందుకనే ఆ దిశగా ప్రయత్నం మొదలెట్టాను. అవగాహన, మనస్సు ఉన్న వాళ్ళు కలసిరావాలి మరి, నా వైపు నుండి మాత్రం అందరికీ ఆహ్వానమే. ఇక విమర్శలంటారా! విషయ నిష్ఠకల విమర్శల్ని ఆహ్వానించాల్సీ ఉంటుంది. నిందల్ని విమర్శలనుకునే అపోహ నుండి ఉద్యమాలు బైటపడాల్సి ఉంది. ఉద్యమ యత్నంలో పాలు పంచుకోగల మిత్రులందరికీ కబురు చేయండి.
స్పందన -2 : హైద్రాబాద్‌ నుండి ఫజులుర్‌ రహ్మాన్‌ గారిలా వ్రాశారు. 'భౌతికవాది' 2013 జులై, ఆగస్టు సంచిక 13వ పేజీలో 'విశ్వం - మనిషి' అనే అంశంపై వ్రాసిన వ్యాసంలో,
''మన మత గ్రంథాలన్నీ భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, చుక్కలు అన్నీ తిరుగుతున్నవి - అనే అన్నాయి'' అని వ్రాశారు. దాని పై నేను స్పందిస్తూ, ఒక ముస్లింగా నేను, ఖురాన్‌లో అలాంటి అర్ధాన్నిచ్చే వాక్యం ఒక్కటి కూడా లేదు కదా! మీరు తెలియక వ్రాశారా? తెలిసి వ్రాశారా? అని అడుగుదామని 10-9-13 ఉదయం లయశ్రీ గారికి ఫోను చేశాను. ఈ విషయాన్ని వివరించే యత్నం చేస్తుండగనే, ఆయన నా మాటలు వినకుండా మాట్లాడడం మొదలెట్టి, (1) ఇది సైన్సుకు సంబంధించిన విషయమని, (2) తన దగ్గరా బైబిలు, ఖురాను గ్రంథాలున్నాయని, (3) నా పుస్తకంలో నీకు నచ్చింది తీసుకో, నచ్చనిది వదిలేయ్‌ అనీ, (4) మీరు సాంప్రదాయ ముస్లింలలాగున్నారు నేను వాదనలు చేయను అనీ (5) తనకు సమయంలేదనీ అంటూ ఫోన్‌ కట్‌ చేశారు.
ఇది నాకు ఇబ్బంది కలిగించింది. మళ్ళీ ఫోన్‌ చేసి ఒక్క నిముషం సమయమడిగి, నా ప్రశ్నేమిటో తెలిపాను. నా ప్రశ్న అర్థమైందో లేదో కాని, తన దగ్గర సమయం లేదంటూ మళ్ళా ఫోన్‌ కట్‌ చేశారు. సురేంద్ర గారూ! ఇదంతా మీ కెందుకు తెలుపుతున్నానంటే; లేనిది ఉన్నట్లు చెప్పడమేనా భౌతిక వాదమంటే ? ఉంటే ఆధారం అడిగితే ఎందుకు చెప్పడంలేదు?
(2) తమ దగ్గర అంతగా సమయం లేనివారు రకరకాల పేర్లతో ఉద్యమాలు అంటూ ఎందుకు ప్రారంభిస్తున్నారు?
(3) లేని విషయాల్ని ప్రజలలోనికి ప్రచార సాధనాల ద్వారా పంపిస్తూ; ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే వదిలేయండి, అనడమేమి పద్దతి?
(5) భౌతిక వాదమంటే వారు చెప్పింది ప్రశ్నించకుండా నమ్మడమని అర్ధమా?
మీ వివేకపథం పత్రిక ద్వారానైనా వివరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రతిస్పందన :- (2) మిత్రులు ఫజులుర్‌ రహ్మాన్‌ గారికి; నిజానికీ లేఖాంశాలకు మలయ శ్రీ గారు సమాధానాలు చెపితేనే సమంజసంగా ఉంటుంది. అయినా మనకున్న పరిచయాన్ని బట్టీ, మీరు లేవనెత్తిన ప్రశ్నలు సాధారణ స్వభావం కలిగినవిగా ఉండడాన్ని బట్టీ సమాధానాలు వ్రాస్తున్నాను.
(1) ఎవరైనా సరే, తను ప్రకటించిన అభిప్రాయాలు సరైనవేనని నిర్థారించే బాధ్యత వహించితీరాలి. ఇందులో ఎవరికీ మినహాయింపు లుండకూడదు. ఇది భావజాల క్షేత్రానికి సంబంధించినంతలో నైతిక బాధ్యత అవుతుంది.
(2) నాహేతు బుద్ధికి; మలయ శ్రీ గారు (లేదా ఆవ్యాసరచయిత) ''గతంలో అన్ని మత గ్రంథాలూ, భూ కేంద్ర సిద్దాంతాన్నే సరైందనుకుంటుండేటివి'' అన్న అభిప్రాయంతో ఆ మాటలు వ్రాసి ఉంటారనిపిస్తోంది. ఖచ్చితమైన అర్థం పెట్టుకుని ఆ మాటలు వ్రాసి ఉండకపోవచ్చు. కానీ; పత్రికలో లేదా రచన రూపంలో ప్రకటించే అలాటి అభిప్రాయ ప్రకటనలకు ఆధారాలు పెట్టుకుని ఉండడం, అడిగినప్పుడు చూపించడం అన్నది సైద్దాంతిక స్థాయి కల పత్రికలకు తప్పని సరి.
(3) ఈ ముఖంగా నేను మీ ఇరుపక్షాలకూ ఒక మిత్రునిగా నిజాయితీతో చేయగల హిత సూచనేమంటే, భావ విప్లవ క్షేత్రాలలో పని చేసే వ్యక్తులూ, పత్రికలు, కథలూ, నవలల మాదిరి కాకుండా, శాస్త్రీయ వైఖరి, స్థాయి కలిగి ఉండే రీతిలో అభిప్రాయాలు ప్రకటించే విధానాన్ని స్వీకరించాలి అనుసరించాలి. ప్రశ్నించడం నేర్పుదాం అంటూ మొదలెట్టిన క్షేత్రాలూ, ప్రశ్నించకు అనడం బావుండదు కదా! అలాగే మక్కికి మక్కీ అర్థం చెప్పి మా గ్రంథం అలా ఎక్కడనింది లాంటి నిగ్గ దీసుడు కంటే, అన్నీ ఉన్నాయంటున్న ఆయా ప్రధాన మత గ్రంథాలలో దేనిననుసరిస్తున్న వారైనా, ఈ నాటి వైజ్ఞానికులు ప్రకృతిని గురించి ప్రయోగ పూర్వకంగా తెలుసుకున్న విషయాలతో పోలనీ, విభేదించే అంశాలు మత గ్రంథాలలో ఉన్నప్పుడు, ఎదుటి వారిని అడిగినంత నిక్కచ్ఛిగానూ, తమని తామూ ప్రశ్నించుకోవడం సరైందవుతుంది. భౌతిక, అభౌతిక వాద పక్షీయు లిరువురూ దీనిని గురించి ఆలోచించవలసి ఉంది. ఏమంటారు? ఈ సందర్భానికి సరిపడిందే ఒక ఘటన చెపుతాను, చాలా కాలంగా పలు దఫాలు మూర్తిగారి జనార్థన్‌ గారు వివేక పథంలో ఇతర రచయితల రచనలకూ చోటు కల్పించండి. పత్రికలో విభిన్న భావాలకు చోటు కల్పించండి. అంటూ సూచిస్తూ వచ్చారు. ప్రతిసారీ వారికి నేను, తమ భావాలు సరైనవేనని నిరూపించే బాధ్యత కల వారెవరి రచనలనైనా స్వీకరించడానికి నేను సిద్దము. అలా కాక తమ భావాలు సబబు బేసబబులకు బాధ్యత వహించని రచనలను భరించేంత సహనంగానీ, శక్తి గాని నాకు లేవు అంటూ వచ్చాను. ఒప్పుభావాలే సమాజంలోకి వెళ్ళాలి. తప్పుభావాలను సమాజం నుండి వెళ్ళగొట్టాలనుకునే వారికీ నిష్కర్ష తప్పని సరి.
స్పం (3) :- మిత్రులు సురేంద్ర గారి కంటూ పిఠాపురం నుండి గౌరవ్‌ ఇలా వ్రాస్తున్నారు. వివేక పథం పత్రికలన్నీ తీరిక చూసుకుని చదివాను, అనేక తాత్వికాంశాల పట్ల భిన్న సైద్దాంతిక ధోరణులకు చెందిన వాదనలనన్నిటినీ సమాజహితం కోసం చర్చకు (పరీక్షకు) పెట్టే బృహత్తర కార్యక్రమాన్ని నెత్తికెత్తుకుని, నిజాయితీగా కొనసాగిస్తున్నందుకు మీకు నా హృదయ పూర్వక అభినందనలు. మీ పట్ల కఠినంగా వ్యవహరించిన వార్ని సైతం సాదరంగా సామరస్య పూర్వక సమావేశాలకు ఆహ్వానించడం, అవాంఛనీయ శత్రుపూరిత వైఖరుల్ని విడవడానికి ముందుకు రావడం, సమాజ హితం కోరేవారందరూ కలసి పని చేయాల్సిన అవసరముందని ప్రతిపాదిస్తూ ఐక్యమిత్ర మండలి వేదికల్ని నిర్మించేందుకు కృషి చేయడం, ఇవన్నీ నాలాటి వారికి స్ఫూర్తి నిచ్చేవే. నిజానికి మన పరిచయానికి ముందే మీ మీద ఎన్నో ఆరోపణలు విన్నాను. వివేక పథాన్ని ఇప్పటి దాకా చదవడమే కుదర్లేదు. ఇప్పుడు చూస్తోంటే భావవికాసోద్యమానికి మీ వంతు చేస్తున్నారనిపిస్తోంది. మనం చర్చించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సమయం చూసుకొస్తాను. ఈ రోజు 'మద్యం' ఒక బలమైన సమస్యని నా ఉద్దేశం. దీనిపైనా చర్చించాల్సి ఉంది.
ప్ర.స్పం : (3) యోచనాశీలత కల గౌరవ్‌కు; నా గురించి మీరు గమనించినంతలో మీరు వెళ్ళడించిన అభిప్రాయాలు నన్ను మీరు సరిగనే చూస్తున్నారనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా మండలి నిర్వహించిన తత్వ చర్చావేదిక అభూత పూర్వం. ఆ వేదిక నియమనిబంధనల తీరూ అపూర్వమైనదే. ఇక ఆరోపణలంటావా! అవి పుట్టకుండా ఆపడం చాలా కష్టం. వివిధ వ్యక్తులు వివిధ దృష్టికోణాల నుండి మనల్ని చూస్తుంటారు. కనుక అలాటి వాటిలో వారి వారి రంగుల్ని మనకు పులిమే వారూ, వాస్తవాలను వెళ్ళడించేవారూ ఉంటారు. వాస్తవాలన దగ్గ వాటిని తక్షణం, నిజాయితీగా స్వీకరించి అవసరమైన మార్పులు చేర్పులూ చేసుకుంటుండాలి సత్యానికి పెద్దపీట వేయగలిగిన వారంతా. ఇక పులుముడు రూపాలను వీలైనంత వరకు సహించడం, పాఠకులకూ అవగాహన కలిగిస్తుంది, అపోహలను తొలగిస్తుందనుకుంటే ప్రతి విమర్శకు సిద్దపడడం అన్నది వివేకవంతమవుతుంది. చాలా మాట్లాడాలన్నావు కనుక వీలు చూసుకుని వీలైనంత త్వరలో కలువు.
స్పం (4) :- తూ||గోదావరి జిల్లా, గొల్లపాలెం నుండి ఆ కేటి సూరన్న (హేతువాది) గారిలా వ్రాస్తున్నారు (1) మీ వివేకపథం - 198, 200 సంచికలు చదివాను. మీ సుదీర్ఘ సత్యాన్వేషణలో హేతువాద ఉద్యమావశ్యకతను గుర్తించినందులకు చాలా సంతోషము.
(2) హేతువాదుల లక్ష్యం భావవిప్లవం. అన్ని రకాల మౌడ్యాలకు, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలమైన దైవభావన, మత భావజాలాలపై విమర్శతోనే హేతువాదం మొదలవుతుంది. ఆ తరవాత, అక్కడితో ఆగక మానవ వాదం వైపు పయనిస్తుంది.
(3) ఇప్పుడున్న హేతువాదులు అంటే హేతువాద వైఖరినంగీకరించిన వారెవరైనా, దేవునిపై నమ్మకంలేని హేతువాదిగనే తమను తాము చెప్పుకుంటారు. సమాజం కూడా ఆ అర్థంలోనే వారిని అంగీకరించుచున్నది. మిమ్మల్ని మీరు ముందుగా ఆ విధంగా హేతువాదిగా ప్రకటించుకుంటేనే, హేతువాదోద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ప్రయత్నాలు సఫలమవుతాయని నా అభిప్రాయం.
(4) అలాకాక; నేనుమెరుగైన సమాజస్థాపన లక్ష్యంగా కల్గి, అందుకు సక్రమాలోచన, మరియు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నాను కాబట్టి నేను కూడ ఆ మేరకు హేతువాదినే అనిగాని; దేవుని పై నమ్మకం లేనివానిగా నేనింకా ఆ భావజాల స్థాయికి చేరలేదనిగాని, అసలా విషయం అంత ముఖ్యం కాదనిగానీ, దేవుని ఉనికి విషయంలో ఎలా ఆస్థికవాదం రుజువు కాలేదో అలానే హేతువాదమూ రుజువు కాలేదు. కనుక నేను మూడవ పక్షంవైపు ఉన్నానని పాత పాఠమే చెపుతుంటేగాని, హేతువాద సంఘాలు మీ భాగస్వామి పాత్రను అంగీకరించవు. మీ దగ్గరకు చేరవుకూడా.
(5) మీరు ప్రయత్నించే హేతువాద పునర్నిర్మాణ కార్యక్రమంలో, మీ నూతన హేతువాద నిర్వచనంలో; హేతుబద్దాలోచన ముందుగా దైవ భావనపై సంధించుట దాని ప్రధాన లక్ష్యం కాదన్నా, దాని అనుబంధ పదాల అర్థాలు ఎంత వివరించి చెప్పినా, దాని తాత్విక విధానాన్ని మార్చినా, ఆ విధమైన హేతువాదంతో ఎంత మందిని ఏకాభిప్రాయానికి తీసుకురాగలరో ఆలోచించగలరు. ఇందుకు భావసారూప్యత గల సంఘాలు అసలే అంగీకరించవు.
కాబట్టి నా సలహా ఏమంటే, గతంలో వివేకపథం 186, 188 సంచికలాధారంగా నేను వ్రాసిన విధానాన్ని సూచనలను ఆధారం చేసికుని, మీ మండలి స్థాయిని తగ్గించుకోకుండగనే, కృషి చేస్తే మంచిదని నా అభిప్రాయం - ఇందులో ఆ నాటి లేఖ కాఫీని కూడా జత చేస్తున్నాను.
ప్ర స్పం :- యోచనాశీలురూ మిత్రులూ సూరన్నగారికి; మీ లేఖా రీతి మీలోని సమాజం బాగుండాలన్న ఆకాంక్షను తెలుపుతోంది. దాంతో బాటు కొన్ని అభిప్రాయాల విషయంలో నాతో విభేధిస్తున్నట్లూ, అయినా నన్ను వ్యతిరేక (శతృ) వర్గం వాణ్ణిగా కాక, మిత్ర వర్గానికి చెందిన వాణ్నిగనే తలంచుతున్నట్లూ తోపింపజేస్తోంది. మీ రెండు లేఖాంశాలూ కేవలం మన ఇరువురికి సంబంధించినవిగా మాత్రమేగాక, సమాజావగాహనకూ పనికి  వచ్చేవిగానూ, ఆలోచించదగినవిగానూ ఉండడంవల్ల, ఆలోచనాపరుల ఆలోచనకకు దోహదపడతాయనిపించిన రీతిలో అంశాల వారీగా ఒకింత విశ్లేషణ చేయడం మంచిదనిపించింది. అందుకే ఈ లేఖ ఈ రీతిగా పాఠకుల ముందుకు తెస్తున్నాను. మీరూ ఆలోచించండి.
(1) నిజానికి మీరనుకున్నట్లు; హేతువాద ఉద్యమావశ్యకతను నేనీనాడు కాదు గుర్తించింది, ఆధ్యాత్మిక జీవితంవైపుకు మరలిన నాడే గుర్తించాను. ఆ మార్గంలో కొంతదూరం నడిచాక 1981 ప్రాంతాలలో పెంచలయ్యగారితో భేటీపడి నేనెత్తుకున్న ఆస్థికపక్షాన్ని స్థాపించలేని క్షణం నుండి అది మరింత బలం పుంజుకుంది. అనంతరం ప్రమాణక్షేత్రాల నెరిగి, దానిని వినియోగించుకోవడంలో ఒకింత పట్టుదొరికాక, హేతుబద్దాలోచనశక్తి, పరిమితులూ కూడా బోధ పడిస్థిరపడింది. అనంతరం జీవితం కొంత వరకు అర్థమైందనుకున్నాక, సమాజాన్ని అతిగా ప్రభావితం చేస్తున్న భావజాలంలోని లోటుపాట్లు కొంతమేర వరికయ్యాక, ఈ విషయాలు సమాజం ముందుంచాలని అనిపించి మొదలెట్టిన మేలుకొలుపు తొలి సంచికలలోనే ఈ విషయాలు క్లుప్తంగా చెప్పానుకూడా. మీ పరిశీలన కొరకుగా ఒకటిరెండు ఆధారాలిస్తాను చూడండి. 1.8.91 నాటి మేలుకొలుపులో స్వమంతవ్యం (నేనూ - నా పత్రిక) పేరున వ్రాసిన వ్యాసంలోనే (3వ పేజీ) (1)... ప్రస్తుత నా బుద్ధి స్థాయిననుసరించి నేనే మతస్థుడినీ కాను, ఏ కులస్థుణ్ణీకాను, ఏ వర్గానికీ చెందిలేను. ఇది నా మనస్సు నా గురించి నాకు చెపుతున్న విషయం.'' అని ప్రకటించాను.
(2) కపటులూ, స్వార్థపరులూ ఆస్థిక క్షేత్రాలలోనే ఎక్కువగా ఉంటున్నారు. నిజానికి, నాస్తిక, హేతువాద సంఘాలు ఆస్థిక సమాజం యొక్క వికృత రూపాలకీ, దాని ప్రవర్తనకు ప్రతి క్రియాత్మకంగా ఏర్పడినవేనన్నది ఒక చారిత్రక వాస్తవం (15.6.91)
(3) సబబైన మాట పసివాడు చెప్పినా స్వీకరించదగిందే, బేసబబు మాట ఎంతవాడు చెప్పినా విడువవలసిందే.
(4) హేతువాదులమనుకునే వారిలోని అహేతుకవైఖరినీ,... కమ్యూనిస్టుల మనుకునేవారిలోని కమ్యూనలిజాన్ని మేము తరచుగానే గమనించాము.
(5) సంశయించి పరీక్షించడం, నిగ్గుతేలిన వాటిని స్వీకరించడం అన్న విధానాన్ని అనుసరించాలన్నాను.
(6) మండలి ప్రధాన కార్యక్షేత్రమైన ప్రమాణ విద్యలోని అనుమాన ప్రమాణ (తర్క) క్షేత్రమంతా హేతుబద్దాలోచన అన్న దానికి సంబంధించిందే.
(7) ఇక గుత్తా రాధాకృష్ణగారు నాకు పరిచయమైన నాటి నుండీ హేతువాద ఉద్యమం సామాజికావసరమని చెపుతూనే వస్తున్నాను. అటు తరవాత 1995, 96 ప్రాంతాల నుండి 'హేతువాదులకు హేతువాద పాఠాలు' అంటూ తరగతులూ నిర్వహించాను.
(8) గుత్తా రాధాకృష్ణగారి సంస్మరణ సమావేశంలోనూ, హేతువాద ఉద్యమం సామాజికావసరమనీ, ఆ పనిలో స.మండలి 100% నిజాయితీతో నిండా మునిగి పనిచేస్తుందనీ చెప్పాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఆ విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తూనూ వస్తున్నాను. ఇది జరిగిన వాస్తవం.
(2) హేతువాదుల లక్ష్యం భావ విప్లవమన్నారు. నిజానికామాటకు ఆ మాటంటున్న వారంతా అంగీకరిస్తున్న అర్ధం ఏమిటి? విప్లవమంటే తక్కువ కాలంలో అతి త్వరితంగా వచ్చే మౌలికమైన లేదా గుణాత్మకమైన మార్పు అని అర్ధం చెప్పుకుంటున్నాం దానికి భావమన్న దానిని జతకూరిస్తే  భావాలలో అతిత్వరితంగా ఏర్పడే మౌలికమైన మార్పు అని అర్థం వస్తుంది. ఆ సాదారణార్థాన్ని మీరు ప్రత్యేకంగా ఏ విషయాలతో ముడిపెట్టి వాడుతున్నట్లు? ఏ భావాలు పోయి, ఏ భావాలు వస్తే, దానిని మీరు భావ విప్లవం వచ్చిందంటారు? (1) ఇది స్పష్టంగా చెప్పగలగాలి. మీరనుకునే భావసారూప్యత కలవాళ్ళంతా ఒకే మాట చెప్పగలగాలి. అదలా ఉంచితే అన్ని రకాల మౌఢ్యానికీ, అజ్ఞానానికీ, దోపిడీలకు మూలం దైవభావనేనన్నారు. అదేలా వాస్తవమో రుజువు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. దైవభావన, మత భావనలపై విమర్శకు నేను విముఖుణ్ణికాదు సరికదా పట్టుబట్టి, ఒక పద్దతి ప్రకారం, ఆ పక్షం వాళ్ళూ కాదనలేని రీతిలో వాటిని విమర్శిస్తూ వస్తున్నవాణ్ణి. ఏదైనా ఒక ధోరణికి చెందిన (మత) భావజాలాన్నిగానీ, అది అంగీకరిస్తున్న దైవ భావాన్నిగానీ విమర్శించాలంటే, విమర్శకునికి ఉండాల్సిన అర్హతలు, సామర్థ్యాలు ఏమిటో తెలిసుండాలి. అవేమిటో మీరుగానీ, మీరు ఇతడూ హేతువాదేనని అంగీకరించేవారిలో నేనెంచుకున్న వారుగాని ఒకేరకంగా చెప్పాలి. ఆస్థికులు బండగా దేవుడున్నాడంటున్నట్లే, హేతువాదులూ మొండిగా దేవుడు లేడనగూడదు. అన్న వెంకటాద్రిగారి మాటలు అంగీకరించితీరాలి. దేవుడులేడు అన్న నిర్ణయానికి ఎలా చేరారో నాస్థికులూ, నాస్థికత్వాన్నంగీకరిస్తున్న హేతువాదులూ, ఇతరులూ కూడా యోగ్యమైన ఆధారాలు చూపుతూ చెప్పగలగాలి.
ఇక్కడ నావైఖరి స్పష్టం ఆస్థిక్యతను నిరూపించమనిగానీ, అది నిరూపించ దగిందికాదనిగానీ, ఇప్పటికీ అభౌతిక పదార్థాపు ఉనికి అనిర్థారితమనిగానీ అంటున్నామంటే, అది ఆస్థికతను యోగ్యమైన రీతిలో విమర్శకులోను చేస్తున్నామనే కానీ ఆ పని చేయడానికి నాస్థికుడవ్వాల్సిన పనిలేదన్నది ఎంత మంది హేతువాదులకు తెలుసు?!
దైవవాదాన్ని విమర్శించడంతో ఆగక హేతువాదం మానవవాదం వైపు పయనిస్తుంది అనన్నారు. ఇంతకూ హేతువాదం క్రిందికి ఏయే భావాలువస్తాయో, మానవ వాదమంటే ఏమిటో, హేతువాదం మానవ వాదం వైపు పయనించడమంటే ఏమిటో మీరూ, మీరు భావసారూప్యతకలవాళ్ళం అంటున్నవాళ్ళు ఒకే రకంగా వివరించి, నిర్థారించాల్సి ఉంటుంది. హేతువాదం ఒక సిద్దాంతం కాదంటున్న పక్షం వాళ్ళైన మీరు, మానవ వాదాన్ని సిద్దాంతమంటున్నారా? లేదా? వివరాలు కావాలి.
(3) వచ్చిన ఇబ్బందిదేకదా! ఇప్పుడు హేతువాదులుగ చెప్పుకుంటున్న వాళ్ళంతా తాము నాస్థికులం అనే చెప్పుకుంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని హేతువాద సంఘాలు ప్రచారంలోకి తెచ్చిన భావనే. ఆ రెంటి వివరాలు తెలియాల్సినంత తెలియకుండగనే హేతువాద సంఘాలలో సభ్యులైనవారు దానిని నమ్మకంగా తలకెత్తుకున్నారు. హేతువాదులంటే దేవుళ్ళను తిట్టేరకంగానే జనంలో కనబడుతుండడంతో జనమూ అలానే అనుకుంటూ వచ్చారు. జరిగిన ఆ తప్పును (పొరపాటును) సరిజేసి, హేతువాదం యొక్క విస్తారమైన క్షేత్రాన్ని గురించి   తామర్థంచేసుకొని, జనానికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత  హేతువాద పక్షం వారిపైనే ఉందన్నదే ఆది నుండే నేను చెపుతూ వస్తున్నాను. ఆ మేరకు మీరు సరిచేసుకోవలసింది పోయి, నన్ను ఆ అపసవ్యతలోకి రమ్మంటారేమిటి?
(4) సక్రమాలోచన ఒక్కటే హేతువాదం కాదు. హేతువాద భావజాలంలో అదీ ఉంది. అలాగే శాస్త్రీయదృక్పథం యొక్క అవసరాన్నీ నొక్కి చెపుతుంది హేతువాద సిద్దాంతం. ఆ రెండూ ఉన్నంత మాత్రాన్నే ఒకడు హేతువాదికాజాలడు దేవునిపై నమ్మకం లేని వాళ్ళంతానూ హేతువాదులు కాజాలరు(కారు) అలానే దేవుని పై నమ్మకం లేనివాళ్ళంతా నాస్తికులూ కాదు. నిజానికి నాస్థికులంటే దేవుడు లేడన్న దానిపై నమ్మకం ఉన్నవాళ్ళు. నేను ఈ రెండో రకం నమ్మకమూ లేనివాణ్ణంటున్నానేగాని, దేవుడున్నాడన్న నమ్మకం ఉన్న వాణ్ణంటంలా. దేవుడున్నాడన్న నమ్మకమూ లేని వాణ్ణే నేను. నిజానికి హేతువాద దృష్టి తగినంతగా కలిగి ఉంటే, ఇలాటి విషయాలలో నమ్మకాల దగ్గరకు పోకుండా రుజువుల దగ్గరకే పోతాడు వ్యక్తి. చాలా మంది హేతువాదుల మనుకునేవారికంటే, హేతువాదం అర్థమైన వాణ్ణనుకుంటూండబట్టే, నేను ఆస్థిక నమ్మకానికీ, నాస్థిక నమ్మకానికీ దూరంగా ఉండగలుగుతున్నాను. ఏ ధోరణికి చెందిన ఆస్థికుల్నైనా (నాస్తికుల్నైనా) మీదెలా నిర్ధారితాంశమో తెలియజెప్పండని అడుగుతూ వస్తున్నాను. ప్రశ్న నంగీకరించాలి, ఆహ్వానించాలి, ఆస్థికుల మాదిరి బండ సమాధానాలు చెప్పగూడదంటుండే నాస్థిక, హేతువాదులు నా ఈ ప్రశ్నను ఆహ్వానించి, స్వీకరించి, సహేతుకంగానూ, యోగ్యమైన ఆధారాలు చూపుతూనూ నాస్థికత్వాన్ని స్థాపించాలి. అలా జరిగిన మరు క్షణం నేను ఆ విషయాన్ని వివేకపథంలో ప్రకటించి, అప్పటి నుండి నాస్థికునిగా కొనసాగగలను. లేదంటే ఏమి చేయాలో మీరే ఆలోచించుకోవలసి ఉంది. హేతువాదిగా కొనసాగడానికి ఆస్థికుడుగాగాని, నాస్థికునిగా గానీ ఉండఖ్ఖరలేదన్నదే ఇప్పటికీ నా పక్షము. ఈ విషయంలో నేను వక్రంగా ఉన్నాననుకునేవాళ్ళు నన్ను చక్కజేస్తే చక్కనవడానికి నేను సిద్దంగా ఉండగలను. ఆస్థికత రుజువు కాలేదన్నమాట నేనెలా అంటున్నానో మీ పక్షం వాళ్ళందరూ అలానే అంటున్నారు. ఇది నిజమా కాదా? ఇక 'హేతువాదం రుజువు కాలేదు' అని ఎవరన్నారు? నాస్తికత్వం అనబోయి 'హేతువాదం' అని అనుంటారు! కాని వెంకటాద్రి గారు పలుమార్లు హేతువాదమంటే నాస్తికత్వం కాదని ప్రకటించారు. కనుక 'హేతువాదం' 'నాస్తికత్వం' పర్యాయపదాలుగా వాడనేకూడదు. నాస్తికత రుజువు కాలేదిప్పటికీ అన్నది నా పక్షం రుజువైందంటే, ఎప్పుడు, ఎక్కడ, ఎవరా పని చేశారో, ఇప్పుడు చేయగలరో ఆ వివరాలివ్వండి పరిశీలిస్తాను.
పరిశీలనలో, ప్రయోగంలో నిర్థారణైన విషయాలవైపు భావాలలో మార్పులు చేసుకోడానికి సిసలైన హేతువాది ఎప్పుడూ సిద్దంగా ఉంటాడు. అలా సిద్దంకాని వాణ్ణి హేతువాది అనడమే కుదరదు అన్న వెంకటాద్రి గారి మాటలు 100% నాకు అంగీకారమే. మరి మీ మాటేమిటి? ఇది గనక మీరు అంగీకరించి అనుసరిస్తానంటే, మిగిలిన హేతువాదులూ ఇందుకు సిద్ధపడితే, తేలిన వాస్తవం దగ్గర వక్కటవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండఖ్ఖర్లేదు.
ఆమిత్రులు సూరన్న గారికి; నా ఈ విశ్లేషణ కేవలం మిమ్ముద్దేశించిందికాదు. మీరు లేవనెత్తిన అంశాలు మౌలికమైనవి అందరమూ అవగాహన చేసుకుని ఉండాల్సినవీ అవడంతో, మిమ్మడ్డుపెట్టుకుని నాదృష్టికోణాన్ని పాఠకులందరకూ చేరవేయాలనుకునే ఇలా స్పందించాను. ఒకింత కరకుగా ఉందనిపించిన వాటి విషయాన్ని గట్టిగా పట్టించుకోకండి. విషయపరంగా తేడా ఉందనిపిస్తే నిర్మొగమాటంగా విమర్శించండి. వ్యక్తిగత విమర్శవద్దు. మీరన్నట్లు 186, 188 సంచికలు చాలా భావగాంభీర్యం కలవే. వివేకపథం పాఠకులూ వాటిని మరొకసారి నిశితంగా పరికించగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం.
దేవుడనేది అనవసరపు భావనా? అవసరమైనదా? అని మొదటిలేఖలో అడిగారు. ఈనాడది అనవసరపు భావనేనని ఏనాడో నిర్ద్వంద్వంగా ప్రకటించానునేను. అంతేకాదు, సత్యాన్వేషణ మండలికి, పుట్టకముందు విషయాలతోగానీ, మరణానంతర విషయాలతో గాని పనిలేదనీ ప్రకటించాను. మా భావజాలమంతా పుట్టి, చచ్చేలోపల 'వ్యక్తీ - సమాజము - ప్రకృతి' అన్న మూటికి సంబంధించి ఈ లోకానికి పరిమితమైనది మాత్రమే.
తేలని, రుజువులు లేని నమ్మకాల విషయంలో దేవుడున్నాడని, లేడని వాద ప్రతివాదనలు చేసేవారిని కూర్చోబెట్టి చర్చలు సదస్సులు నిర్వర్తించితే, అవి సత్యాసత్య వివేచనకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచించండన్నారు. నామాటేమిటంటే, నిజంగా మీరన్నట్లు అవి ఇప్పటికీతేలని, రుజువులులేని విషయాలేనన్న నిర్ణయానికి వచ్చారా మీరూ. నేనక్కడికి చేరాను చాలాకాలం క్రితమే. నా అన్వేషణలో అవి తేలనివీ, రుజువులు లేనివీ అని తేలుతుండగా, ఆ రెండూ తేలినవేనని పట్టుకు కూర్చున్న వారిని కూర్చొబెట్టుతున్నది, అవెక్కడ తేలాయో తేల్చండని అంటున్నది, వారికీ నేను చూస్తున్న దానిని చూపించాలనే. ఈ విషయంలో సత్యం తెలిసిందనుకుంటున్న నాకు, ఆ విషయాన్ని సమాజానికి ఎరుక పరచడమూ బాధ్యతై ఉంది.
స్పం (5) :-               ప్రత్యేక ప్రకటన
నా విజ్ఞప్తిని మన్నించి, నా మీద (నా సామర్థ్యం మ్మీద, నిజాయతీ మీద) నమ్మకముంచి చీరాల నుండి ఎన్‌.వి. బ్రహ్మంగారిలా వ్రాస్తున్నారు. ఇది ఆయన పి.డి సుందర్రావు గారికి పంపిననలేఖనకలు అని చెప్పారు.
మిష్టర్‌ పి.డి సుందరావ్‌! నీవు గతంలో చీరాలవచ్చి నన్ను ఛాలెంజ్‌ చేస్తే నేను ఓడిపోయానని ఒప్పుకున్నానని, ఎందుకు అబద్దపు ప్రచారంతో ప్రగల్భించావు? అప్పుటి బైబిలు బండారంలోని అవతారికను అలాగే ఉంచి, 'అసంబద్ధా'లకు తోడు మరో నాలుగు భాగాలనూ చేర్చి, పుస్తకం పేరును 'బైబిలే పలుకుతోంది'గా మార్చి పునఃప్రచురణ చేశాను. అవతారికంటే ఉపోద్ఘాతమే కనుక, అది మిగిలిన పుస్తకానికంతటికీ అవతారికగానే ఉంటుంది. లోగడ నీవు చేసింది అబద్దపు ప్రకటనే అని ఒప్పుకుంటూ మళ్ళీ ప్రకటిస్తూ ఆ ప్రకటన కాపీని నాకు పంపు. లోగడి నీ ప్రకటనల్లో వివాదాంశాలు మరికొన్నీ ఉన్నాయి. వాటిపై సత్యాన్వేషణ మండలి, దోరకుంట, అధ్యకక్షులు పుట్టా సురేంద్రబాబుగారు మీతో తలపడడానికి సిద్దంగా ఉన్నారుకదా! ఆ  సందర్భంగా వారు నా తరపున కూడా, నా ప్రతినిధిగా మీతో పోటీ పడడానికి నేను చిత్తశుద్ధితో ఆమోదిస్తున్నాను. అంతేకాదు, ఆయన గెలుపోటములు నావిగా స్వీకరించడానికీ సిద్దంగా ఉన్నాను. ఎన్‌.వి. బ్రహ్మం - (గారి సంతకం) 27.8.13
ప్ర.స్పం :- ధన్యవాదాలు బ్రహ్మంగారూ! భావజాల పరంగా మనమధ్యనున్న పరిచయానికీ, స్నేహానికీ కూడా వన్నెతెచ్చే విధంగా ఉంది మీ లేఖ. పి.డి. సుందర్రావు పోటీకి రావాలేగాని అతగాడు నాకవుటే. మీరు నిశ్చింతగా ఉండండి. ఇక ఈ లేఖాధారంగా ప్రగల్భాల పి.డి సుందర్రావుకు మరోసారి సవాలు రూపంలో ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన 'కూతకు దొరకడని' ఇప్పటికి జరిగిందాన్ని బట్టి అనిపిస్తున్నది కనుక, అత్యంత పరుషంగానూ మాట్లాడి, మాటిమాటికీ గిచ్చీ, గిల్లీనన్ను రెచ్చగొట్టిన జగద్గురు గారుగానీ, ఈ సం|| కాలంగా నా రచనలను చూస్తున్న ఆ పక్షపు వందిమాగధులుగానీ, ఆయన దాక ఎందుకు, మేము చాలు దీనికి అంటూ తెగ ప్రగల్భించే, తొడలు చరుచుకునే ఆయన కొడుకు, అల్లుడూ, మరికొందరు చిన్న గురువులుకానీ పూనుకుని బైబిలు పైనా సైన్సుపైనా పి.డి. సుందర్రావు మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్దపడవలసిందిగా వారిని ఒప్పించనైనా ఒప్పించండి, ఎన్‌.వి. బ్రహ్మంగారు తన తరపున నన్ను పోరాడమనీ, నాగెలుపోటములు తనవిగా స్వీకరించగలననీ ప్రకటించినట్లు, ఆయన తరపున నాతో చర్చించడానికి, ఆయన అంగీకరించిన ప్రతినిధిగా ఆధారం చూపి మీరైనా సిధ్దంకండి.
లోకంలో మామూలుగానైతే, బలమైన ప్రత్యర్థిని ఓడించడానికి కొన్ని సందర్భాలలో తల ప్రాణం తోకకొస్తుంది అన్నంతగా శ్రమ పడాల్సి ఉంటుంది. కాని అదేం విడ్డూరమో మన పి.డి. సుందర్రావు గారిని పోరాటానికి సిద్దం చేయడానికే తలప్రాణంతోక కొస్తోంది. అన్నంతగా శ్రమ పడాల్సి వస్తోంది. పి.డి.సుందర్రావుకు ఒక్కమాట! నిజానికి మొన్నీమధ్య నీ నోటితుత్తర అంశాన్ని జనం పట్టించుకోక పోబట్టి బ్రతికిపోయ్యావుగానీ, అంతలేసి మాటలన్నందుకు భారత ప్రజ నిన్నెంతగా వీధులెంట పరిగెత్తించినా నీకు చేయాల్సిన ప్రాయశ్చిత్తానికి సరిపోదు. అది సరేలే! ఎప్పుడు ఎక్కడ బైబిలుపైనా, సైన్సు పైనా చర్చకుకూచుందామో ఇప్పుటికైనా పలకవయ్యా బాబూ!
ఈ సందర్భానికే చెందిన ఒక విజ్ఞప్తి
యోచనాశీలురైన రావిపూడి వెంకటాద్రిగారికి; పి.డి. సుందర్రావు గారు నాకు వాడు చాలడు, వీడు చాలడు రావిపూడి వెంకటాద్రితోనైతే చర్చకు రెడీ! అంటూ గతంలో చాలా ప్రకటనలు చేశాడు. దానికి బదులుగా మీరు అనవలసినవి అని వాటినీ రచన రూపంలోనూ ప్రచురించారు. ఇతరేతరాంశాలలో కొన్నింట మన మధ్య బినాన్నభిప్రాయాలున్నా; ఏ మత గ్రంథమూ దైవ ప్రాప్తం అనడానికి సరిపోదు. గ్రంథాలన్నీ మానవకృతాలే అన్న విషయంలోగానీ, బైబిలు ఆదికాండంలోని సృష్టిక్రమం అవైజ్ఞానికం, అజ్ఞానమూలకం అన్న విషయంలో గానీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని కించపరుస్తూ సుందర్రావుగారు మాట్లాడిన విషయాలు అతనిలోని అజ్ఞానాన్ని (అవగాహనారాహత్యాన్ని) తేలిపేటివేనన్న విషయంలోగాని ఏకాభిప్రాయంతోనే ఉన్నాము. కనుక ఆ విషయాలకు పరిమితమై అతనితో మాట్లాడడానికి, మీ ప్రతినిధిగా నన్నంగీకరిస్తున్నట్లు ప్రకటించగలరేమో ఆలోచించండి. ఈ విషయాలలో నా అవగాహనను, మీరు ఒకసారి పరిశీలించి చూసుకోవాలనుకుంటే ఈ విషయం వరకు మిమ్ము కలసి మాట్లాడడానికీ నేను సిద్దము. నా ఆకాంక్షల్లా గత పాతికేండ్లు పై బడి పి.డి. సుందర్రావు గారు ప్రవర్తిస్తున్న అనుచిత పోకడకు ఒక ముగింపు పలకాలన్నదే. ఈ విషయంలో అవకాశముంటే, అతడు ఛాలెంజ్‌ చేసిన లేదా అతణ్ణి ఛాలెంజ్‌ చేసిన ఈదేశంలోని (రాష్ట్రంలోని) మరికొందరి నుండీ ఇలాంటి అనుమతిని పొందే యత్నమూ చేస్తాను. మీ అందరి ప్రతినిధిగా అతణ్ణి చర్చకు ఆహ్వానిస్తాను. అప్పటికీ అతడు రాకుంటే టి.విలో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి, రాష్ట్రంలోని వివిధ ధోరణులకు చెందిన ప్రసిద్దులందరికీ కబురందించి బహిరంగంగా అతణ్ణి చర్చకు పిలుస్తాను. అందుకూ అతడు చలించకుంటే చివరి యత్నంగా న్యాయాలయం ద్వారా అతణ్ణి విచారణకు సిద్దం చేసే యత్నం చేస్తాను. ఆ తరవాత ఏమి చేయాలన్నదీ అంత వరకయ్యాక ఆలోచిస్తాను.
స్పం :- హైద్రాబాద్‌ నుండి రాజేంద్రప్రసాద్‌ గారిలా వ్రాస్తున్నారు. సురేంద్ర బాబుగారికి; వివేకపథం 201లోని స్పందన - ప్రతిస్పందననూ, హేతువాది ఆగస్టు 2013లోని ''మరల మరో గెలుకులాటా'' అనే విమర్శనాత్మక వ్యాసము చదివాను. హేతువాదిలోని వ్యాసము నన్ను కొంత కలవరపరిచినది. సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలనే తృష్ణ కలవారు చాలా తక్కువ మంది ఉన్నప్పుడు ఇలాటి విమర్శ లేక ప్రతి విమర్శలు అవసరమా అనిపించింది. సిద్దాంత పరంగా భేదాభిప్రాయాలుండడం సహజమే. ప్రతి ఒక్కరూ ఒకే స్థాయి కలిగిన అవగాహనాపరులు కాలేరుకదా! యిలాటి విమర్శలకు బీజం పడి చాలా కాలమైందనీ, దాని ప్రభావమే ఈ వ్యాసం అనీ అనుకుని ఊరుకున్నాను. ఈ విమర్శకు కారణం ఈ రెండు సంస్థలకూ అనగా మీకూ రావిపూడి మాష్టారుగారికీ సిద్దాంత పరంగా ఉన్న బేధాభిప్రాయాలేగాని, వ్యక్తుల పరంగా లేవని నాభావన. ఈ విభేదాలకు కారణాలు రెండు రకాలుగా ఉన్నాయి. (1) సిద్దాంత పరంగా అతి ముఖ్యమైనవి (2) అంత ముఖ్యం కానివి.
(1) అతి ముఖ్యమైన వాటిలో నాకు తెలిసినంతవరకు, ''సత్యంమారుతుందా? సత్యం శాశ్వతమా కాదా?'' అనే అంశంపైన విభేదించుకుంటున్నారనుకుంటున్నాను. కనుక, ఈ విషయం మ్మీద చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తే, చాల వరకు ఇతర భేదాభిప్రాయాలు కూడాపోతాయి. 'సత్యం' అనే పదం యొక్క అర్థాన్ని వేర్వేరుగా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ ఒకేలా అర్థం కావలసి ఉంది. నా అవగాహన ప్రకారం, సత్యమంటే వాస్తవానుగుణ్యత కల జ్ఞానం అనే.
(2) అతి ముఖ్యమైన వాటిలో ''సిద్దాంతమని దేనిని అనాలి? ఒక దానిని సిద్దాంతం అనాలన్నా, అనకూడదని అన్నా, దానికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి?'' అనేదీ ఒకటి. దీనిని గురించిన అవగాహనా అందరికీ కలిగితే మంచిదేగాని, ప్రత్యేకించి సిద్దాంతకారులకు మాత్రం తప్పనిసరి.  సామాన్యులకు ఆ అవగాహన అవసరం లేదంటాను. సిద్దాంతమన్నా, సూత్రమన్నా, మరో పేరేదైనా పెట్టినా పెద్ద తేడా ఏమీరాదు. విషయంపైన అవగాహన కలగడమే ముఖ్యంగాని, దానిని సిద్దాంతమనాల్నా వద్దా అన్నది మా బోటి వారికి అవసరంలేదు. కనుక అలాటి వాటిపై ఏర్పడ్డ భేదాభిప్రాయాల్ని వెంటనే తేల్చుకోవలసిన అవసరం లేదని నా భావన. సమయం సందర్భం వచ్చినప్పుడు తేల్చుకోవచ్చు.
(3) అతి ముఖ్యం కానివి చాలా ఉన్నేౖ. అలాటివి సామాన్యులకు అర్ధమైతే చాలు. లోతైన అవగాహన క్రమంగా వస్తుంది. అలాటి విషయాలకు మీరు ఇవ్వవలసిందానికంటే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారనీ, వెంకటాద్రి గారు అంత ప్రాముఖ్యతనివ్వక్కరలేదన్న దృష్టితో ఉన్నారనీ అనుకుంటున్నాను.
(4) మీ యిరువురి రచనా విధానంలో తేడా ఉంది. మీ రచనలు చదివి అవగాహన చేసికోవడానికి చాలా సమయం పడుతుంది. లోతైన అవగాహన కలుగుతుంది. వెంకటాద్రిగారివి చదవడానికి ఎక్కువ సమయం పట్టదు. అవి సామాన్యుల కోసం వ్రాసినవి అనిపిస్తుంది. నిజానికి రెండు రకాల రచనలూ ఉండాలి. (1) సామాన్యుల కోసం క్రింది స్థాయిలో (2) ఎక్కువ సామర్థ్యం కలవారికోసం ఇంకొంచం ఎక్కువస్థాయిలో. సామాన్యుల కోసం వ్రాసిన రచనలలో అంత ముఖ్యం కాని అంశాలను లోతుకు వెళ్ళకుండా, వారికి అర్థమయ్యేట్లు వ్రాస్తే చాలు. వాటిపై లోతైన అవగాహన పొందగోరేవారు, క్రమంగా ఆలోచించుకునిగానీ, శిక్షణ తరగతుల ద్వారా గాని, రెండవరకం రచనలు చదవడం ద్వారా గానీ వాటిని తెలుసుకోగలుగుతారు.
(5) హేతువాదులకు ఏ వ్యక్తిగానీ, రచనగానీ ప్రామాణికంకాదని అందరం అంగీకరించాం. అలాగే హేతువాదం కూడా. ఈ భావనాధారంగానే నే నీ లేఖ వ్రాయగల్గుతున్నాను. ఈ విషయంలో మీరిరువురూ నాకు ప్రామాణికులు కారు.
(6) ఎం.కె. గౌరవ్‌ గారు ఏమి వ్రాశారో నాకర్థం కాలేదు. చివరకు వ్రాసిన గమనిక మాత్రం అర్థమైంది. అదిన్నీ అన్యాపదేశంగా ఉంది. నేరుగా మీకే వ్రాయవచ్చుగదా? అందులో దాపరికమెందుకు.
(7) రావిపూడి గారి రచనలలో, సత్యాన్ని గురించి పరస్పర విరుద్దభావాలున్నాయి. వాటిని నేనూ గమనించాను. కానీ ఆ దోషం అనాలోచితంగా జరిగి ఉంటుందని భావిస్తాను. ఒకసారి ఒక భావన కలిగిన మనిషి దానికి విరుద్దమైన భావనను ఉద్దేశపూర్వకంగా ఇంకోచోట తెలియపరుస్తారని నేను భావించడంలేదు. వారి మనసులో ఏముందో, మనకేమి చేరిందో, అలా జరగడానికి వివిధ కారణాలుండవచ్చు. యిలాటి దోషాలు ఇతరుల రచనలలోనూ ఉన్నాయి. మీ రచనలలో కూడా.
(8) ఈ లేఖ నకలును వెంకటాద్రిగారికీ, సత్యన్నారాయణ గారి పేరు మీద పంపుతున్నాను. వారు కూడా స్పందిస్తారని తలుస్తాను. ఇట్లు ప్రసాద్‌
ప్ర.స్పం (6) :-  మిత్రులు రాజేంద్రప్రసాద్‌గారికి; మీ లేఖ ప్రారంభంలో, మీరన్నట్లు, వెంకటాద్రిగారికీ, నాకూ మధ్య వ్యక్తిగతవైషమ్యాలు ఉండనక్కరలేదు. నావైపు నుండి మాత్రం వ్యక్తిగత విమర్శలు వద్దంటూ ఆది నుండి చెపుతూనే వచ్చాను. ఏ భావజాలానికి చెందిన వ్యక్తులతోనైనా మండలి వైఖరి అదేనన్నది గత పాతికేండ్లుగా వస్తున్న మేలుకొలుపు, వివేకపథాలను జాగ్రత్తగా చదువుతున్నవారికి తెలిసున్నదే. నన్నెరిగిన వారికీ, నేను వ్యక్తిగత శతృత్వ వైఖరినవలంభించే వాణ్ణి కాదన్న విషయం తెలుసు. అవగాహనల్లోనూ, పోకడల్లోనూ ఉన్న వ్యత్యాసాలను ప్రక్కన పెడితే, సమాజహితం కొరకుగా నిబద్దతతో జీవితాన్ని వెచ్చించిన వ్యక్తిగా, మాముందుతరం ఉద్యమకారునిగా, వెంకటాద్రి గారిపట్ల నాకిప్పటికీ గౌరవభావనే ఉంది. ఆ మేరకు ఇక ముందూ ఉంటుంది. ఇక విషయపరంగానైనా, ఇరువురమూ, ఒప్పు భావాలు సమాజానికందాలి, ఉన్న తప్పు భావాలను పోనాడాలి, అన్నంతవరకు సమానశీలురమే గనక, భిన్నాభిప్రాయాలున్న సందర్భాలలోనూ శతృదృష్టి అనవసరమే అవుతోంది. ఏదో ఒక సందర్భంలో మానవికమైన ఆవేశాలకు లోనైనా, వీలయినంత త్వరగా వివేకం అదుపులో మరల స్వస్థచిత్తులం కావాలన్నదీ తెలిసున్నదే. అభ్యుదయాకాంకక్షుల మధ్య వ్యక్తిగత స్పర్థలుండరాదన్న ప్రగాఢ వాంచకలవాణ్ణి నేను. గత 20 ఏండ్లుగా మంచి వాళ్ళందరనూ కలవగలిగిన మేరనైనా కలపి ఉద్యమించాలన్న యత్నాలు చేస్తున్నట్లు మీకూ తెలుసు. సరే అంశాలవారీగా మీ లేఖ పై స్పందిస్తాను, పలికించండి.
(1) 'సత్యం' అన్నది వాస్తవాలను సూచించడానికి వాడే పదంకాదని, ఉన్న వాటికి సంబంధించి కలుగుతున్న ఒప్పు జ్ఞానాన్ని సూచించడానికి వాడినపదమది అనీ నా పక్షాన్ని మొదటినుండీ చెపుతూనే వస్తున్నాను. కొన్ని విషయాలలో వెంకటాద్రి గారున్నూ వేలసం||లు గడచినా ఆ అభిప్రాయాలను మార్చుకోనక్కరలేనివిగనే ఉంటున్నాయిప్పటికీ అనంటూ ఆచరణలో నిలబడినంతకాలం అవి ఒప్పులేనన్నట్లు చెపుతున్నారు. కనుక మీరన్నట్లు సత్యాలు మారతాయి, మారవు; కొన్ని మారతాయి కొన్ని మారవు; అన్న మూటిలో ఏదో ఒక పక్షాన్ని నిగ్గుతేల్చుకునైనా అందరం స్వీకరించడం మంచిది. వాస్తవానుగుణ్యత కల జ్ఞానమునే సత్యమంటామన్న మీ అభిప్రాయమే సరైంది. నా అభిప్రాయమూ అదే.
(2) సిద్దాంతమని దేన్నంటారన్నదీ, ఇటు తాత్విక ధోరణులనుగానీ, అటు వైజ్ఞానిక క్షేత్రాలను గాని పట్టిచూస్తే ఇట్టే తేలిపోతుంది. అనేకాభిప్రాయాల సమాహారాన్ని (భావజాలసంపుటిని) సిద్దాంతాలంటున్నాం. ఖచ్చితమైన ఒక్క అభిప్రాయాన్ని సిద్దాంతమంటున్నాం. ఉదా :- మార్క్సిస్టు సిద్దాంతం, ఆస్థిక సిద్దాంతం, నాస్థిక సిద్దాంతం, సాపేక్ష సిద్దాంతం, ఉష్ణగతి శాస్త్ర సిద్దాంతం, మహావిస్పోటన సిద్దాంతం, అద్వైత సిద్దాంతం, వైష్ణవ సిద్దాంతం, నియంతృత్వం పై అనేకుల సిద్దాంతాలు, ప్రజాస్వామ్యంపై అనేక సిద్దాంతాలు, జనాభా సమస్యపై భిన్న సిద్ధాంతాలు, ప్రమాణాలపై అనేక సిద్దాంతాలు అర్ధశాస్త్రంపై అనేక సిద్దాంతాలు, నీతి శాస్త్రంపై అనేక సిద్దాంతాలు... ఇలా 'సిద్దాంతం' అన్న పదం యొక్క వినియోగం ఎలా ఉందో గమనించగలిగితే అవగాహనలో స్పష్టత ఏర్పడుతుంది. వైజ్ఞానిక క్షేత్రాలలోనైతే, ఊహాత్మక సిద్దాంతాలు (పరికల్పనలు) నిర్ధారిత సిద్దాంతాలు (ఆజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ)  వీగిపోయిన సిద్దాంతాలు (ఈరిరీచీజీళిఖీలిఖి ఊనీలిబిజీరిలిరీ) అన్నమాటలూ వినియోగంలో ఉన్నాయి. 'ఇజం' అన్న శబ్దంతో కలిపివాడే వన్నీ సిద్దాంతాలే. ప్రతి వాద రూపము సిద్దాంతమే. అందుకనే 'సిద్దాంత' మన్న మాటను వివరిస్తూ తార్కికులు సర్వతంత్ర ప్రతితంత్ర అధికరణ అభ్యుపగమాల రూపంలో సిద్ధాంతాలు నాలుగు రకాలుగా వుంటాయని చెప్పారు. దేవుడున్నాడు అన్నదీ ఒక సిద్దాంతమే. దేవుడు లేడు అన్నదీ ఒక సిద్ధాంతమే. ఉన్నాడో లేడో తెలియబడదు (అజ్ఞేయవాదంలో ఒక రూపం) అన్నదీ ఒక సిద్దాంతమే,  అనార్కిజం (అరాచకవాదం) అన్నదీ ఒక సిద్దాంతమే. నిర్థిష్ట రూపంలో ఆయా విషయాల గురించి ప్రకటింపబడిన అభిప్రాయాలన్నీ సిద్దాంతాలే. ఆలోచనా పద్దతికి చెంది పలు సిద్దాంతాలున్నాయి. వాటిని తార్కిక సిద్దాంతాలని అంటారు. విషయ మిట్లుండగా, 'హేతువాదం' సిద్దాంతం కాదు అనడమెలా కుదురుతుంది. ఇది సర్దుకుపోయే అంశంకాదు. నిగ్గుతేల్చుకుని ఏకాభిప్రాయానికి రావలసిన అంశం. కనుకనే విచారణకు పెట్టి చూసుకోవలసి వస్తోంది. ఇక సామాన్యులకీ విషయం అనవసరం అన్న మాట నాకూ అంగీకారమే. సిద్దాంత కారులకు, సైద్దాంతిక రచనలు చేసేవారికీ, భావ విప్లవ క్షేత్రంలో అధ్యయన శిక్షణ తరగతుల బోధనాంశాల స్థాయికి ఈ అంశం చాలా మౌలికమూ, కీలకమూ కూడా. అందుకే దీనిపై ఇంత విచారణ చేయవలసి వస్తోంది.
(3) అంత ముఖ్యం కానివి చాలా ఉన్నై అంటూ అట్టి వాటికీ నేను చాలా ప్రాధాన్యతనిస్తున్నట్లు వాశ్రారు. అవేమిటో, నా రచనల్లో అవి ఎక్కడ చోటు చేసుకుని ఉన్నాయో చెప్పండి. ఒకసారి తిరిగి చూసుకుంటాను. ఒక్క విషయం! ముఖ్యమా? కాదా? అన్నది నిర్ణయించేందుకు మీరెంచుకున్న విధానమూ, కొలత ఏమిటోనూ తెలియజేయండి.
(4) మీరన్నది చాల వరకు సరైందే. కానీ నా రచనలన్నీ ప్రధానంగా తాత్విక క్షేత్రానికి చెందినవో, దానితో ముడిపడి ఉన్నవో అయ్యుంటాయి. నా రచనల ప్రధాన లక్ష్యం కూడా మేధావుల నుద్దేశించిందేనన్నది ఒక నిజం.
(5) హేతువాదులకు ఒక వ్యక్తిగానీ గ్రంథంగానీ ప్రమాణం కాదంటున్నామంటే దానర్థం అతడు చెప్పాడు గనుక అనో ఆ గ్రంథం చెప్పింది గనుక అనో ఆయా అభిప్రాయాలను నెత్తికెత్తుకోవడమనేగాని, ఒప్పు చెప్పినా వ్యక్తి ప్రామాణికుడు కాడు గనుక ఒప్పుకోను అన్న అర్థం తీసుకోకూడదు. తప్పో ఒప్పో నిర్ణయించుకునే సందర్భంలో సరైన ప్రయోగ పద్దతిన సరిచూసుకోవడమన్నదే విధానం కావాలిగాని, ఫలాని వ్యక్తో, గ్రంథమో చెప్పింది గనుక సరిచూసుకోనక్కరలేదు అనకూడదన్నదే పై మాటల అర్థం. మీకిది అంగీకారమైతే ఆ వాక్యాన్ని ఇద్దరం ఒకే రకంగా అర్ధం చేసుకున్నా మన వచ్చు కానీ మీరిరువురూ నాకు ప్రమాణం కాదంటూనే, హేతువాదం కూడా నాకు ప్రమాణం కాదన్నారు. అదేమిటో నాకర్థం కాలా. ఇంతకూ హేతువాదమంటే మీ అర్థమేమిటి? అదీ నాకు ప్రమాణం కాదన్న మాటకు మీ అర్థమేమిటి? మీరే చెపితే మేలు.
(6) ఎం.కే. గౌరవ్‌ లేఖ నుండి గ్రహించగలిగిన అభిప్రాయాలంటూ నేను కొన్ని పాఠకులముందుంచాను. వాటినీ పరికించండి లేదా ఆ లేఖపై మీ కేమనిపిస్తుంటే అది గౌరవ్‌కు వ్రాస్తూ, నాకొక నకలు ప్రతిని పంపండి. లేఖపై గౌరవే వివరణ చేయాల్సి ఉంది. కనుక దానికొరకై వేచి చూద్దాం.
(7) ప్రతి రచనలోనూ కొన్ని విరుద్ద భావాలుండే వీలుంది అంటూ, అట్టివి మీ రచనలోనూ ఉన్నాయ్‌, అనన్నారు. ఈ ప్రకటన ఒకింత తీవ్రంగా (సీరియస్‌గా) తీసుకోవలసిందిగా ఉంది. ఒక వ్యక్తి ఏదైనా విషయం పై ఒకసారి తానన్న మాటకు వేరుగా మరోమాట చెపితే, సూత్రప్రాయంగా దానిని 'స్వవచన వ్యా ఘాతం' (ఐలిజితీ ్పుళిదీశిజీబిఖిరిబీశిరిళిదీ) అని అంటారు. అట్టిది ఎప్పుడు జరుగుతుంది?
(1) ఆ విషయంలో ముందేర్పడ్డ అభిప్రాయం తప్పని తెలిసి, దానికి మారుగా సరైందనుకుంటున్న మరో అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నప్పుడు. అయితే అలాగే జరిగినట్లైతే, ఏ ఒక్కసారి మాట్లాడినప్పుడూ ఆ రెంటినీ తన భావాలుగా ప్రకటించడతడు. ఒకనాడు తానలా అనుకున్నాననీ, అనంతరం దానిని మార్పుకుని, ఇప్పుడిలా అనుకుంటున్నాననీ చెపుతాడు. అలాటి వాటిని స్వవచన వ్యాఘాతాలనరు. ఇక అనుభవంలో సరిచూసుకోకుండా గ్రంధాలనుండో, ఇతరుల మాటలనుండో ఆ అభిప్రాయాలను స్వీకరించినప్పుడే అలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనుభవ జ్ఞానంలోగానీ, సరి చూసుకున్నాక ఏర్పడ్డ నిర్ణయాలలో గాని అట్టి పరస్పర విరుద్ధమైన అభిప్రాయలుండనే ఉండవు. అవునో కాదో ఆలోచించి చూడండి. 'నా రచనల్లోనూ అట్టివి ఉన్నాయనన్నారు' అవునా? ఏవి? ఎక్కడలాటివి ఉన్నాయో చూపించండి. అ పొరపాటు జరిగి ఉంటే, ఆ విషయంలో ఆ మేరకు నేను జ్ఞానం (అవగాహన) లేని వాణ్ణన్నట్లే. ఇప్పటికైనా ఆ విషయంలో నాకేమైన అవగాహన కలిగి ఉంటే, దీన్నంతటినీ కలిపి ఒక ప్రకటన చేసి ఆ తప్పు దిద్దుకుంటాను. కానీ రాజేంద్ర ప్రసాద్‌గారూ! మీరొక సాహసవంతమైన ప్రకటన చేశారు. అట్టివి వెంకటాద్రి గారి రచనల్లోనే కాదు. ప్రతి వక్కరి రచనల్లోనూ ఉంటాయి. మీ రచనల్లోనూ ఉన్నాయని నిజానికిది చిన్న ఆరోపణకాదు. అది సరే మీ లేఖలోనూ అలాటిది చోటు చేసుకునుందేమో జాగ్రత్తగా పరిశీలించి చూడండి.
(8) మీ లేఖ పై హేతువాది ఎలా స్పందిస్తుందో వేచి చూద్దాం. ఉంటాను సెలవ్‌.
హేతువాదోద్యమ పునరుజ్జీవన యత్నాలు - 4
ఉద్యమ మిత్రులారా! రాజకీయ సంక్షోభం తెర మీదికి రావడంతో, మనం తలపెట్టిన నెలవారీ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. జరుగుతున్న అవాంచనీయతలన్నింటికీ, అవగాహనా పరులూ, స్వతంత్రాలోచనా శీలురు లేకపోవడమన్నదీ బలమైన కారణమే. ఆ లోటును సరిచేయగలిగింది హేతువాద ఉద్యమమే. కనుక ప్రస్తుత సంక్షోభాలు సమసిపోవాలన్నా, భవిష్యత్తులో మరల మరల పుట్టుక రాకుండా ఉండాలన్నా హేతువాద ఉద్యమం (1) బాగా విస్తరించడం, (2) బలంగా వేరూనుకోవడం, స్వతంత్రాలోచనా పరుల రాశిని పెంచడం అన్నవి జరిగితేనే సాధ్యపడుతుంది. హేతువాద ఉద్యమం ప్రధానంగా భావజాల క్షేత్రానికీ, ఆలోచనా ప్రక్రియ రీతిరివాజులకూ చెందిందే అయినా, దానిని ఉద్యమ రూపంలో కొనసాగించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికా అవసరం. ఎలా ఒక ఉపాధ్యాయునికి బోధించడమన్నపనే సిద్దాంతానికి తగిన ఆచరణ కూడా అవుతుందో, అలానే భావజాల క్షేత్రంలో పనిచేసే వారికీ ప్రజలకు బోధించడమన్నదే ఆచరణ రూపం కూడా అవుతుంది. పుస్తకాలు ముద్రించడం, విద్యాలయాలలో పాఠ్యపుస్తకాలు ముద్రించడంలాటిదే. దాంతో విద్యనందించడం అన్న ప్రక్రియ ఎలా పూర్తి కాదో, విద్యాలయాలు పెట్టి నిపుణుల చేత ఆ పుస్తకాంశాలను విద్యార్థుల తలలకెక్కించడం చేయాల్సి ఉంటుందో, అలానే భావజాల క్షేత్రంలోను పుస్తక ప్రచురణలతో ఆ ప్రక్రియ పూర్తికాదు. దానిని ప్రజలకందించే బోధకులను అంటే శిక్షణ పొంది మాట్లాడగలిగిన కార్యకర్తలను తయారు చేసికుని, భావ విప్లవోద్యమ కార్యాచరణలో భాగంగా సమాజంలో శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నప్పుడే, ఉద్యమం ఆచరణ రూపంలోనూ కొనసాగుతున్నట్లు.
హేతువాద సిద్దాంత భావజాలం చాలా విస్తృత క్షేత్రంతో సంబంధాలు కలిగి ఉంటుంది. వ్యక్తి జీవితంలో హేతుబద్దాలోచన అవసరం ఏమిటో, హేతుబద్దాలోచనలో హేతువు స్థానంలో ఎటువంటి సమాచారాన్ని ఆధారంగా ఎంచుకోవల్నో, అక్కడ పొరపాటు జరిగితే జరిగే అనర్థమేమిటోనూ వివరించి అవి జరక్కుండా ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలోనూ తెలయజేస్తుంది. హేతువాద సిద్దాంతం యొక్క గొప్ప తనమేమిటంటే, హేతుబద్దాలోచనాజనిత నిర్ణయాలు అంతిమం- పరమం- కావనీ, అవి మరల ప్రయోగరీత్యా - ఆచరణలో - సరిచూసుకోవలసి ఉంటుందనీ కూడా తెలియజేస్తుంది. ఉహాత్మక నిర్ణయాల విషయంలోనేగాక, ప్రత్యక్ష విషయాలలోనూ అవసరమైతే ఫలుదపాలు పునఃప్రయోగాలు చేసుకుని చూసుకోవలసిందేనని ఉద్బోధిస్తుంది. ఇక శబ్ద ప్రమాణం విషయమైతే, ఎవరు చెప్పిందిగాని వారు చెప్పారు గనక ఒప్పనో, తప్పనో నిర్ణయానికి రావడం సరైన విధానం కాదని విడమరచి చెపుతుంది. ఈ విషయాన్నే 'హేతువాదికి ఏ వ్యక్తీ, గ్రంథమూ ప్రమాణం కాదు' అంటూ వెంకటాద్రిగారు చెప్పారు. మనమంతానూ ఆ విషయాన్ని ఆయన చెప్పారు గనుక ఒప్పనకుండా, అనుభవంలో చూసుకుని, బాగా ఆలోచించుకునే అది సబబేనన్న నిర్ణయానికి వచ్చాము.
హేతువాదోద్యమ సాఫల్యత అంతా వ్యక్తుల్ని స్వతంత్రాలోచనా శీలత కలవారినిగా రూపొందించడం దగ్గరే ఉంది. స్వతంత్రాలోచనాపరులు కావాలంటే ఏ విషయం గురించి ఆలోచించాలనుకున్నామో దానికి సంబంధించిన సరైన (యోగ్యమైన) సమాచారాన్ని సంపాదించుకుని ఉండాలి. కనుకనే స్థాయి కలిగిన హేతువాదిగా (నామమాత్రపు హేతువాదికాకుండా) ఉండాలన్నా, హేతువాదోద్యమ కార్యకర్తగా సమర్థవంతంగా కొనసాగాలన్నా, వ్యక్తి, సమాజము, ప్రకృతి అన్నవాటికి సంబంధించి, శాస్త్రీయ సమాచారాన్ని ఆర్జించుకుని ఉండాలి. అది జరగాలంటే తప్పని సరిగా మనకు అధ్యయనం ఉండి తీరాలి. తరచుగా అధ్యయన తరగతులూ జరుగుతుండాలి.
ఒక్కమాట! ముందు మన మన తలల బూజుదులుపుకోకుండా, తలలను సరైన సరుకుతో నింపుకోకుండా, సమాజానికి దీనినందించాలి, సమాజం నాదే అని నిండు గుండెతో తలంచకుండా, మనలో ఏ వ్యక్తీ యోగ్యమైన హేతువాదిగా ఉండలేడు. హేతువాదోద్యమ సారధిగ నూతన పాత్రకు న్యాయం చేయలేడు. కనుక మిత్రులారా! అధ్యయన పరులుకండి, అధ్యయన తరగతులను ఎక్కడికక్కడ ఆరంభించండి. ఆలోచించి స్పందించండి ఉంటాను. ఉద్యమాభినందనలతో
మీ
సురేంద్ర
రాష్ట్ర సంక్షోభం - పరిష్కార యత్నాలు
ప్రజాసంక్షేమం, సమానాభివృద్ధి, పాలనా సౌలభ్యం అన్న మూడంశాల ప్రాతిపదికనే రాష్ట్రాల పునర్విభజన పనులు జరగాలన్నదే రాజ్యాంగ హృదయం.
దీనిని దృష్టిలో పెట్టుకోకుండా అడిగేవన్నీ, చేసేవన్నీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమైనవే అవుతాయి. అలాటివన్ని సమన్యాయాన్ని పట్టించుకోనివీ, ఎవరికివారు తమ వంతుకు అధిక లాభం కోరుకునేవిగానే ఉంటాయి. ప్రస్తుతం వినవస్తున్న మూడు ప్రాంతాలవారి వాదనలుగానీ, విభజన జరగాలి, విభజన జరగవద్దు అన్న రెండు ప్రధాన వాదనలుగానీ ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్నవిగాకాక 'తన-పర' అన్న దృష్టితో స్వీయప్రయోజనాలనుద్దేశించినవిగ మాత్రమే ఉంటున్నాయి. పార్టీల స్వప్రయోజనాలు, ప్రాంతాల స్వప్రయోజనాలు అన్న దానికి, ఉద్యమానికి తమబలం చాలదనుకున్న రాజకీయులు ఉద్యోగుల్నీ, రేపటి ఉద్యోగార్దులు మీరేనని చెప్పి విద్యార్ధుల్ని రెచ్చగొట్టి ఉద్యమంలోకి ఈడ్చుకొచ్చారు. ఈ కుట్ర ఎక్కడ బైటపడుతుందోనని అనిపించి ఈ ఆందోళన రాజకీయులు చేస్తున్నది కాదనీ, ఉద్యోగులూ విద్యార్థులూ పూనుకుని, ప్రజలనూ కలుపుకుని రాజకీయుల, రాజకీయాలకతీతంగా న్యాయంకొరకు చేస్తున్న పోరాటంగా చిత్రించేందుకు పడరాని పాట్లన్నీ పడి కొంత వరకు సఫలీకృతులు కూడా అయ్యారు.
ప్రజలెప్పుడూ వివిధ శ్రేణుల నాయకుల ఎత్తుగడలలో పావులుగనో, కొన్ని సార్లౖేతే బలిపశువులుగనో అయ్యేటివాళ్ళేనన్నది అంబేద్కర్‌ 1948 ప్రాంతాలనాడే చెప్పాడు. అతడన్నాడనికాక, అది ఎప్పుటికప్పుడు ఎప్పుడు పరిశీలించి చూడగలిగినా, జరుగుతున్న వాస్తవమేనని రుజువవుతూ వస్తోంది. ఈ సారి అదే జరిగింది. అయితే అది సాదాసీదాగా, అంతగా ఆందోళనపడనక్కరలేని స్థాయిలోకాక, ప్రమాదకరస్థాయికి పరిణమించింది.
రాష్ట్ర ప్రభుత్వం పాలనా పరమైన నియంత్రణను దాదాపుగా కోల్పోయింది. కేంద్ర ప్రభుత్వం ఒక వంక వచ్చిపడుతున్న అవినీతి ఆరోపణల నుండి బైటపడడానికీ, రాజకీయ భవిష్యత్తు కొరకు వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్ను కోవడంతో తలమునకలై ఉంది. ఎక్కడా రాజ్యాంగానుకూల వైఖరిగానీ, నీతి న్యాయాలన్న దృష్టి గాని కనపడడం లేదు. తంతేనో, తంతాడనిపిస్తేనో తప్ప ఎవరిపనులను పట్టించుకునే పరిస్థితి లేదక్కడ. సమన్యాయమన్న మాట, పనిలేనివాళ్ళో, అసమర్థులో మాట్లాడేమాటగా వాడుకలో చూడడం మొదలైంది. ఇవెంతటి అడ్డగోలు పరిస్థితులైనా, సమష్ఠిహితైషులైన మేధావులు పూనుకుని సమాజానికి దిశా నిర్ధేశం చేయవలసే ఉందన్నది విజ్ఞులు కాదనలేని వాస్తవం. అదిగో ఆ బాధ్యతను గుర్తెరిగిన మేము ఆ దిశగా కొన్ని యత్నాలు చేయ మొదలిడినాం.
అందులో ప్రస్తుతం మూడు ప్రాంతాలుగ చూడబడుతున్న సీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో మొత్తంగా చూస్తే ప్రతిప్రాంతంలోనూ కొన్ని జిల్లాలు వెనుకబడి ఉన్నా (ఉదాహరణకు సీమలో అనంతపూర్‌, తెలంగాణలో మెహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌; ఆంధ్రలో (శ్రీకాకుళం ప్రకాశంలో కొంత భాగం) ప్రాంతాలవారీగా రేపు విభజన జరిగాక స్వయంగా నిలదొక్కుకోలేని పరిస్థితి సీమకే ఉంది. మిగిలిన రెండు ప్రాంతాలకు అంటే ఆంధ్ర, తెలంగాణా (ఏది వెనక, ఏది ముందన్నదలా ఉంచినా) కొద్దికాలంలో పోటీపడి నిలదొక్కుకుని అభివృద్ధి చెందే అవకాశాలు తగినంతగానూ ఉన్నాయి. కనుక విభజన అనివార్యమే అయితే, మాట్లాడుకోవలసిన విధి విధానాలలో తొలిప్రాధాన్యత సీమనేమిచేద్దామన్నదిగా ఉండాలి. ఈ విషయంలో ఆంధ్ర, తెలంగాణాలు రెండూ సీమ భద్రత విషయంలో చిత్తశుద్ధితో బాధ్యత వహించాలి.
అలాగే గ్రామ సీమలు అంతో ఇంతో పుంజుకోవాలంటే కనీస పక్షంగానైనా వాటికి ఎంతో కొంత శాతం బడ్జెట్‌ నిధుల్ని నేరుగా అందేలా కేటాయింపులు జరగాలి. సంపాదనే పరమావిధిగా నడుస్తున్న అధికార రాజకీయాలు, వ్యాపార రాజకీయాలలో కాకలు తీరిన రాజకీయులు ఈ పనులు చేయడానికి వారంతట వారుగా పూనుకోనే పూనుకోరు. సమర్ధత, మనస్సు ఉన్నవాళ్ళు పై నుండే విధానం ద్వారా అవి జరిగేలా చూడడమో ప్రజలు మేల్కొని తమదితమ కిమ్మని నిలవేయడమో చేయడం ద్వారా మాత్రమే ఆ పని జరుగుతుంది. అందులోనూ ప్రజలందరిని అందుకు సన్నద్దుల్ని చేయడం అంత సులభమూకాదు, అంతత్వరగానూ కాదు. కనుక కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్ళలో సమాజహితాన్నికోరగల మంచివాళ్ళను కదిలించడం ద్వారా ఆ పని జరుగుతుందేమో ఒక ప్రయత్నం చేద్దాం అనుకుని మేము కొందరం అందుకు పూనుకున్నాం.
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక, సాధికారిక సమాఖ్య అన్న రెండు వేదికల ఉమ్మడి నిర్వహణతో ఈ కృషి ఆరంభమైంది. డా.బ్రహ్మారెడ్డిగారి సారధ్యంలోని జె.వి.వి. సత్యాన్వేషణ మండలి, ఏకలవ్య, జై భారత్‌లు స.హ ఐక్యవేదికనుండీ, లోక్‌సత్తా, సోలిపేట రామచంద్రారెడ్డిగారూ మరి కొందరు మిత్రుల సాధికారిక సమాఖ్య వైపు నుండీ ఈ పనిని మొదలెట్టారు. సమాజహిత కాంక్ష ప్రజాస్వామికీకరణ జరగాలి అన్న ఆకాంక్ష బలంగా కలిగిన కె. నాగేశ్వర్‌ (యం.ఎల్‌.సి) పద్మనాభయ్యగారు, కె.ఆర్‌. వేణుగోపాల్‌గారు, రాజేశ్వరరావుగారు, సాయిరెడ్డిగారు, మరి ఎం. పద్మనాభరెడ్డిగారు కొందరు మేధావుల్ని వేదిక మొదలెట్టిన కార్యక్రమంలోకి కలసిరావలసిందిగా అభ్యర్థించాలనుకోవడం జరిగింది. అలాగే స్థానిక ప్రభుత్వాలకు అధికారాల విషయంలో క్రియాశీల పాత్ర వహించాల్సిన పంచాయితీ సర్పంచులనూ ఈ కృషిలో భాగస్వాముల్ని చేయాలనుకున్నాము. మూడు, నాలుగంశాలపై ఏకాభిప్రాయాన్ని సాధించి వాటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రాష్ట్రంలోని అన్ని పార్టీల దృష్టికీ తేవాలన్నది తొలిథ కార్యక్రమంగా అనుకున్నాం.
దీనిపై ఈనెల 22వ తేదీన ఒక సమావేశాన్ని హైద్రాబాద్‌లో నిర్వహించాలనుకున్నాము.
అందులో స్వీకరించాల్సిన అంశాల ముసాయిదా రూపం ఇలా ఉంది.
(1) రాయలసీమను అభివృద్ధి పరచేందుకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ దానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి, పరిశ్రమలను ఆకర్షించాలి. పారిశ్రామికులకు వివిధ పన్ను మినహాయింపులూ, కేంద్ర నిధులనుండి ప్రత్యేక కేటాయింపులూ జరగాలి. (అలాగే మూడు ప్రాంతాలలోని వెనుకబడిన జిల్లాలకు, జిల్లా భౌగోళిక పరిస్థితులకనుగుణ్యమైన అభివృద్ధి పథకాలను రూపొందించి, అందుకుగాను ప్రత్యేక నిధులను సమకూర్చాలి)
(2) నీటి వనరుల విషయంలోనూ పంపిణీ విషయంలోనూ మూడు ప్రాంతాల ప్రతినిధులతో కూడి, నిపుణుల కమిటీని వేసి, నీటి పంపిణీ త్రిసభ్య కమిటీ నిర్ణయాలకు లోబడి ఉన్న నీటిని న్యాయబద్దంగా పంచుకోవాలి.
(3) అధికార వికేంద్రీకరణకు, పెద్ద మనుషుల ఒప్పందంగా విభజన జరిగాక ఏర్పడే రాష్ట్రాలలోని ప్రభుత్వాలు సిద్దం కావాలన్న నిబంధనను చేర్చాలి.
(4) కేంద్ర ఆర్థిక ప్రణాళికా సంఘం పంచాయితీలకు బడ్జెటు నుండి 25% నిధులను నేరుగా దఖలుపరిచేలా ప్రణాళికారచన చేయాలి.
(5) బాగా వేడెక్కి ఉన్న వాతావరణాన్ని, జాతీయతా స్ఫూర్తితో  మనమంతా 'ఏకప్రజే' నన్న భావనతోను క్రమంగానైనా చల్లబడేలా మూడు ప్రాంతాల వారి న్యాయబద్దమైన కోర్కెలు - అవసరాలు - తీరెలా నియమనిబంధనల్ని రూపొందించాలి. ఈ అంశాల సంక్షిప్త రూపంతో కేంద్రానికో మెమోరాండం ఇవ్వాలన్నది ఇప్పటి మా యోచన.

22వ తేదీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొనగోరు వారు క్రింది  నెంబర్లకు ఫోనుచేసి తెలుసుకొనవచ్చు. 9440474404, 9959828887, 9866074023, 040-27674649, 9490470064.
హేతువాద ఉద్యమ గీతం

పల్లవి : హేతువాదులం మేము హేతువాదులం
మానవాభ్యుదయం కోరు సుమతిశీలురం - మేము ప్రగతి గాములం
(1) ఆలోచన లేకుంటే అడుగు ముందు కేయలేవు
ఆధారం లేకుండా ఆలోచన చేయలేవు
దిక్కుమాలినాలోచన చిక్కు లెన్నొ చేరవేయు
చక్కనైన ఆలోచనె చిక్కులన్ని చక్కజేయు .... హేతు ||
(2) వెనుకకు చూడాలన్నా ముందుకు పోవాలన్నా
హేతుబద్ద యోచనే ఎవరికైన దిక్కన్నా
యోగ్యమైన ఆలోచనే బ్రతుకుబండి విరుసన్న
అది చక్కగ లేకుంటే బండినడక గుండు సున్న ... హేతు ||
(3) హేతువాద మంటేనే ఎగిరెగిరీ పడతావు
చక్కనైన ఆలోచన అక్కర లేదంటావు
తిక్కగాని రేగిందా పిచ్చికుక్క కరిచిందా
ఒక్కదినం బ్రతికి చూపు హేతుబుద్ది లేకుండా .... హేతు ||
(4) ఇంగిత జ్ఞాన మన్నదీ హేతువు ఫలితమేర
విచక్షణా జ్ఞానమున్ను హేతుబుద్ది జనితమేర
వైజ్ఞనిక ప్రగతికంత హేతుబుద్దె మూలమురా
హేతుబుద్ది లేకుంటే బ్రతుకు బుగ్గిపాలేరా .... హేతు ||
(5) శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకొమ్మని
అశాస్త్రీయా లన్నింటిని గెంటి వేయరమ్మని
ప్రయోగాల పద్దతిన ఆర్జించిన జ్ఞానాన్నే
అందుకునీ ప్రగతిబాట పయనింతము రండనే ... హేతు ||

No comments:

Post a Comment