Friday, July 15, 2016

నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుగుతున్న ప్రజాస్వామ్యం - పార్టీలు - ప్రచారాల తీరుతెన్నులు


నియంతృత్వపు ఉక్కుపాదాల క్రింద నలుగుతున్న ప్రజాస్వామ్యం - పార్టీలు - ప్రచారాల తీరుతెన్నులు


దేశంలో 1. మోడీ 2. రాహుల్‌ గాంధీ, సోనియాగాంధీ, భారత ప్రధాని - ప్రచారాలు

రాష్ట్రంలో :-
 1 తెలుగుదేశం - చంద్రబాబు నాయుడు, 2. లోకేష్‌ 3. బాలకృష్ణ

2. టి.ఆర్‌.ఎస్‌  - 1. కె.సి.ఆర్‌ 2. కవిత  3. హరీష్‌రావు

3. వైకాపా - జగన్‌ 2. షర్మిల 3. విజయమ్మ

4. సి.పి.ఐ - 1. నారాయణ

5. సి.పి.ఐ (ఎమ్‌) - 1. రాఘవులు

6. బి.జె.పి - 1. మోడీ 2. వెంకయ్య నాయుడు 3. చిన్నమ్మ

7. కాంగ్రెస్‌ - 1. రాహుల్‌ 2. సోనియా 3. ప్రధాని 4. ప్రియాంక గాంధీ

8. జైసమైక్యాంద్ర -  కిరణ్‌ కుమార్‌ రెడ్డి

9. లోక్‌సత్తా - జయప్రకాష్‌ నారాయణ

10. ఆమ్‌ ఆద్మీ - కేజ్రీవాల్‌

11. టి.ఆర్‌. యల్‌.డి - జయప్రద

12.     - మందకృష్ణ మాదిగ

13. ఎం.ఐ.యం - అసదుద్దీన్‌

గమనిక :- చిన్నా చితకా పార్టీలనలా ఉంచితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా 1. బిజెపి 2. కాంగ్రెసు 3. టి.డి.పి 4. వైకాపా 5. టిఆర్‌ఎస్‌ మధ్యనే యుద్ధంయుద్ధం జరుగుతూ ఉంది. యం.ఐ.యం యుద్ధంలో లేదుగానీ పై అయిదింటిలో దేని బలాన్నెనా తగ్గించడానికీ, పెంచడానికీ కూడా సత్తా కలిగి ఉందది.

కొన్ని విషాద సంఘటనలు


ఒక విషాదం :- స్వాతంత్య్ర పోరాటం నాటికి కాంగ్రెసుకు దీటైన ప్రత్యామ్నాయంగానూ, ప్రతి పక్షంగాను మనగలిగిన కమ్యూనిస్టు పార్టీ, 'నానాటికీ తీసికట్టు నాగం బోట్టు' అన్న సామెతగా బలహీన పడుతూ వచ్చి, చివరకీనాడు మనుగడ పోరాటం చేస్తూ ఉంది. ఆ పార్టీలోని ప్రధాన కూటాలైన సి.పి.ఐ,  సి.పి.యంలు ఒకటి కాంగ్రెసుతోనూ, మరోటి వైకాపాతోనూ జత కట్టడం, కనీస పక్షం ఆ రెంటివరకైనా కలసికట్టుగా ఎన్నికల వరకైనా పొత్తుకు సిద్దపడకపోవడం దానికదే ఒక పెద్ద విషాదం.

మరో విషాదం :- 67 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో, రాజకీయాలంటే కుట్రలు, కుతంత్రాలు ఎత్తుగడలు - చిత్తు చేసుకోడాలు, అస్మదీయులు - తస్మదీయులన్న పోకడలు, వివిధ పార్టీలలో ఉంటూనే, ఎవరి అవసరాలు వారు తీర్చుకోడాలు, ఒకరి అవసరాలు ఒకరు తీర్చడాలు, అన్న మాటేనని నమ్ముతూ వచ్చిన జనం; ఏ కళనున్నారోగానీ లోక్‌సత్తాను, ఆమ్‌ ఆద్మీ పార్టీని, మంచి రాజకీయాలకు మొలకలుగా తలచినట్లు కనపడింది. 30 ఏండ్ల వెనక్కి వెళ్ళి చూస్తే - జనతా పార్టీ విషయంలోనూ ప్రజలు మంచికి అనుకూలంగా నిలబడిన దాఖలా కనపడుతుంది. అయితే పెద్ద విషాదమేమంటే, ఎప్పుడో ఒకసారైనా, ఈ ఒక్కసారి చూద్దామనుకుంటూ జనం సాంప్రదాయ రాజకీయ పార్టీలనకు విడచి వీరివైపు అనుకూల దృష్టి పెట్టినా, వీరెవరూ జనం నమ్మకాల్ని సొమ్ము చేసుకోలేదు సరికదా వమ్ము చేశారనీ అనవచ్చు. మంచి రాజకీయాల దిశగా మరో గట్టి యత్నం చేద్దామనుకునే వారికి, ఈ మంచివారి వైఫల్యాలు పెద్ద అడ్డుగా నిలుస్తాయి. ఇదీ మరో పెద్ద విషాదమే. ఈ ఎన్నికల్లో లోక్‌సత్తా ఎవరితోనైనా పొత్తులకు సిద్దం అంటూ దేబిరించుకున్నంతగా ప్రవర్తించడాన్ని, విషాదంగా కాక ఎలా అర్థం చేసుకోగలం? ఒకరోజు మీడియాలో ఆమ్‌ ఆద్మీతో పొత్తంటూ లోక్‌సత్తా బహిరంగ ప్రకటన రావడం, మరునాడు అలాటిదేమీ లేదని ఆమ్‌ ఆద్మీపార్టీ తరపున మరో ప్రకటన రావడం; మంచిరాజకీయాలు వస్తే బాగుండుననుకునే వారికి విషాద వార్తకాక మరేమిటి?

మల్కాజిగిరిలో మరో విషాదం :-

సమాజహితైషేననదగ్గ జె.పి. మల్కాజిగిరి నెందుకు ఎంచుకున్నారో నిజాయితీగా ఆయనే చెప్పాలి. రాష్ట్రాన్ని వదలి, కేంద్రం వైపుకు ఎందుకు దృష్టి పెట్టారోనూ ఆయన చెపితేనే మేలు, కేంద్రంలో ఉంటే ఎన్నో చేయవచ్చులాటి, వాదనకు చెప్పే కారణాలకంటే, బలమైన కారణాలున్నాయనడమే నా హేతుబుద్దికి (వివేకానికి) నిజమనిపిస్తోంది. ఈ మధ్య ఆయన, లోక్‌సత్తా సంస్థగా ఆవిర్భవించిన సందర్భంలో తొలినాళ్ళలో ప్రకటించిన పలువిలువైన అభిప్రాయాలకు వేరుగా ప్రవర్తించడం, మాట్లాడడం కనపడుతూ వస్తొంది. ముఖ్యంగా, ఆర్థికాభివృద్ధి విషయంలో సరళీకృత ఆర్థిక విధానం, భారీ పరిశ్రమల నిర్మాణం, విదేశీ పెట్టుబడులతో సహా పెట్టుబడి దారుల నాహ్వానించాలనడం, అధికోత్పత్తే ఆర్థికాభివృద్ధికి తిరుమంత్రమన్నట్లు మాట్లాడడం, నా అవగాహనననుసరించి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. సమానాభివృద్ధి మూల సూత్రంగా లేని, మూలవనరులను పొదుపుగా వాడుకోవాలన్న దృష్టిలేని, ఏ అభివృద్ధీ రాజ్యాంగాశయాలకు అనుగుణ్యమైంది కానే కాదు. ఈ విషయంలో, రాజ్యాంగ నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో పలికిన అత్యంత కీలకమైన మాటల్ని గుర్తు చేసుకోవడం ఉచితం. సోషలిస్టు ఆర్థిక విధానాన్ని అమలు పరచుకోకుండా ఆర్థిక సమానత్వాన్ని సాధించడం ఎలా సాధ్యమో నా ఊహకందడం లేదు. అనంటాడాయన. ఆయనన్నాడని కాదుగానీ, సమానాభివృద్ధి భవిష్యత్తుకు భద్రత అన్నది వివేకం కోరదగిన భావనేనని అంగీకరించగల వాళ్ళంతా, అలానే ఆలోచించాలి. ఆలోచిస్తారు.

మరో సమాజహితైషీ, సామాజిక క్షేత్రాలకు చెందిన వివిధ అంశాలలో లోతైన అవగాహన కలిగిన మేధావీ, కె. నాగేశ్వర్‌ గారూ మల్కాజిగిరి నుండే లోకసభకు అభ్యర్థిగా నిలబడ్డారు. తాను గెలవాలన్న దృష్టితోకంటే, ఆర్థికాంశాలకు సంబంధించి జె.పి. పోకడను ఎండగట్టడానికనే ఆయన మల్కాజిగిరిని ఎంచుకున్నారు. ఆర్థికాంశాలకు సంబంధించి జె.పి చెపుతున్న దానిని, ఖండించకపోవడం ఒక మేధావిగా, రాజ్యాంగాశయాన్నెరిగిన వాడిగా తగని పని అని అనుకుని, దానిని ఖండించడం తనకు నైతిక బాధ్యత అనంటూ ఆయన ఆస్థానంలో నిలబడ్డారు.

నిజానికి, వారిద్దరి వ్యక్తిత్వాలను బట్టిగానీ, వారికున్న విజ్ఞత, వివేక సామర్ధ్యాలను బట్టిగానీ, వారిరువురూ, (అలాంటి మరికొందరూ) కూడా శాసనసభల్లోనూ లోక్‌సభలోనూ ఉండాలి. అట్టి వారిని మనలాంటివారం పట్టుబట్టి ఎంపిక చేసుకుని చట్ట సభల్లోకి పంపుకోవాలి. ఆవేశానికి లోను కాకుండా వారిరువురూ వేరు వేరు స్థానాల్లో నిలబడి, ఇరువురి తరపునా ఇరువురూ ప్రచారం చేసుకుని ఇరువురూ ఎన్నిక కావడానికి చేయవలసినంతా, కనీసం చేయగలిగినంతైనా సమష్టిగా కృషి చేయాల్సింది. ఆ సంయమనాన్ని పాటించకపోగా, ఒకటి రెండంశాలలో అవగాహనల్లోని వ్యత్యాసాలాధారంగా ఒకరికెదురుగా ఒకరు నిలబడి, వారివారికున్న నైతిక బలాన్ని పరిపతిని, (మంచివారన్న పేరును) వాదనా బలాన్నికూడా ఉపయోగిస్తూ, పరస్పరం ఒకరి ఓటమికి మరొకరు కారకులు కావడానికి సిద్దపడడాన్ని, మంచి కావాలనుకున్న, మంచివారు రావాలనుకుంటున్న వారికి విషాదమనికాక మరేమనుకోగలం. వారిరువురు గాని ఎన్నికైయ్యుంటే అనేకానేక విషయాలలో 5 ఏండ్ల పాటు తమ మేధస్సును, తమ వాయిస్‌ను సమాజహితం దిశగా దిశానిర్ధేశం చేయడానికి ఉపయోగించగలిగి ఉండేవారు. నా దృష్టి నుండి, అభ్యుదయా కాంక్షులందరికీ వారిరువురూ పోటీలో ఎదురెదురుపడడం ఖచ్చితంగా గొప్ప విషాధసన్నివేశమే.

ప్రజాస్వామ్యం పేరిట - ప్రజా ప్రతినిధులుగా రాజులు, మహారాజులు, చక్రవర్తులు


ముఖ్యమైన ఏ పార్టీ అధినేతల్ని చూసినా, 'నేనే మీకు రక్షకుణ్ణి, నన్నెంచుకుంటేనే మీకు భవిష్యత్తు' అన్న ఒకే ఒక్క పోకడ కనిపిస్తోంది.

 నన్ను చూసి అభ్యర్తులకు ఓటేయండి, అన్న నినాదమే అన్ని పార్టీల అధినేతల నుండి వెలువడుతోంది. ఒక అసెంబ్లీ స్థానానికిగానీ, ఒక లోక్‌సభ స్థానానికి గానీ, ప్రజా ప్రతినిధిగా ఒకణ్ణి ఎందుకెంచుకోవాలో నన్నది, ఎక్కడా ముఖ్యమైన అంశంగా చూడబడడంలేదు. ఆయా చట్టసభలకు అభ్యర్ధులుగా నుంచున్న వాళ్ళలో వ్యక్తిత్వం ఉన్నవాళ్ళే కనబడడంలేదు. ఆయా పార్టీల అధినేతలు ప్రసంగిస్తూ ప్రచారం చేస్తుంటే, ఆ పార్టీ కండువా కప్పుకుని, మెళ్ళో ఓదండ వేసుకుని, దండం పెడుతూ శిలావిగ్రహంలా చేష్టలుడిగి నుంచుని కనబడుతున్న వాళ్ళను చూస్తుంటే, వీళ్ళా ప్రజా ప్రతినిధులు !? మనమెంచుకోవలసి వాళ్ళు! అన్న వెటకారపు భావన మదిలో మెదలుతోంది.

గతంలో జరిగిన ఎన్నికలకు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకూ కొట్టవచ్చినట్లుగా ఒక వ్యత్యాసం కనబడుతోంది. గతంలో రాష్ట్ర పర్యటనకు ఒకటి, రెండు ప్రదేశాలలోని బహిరంగ సభలకు మాత్రమే జాతీయ స్థాయి కల ఆయా పార్టీల అధినేతలు వచ్చి వెళ్ళేవారు. అందుకు పూర్తి విరుద్దంగా, అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయి సమావేశాలకూ ప్రధాన మంత్రి అభ్యర్థులుగ ఎంచబడుతున్న మోడీ, రాహుల్‌ అన్న వారూ, కాంగ్రెసు అధినేత్రి (మహారాజ్ఞి) గా తలచబడుతున్న సోనియమ్మ, బిజెపి నుండి చిన్నమ్మ నంటూ తననితాను పరిచయం చేసుకొంటున్నామె ఉరుకులు, పరుగులు వేస్తున్నారు. ప్రధానీ పరిగెడుతూనే ఉన్నాడు. పార్టీ ముఖ్యునిగ మన్మోహన్‌సింగ్‌ పర్యటన అని అనడంలా పత్రికలు. ప్రధాని ప్రసంగం అనే ప్రచారం చేస్తున్నాయి. ఒక పార్టీ ప్రచారానికి ప్రధాని రావడమేమిటో అర్థమైచావడంలా?

ఇక ప్రాంతీయ పార్టీలలో ముఖ్యమైనవిగ చూడబడుతున్నవి టి.డి.పి, వైకాపా, టి.ఆర్‌.ఎస్‌లు

1. టి.డి.పి పోకడ :- సర్వం తానేనన్నట్లుంటుంది చంద్రబాబుగారి వరస. రాజకీయంలోనూ, షడ్యంత్ర రాజకీయంలోనూ రాష్ట్రంలో ఇప్పటి పరిస్థితులలో అతనంత ఘటికుడు మరొకడులేడు. అన్ని నియోజక వర్గాలలోనూ మాట్లాడుతోంది ఆయనొక్కడే. అభ్యర్థులు దిష్టి బొమ్మల్లా నుంచుని ఉంటే, తనకు అధికారం కట్టబెట్టమనీ, తాను అధికారంలోకి రావాలంటే తాను చూపిన వారినే గెలిపించాల్సి ఉంటుందనీ, అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చక్రం తిప్పగలిగిన వాణ్ణి తానొక్కణ్ణేననీ, ఇంకెవర్ని ఎంచుకున్నా ముఖ్యంగా వైకాపా, టిఆర్‌ఎస్‌లను గాని ఎంచుకుంటే అంతా దొంగలపాలేననీ హోరెత్తించేస్తున్నారు.

*    ఇక టిడిపి అభ్యర్థులు :- ఒక్కడూ తన నియోజక వర్గం గురించిగాని, తన గురించిగానీ గట్టిగా నాలుగుమాటలు కూడా చెప్పుకోరు. టి.డి.పిని గెలిపించడం ద్వారా చంద్రబాబును మహారాజును చేయండి. ఆయన ప్రజల్ని - రాజ్యాన్ని - సుభిక్షంగా పరిపాలిస్తాడు. అని మాత్రం ఊదరగొట్టేస్తుంటారు.
*  ఉన్న నాలుగు నాళ్ళలో రాష్ట్రమంతా తానొక్కడే ఎలానూ తిరగలేడుగనక, కచ్చితంగా తన వాళ్ళనుకున్న వాళ్ళ నొకళ్ళిద్దరిని మాత్రం ప్రచారానికి పంపుతున్నారాయన. ఆ యుద్దంలో, ఒకరు కొడుకులోకేష్‌, రెండు వియ్యంకుడు బాలకృష్ణ. కొడుకు రాజకీయాలలో అన్నప్రాసన దశలోనున్నవాడు. అతి రథ మహారథులనబడుతున్న వాళ్ళను జనానికి చూపుతూ, వారిని - ఆ పార్టీ సీనియర్‌ మోస్టుల్ని - గెలిపించమనీ, వాళ్ళు గెలిస్తేనే తన తండ్రి, అదే! చంద్రబాబు నాయుడుగారు సింహాసనాన్నధిష్టించి పాలించడం సాధ్యపడుతుందనీ ప్రవచిస్తున్నాడు.

ఇక రెండో ఆయన, సినిమాల్లో నాయక పాత్రలో చేసినట్లుగానే అభినయం చేస్తూ, అవసరమైతే ఏమాత్రం హుందాతనం లేకుండా తొడగొట్టడాలు, మీసాలు మెలేయడాలు చేస్తూ, నాలుగు వాక్యాలు తడబడకుండా మాట్లాడడం చేత కాని వాడని తెలుస్తూనే ఉన్నా, రాజకీయాలకు సంబంధించి లోతులేవీ తెలియని వాడేనని తెలుస్తూనే ఉన్నా, తగుదునమ్మా అని ప్రచార రథమెక్కుతాడు. డబ్బు దీసుకుని, దర్శకులాడమన్నట్లు ఆడే, ఒక్కోడైలాగు నాలుగైదుసార్లు చెప్పుకుంటూ నటిస్తూ బ్రతికేనటకుల్ని నాయకుల్ని చేస్తూ, వీరాభిమానాన్ని కనబరుస్తూ అభిమాన సంఘాలున్నంతకాలం, ఈనాటకీయుల మాటలకూ ఓట్లు రాలుతునే ఉంటాయి మరి!

ఎన్‌.టి.రామారావును గుర్తు చేసుకోండి. టి.డి.పి కి ఓటేయండి. నన్ను రాజును చేయండి. నేను తప్ప మిమ్మల్ని ఉద్దరించగలవాడు రాష్ట్రంలో లేడు. గతంలోని అన్ని మంచి పనులూ నేను చేసినవే. రాబోయే కాలంలో మంచి పనులేవైనా నేను చేయాల్సిందేనంటూ హోరెత్తించేస్తున్నారు బాబుగారు. కేసిఆర్‌ టక్కరి. మాయలమరాటి లాటివాడు. ఇక జగన్‌ ఎలాగూ జైలు కెళ్ళాల్సినవాడే. కాంగ్రెసు కప్పల తక్కెడ లాంటిది. మిగిలింది ఇక్కడ టి.డి.పినే. బాగా ఆలోచించుకోండి. కేంద్రంలో మోడీతో కూడిన బిజెపీ కూటమే రాజ్యమేలుతుంది. మా ఇద్దరిని ఎంచుకోకుంటే రాష్ట్రానికి అగచాట్లు తప్పవు.


జగన్‌
:- రాజశేఖర్‌ రెడ్డి గారిని గుర్తుచేసుకోండి. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని నిస్సిగ్గుగా మాటాడేస్తుంటాడు. వై.యస్‌.ఆర్‌ ఒకవేళ జనానికి ఏదో చేశాడనుకున్నా, అది ఆయన ముఖ్యమంత్రిగా చేయాల్సిన విధిగనక చేశాడు. దానికి ఈయనకెందుకు పట్టంగట్టాలో మనలాంటి పద్దతెరిగిన బుద్దులకు ఒక పట్టాన అర్థం కాదు. ఒకటో సంతకం, రెండో సంతకం .... 10 సంతకం .. 15 సంతకమంటూ ఒకటే గొడవ. ఈయన పార్టీలో ఎన్నికల బరిలో ఉన్నవారిలో ఒక్కడంటే ఒక్కడు నోరెత్తి మాట్లాడిన పాపాన పోలా. ఉత్సవ విగ్రహాలే అంతా. ఇక ఈ యువకుడు 60 ఏళ్ళ బామ్మల్ని చిన్న పిల్లల్నిలా ముద్దాడుతుంటాడు. ఆశీర్వదిస్తుంటాడు. అమ్మ విజయమ్మ వైయస్‌ఆర్‌ పోవడంతో తాను అనాథనయ్యానని అంటూ సానుభూతిని సంపాదించుకునేందుకు తెగప్రయాస పడుతుంటుంది. బైబిలు చేతిలో పట్టుకుని, క్రైస్తవ ఓటర్లు, మన మంతా క్రీస్తు సంఘం వాళ్ళమేనని అనుకోవాలని కాబోలు, తెగ ఆరాటపడుతుంది. ఇంక కూతురైతే, అన్నకి పట్టంగడితే రాజన్న పాలనే అందిస్తాడంటూ అరుస్తుంటుంది.

ఒక వంక అనేక కేసుల్లో అడ్డగోలుగా బుక్కైపోయి, కుడితితొట్టిలో పడ్డ ఎలుకల్లే కొట్టుకులాడుతూ, మరోఒంక అవినీతిని పారద్రోలండి, దోపిడీని అరికట్టండంటూ తెగ అదరగండంగా వదరుతుంటారు. ఉండలేకో, నెట్టేయబడో ఆ పార్టీలో నుండి బైటపడ్డ వాళ్ళందరూ అతణ్ణి గురించి వెలిబుచ్చే అభిప్రాయం ఒక్కటే. నియంత అతడు. వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఉండలేరు అన్నదే ఆ మాట. డబ్బులు వరదల్లే పారించడమేకాదు, డబ్బులు దండుకోవడమూ దండిగనే జరుగుతుంటుందని, అందులోని అసమ్మతివాదులే గొణుక్కుంటుంటారు.

ముఖ్యమైన మూడు మాటలు

1. టి.ఆర్‌.ఎస్‌ అధికారం చేజిక్కించుకుంటే మనకభ్యంతరం లేదు గాని, ఎట్టి పరిస్థితుల్లోను వెకిలితనమున్న కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి కాకూడదు. అసలలాటి అడ్డగోలు మనుషులు ఏ రకంగానూ పాలనలో భాగస్వాములు కావడానికి తగినవారు కాదు.

2. ఇక వైకాపా తరుఫున జగన్‌ అధికారంలోకి రావడమూ వివేకవంతులు కోరదగింది కాదు.

3. వీటిలో వేటిలోనూ ప్రజాస్వామ్యానికి పట్టం కట్టే వాడొకడూలేడు. కనుక ఇప్పటికి అవసరమైన మాట ఒకటే!

* ఈ మందలోని ఎవనికీ లేదు మన హృదయంలో చోటు. అందుకే వేద్దాము నోటాకే మన ఓటు:
ఈ నినాదం కొంతకాలం దేశమంతా మారు మ్రోగాలి. 'నోటా' అభిమానుల ఓట్ల సంఖ్య గణనీయంగా పెరగాలి. అదే సమయంలో సరైన అభ్యర్ధులను నిలబెట్టుకోక తప్పని పరిస్ధితులు పార్టీలకు ఎదురవ్వాలి.

జై భారత్‌  - మేరా భారత్‌ మహాన్‌ - ప్రజాస్వామ్యం వర్థిల్లాలి.
*  రాబోయే ఎన్నికల నాటికైనా ప్రజలు కళ్ళు తెరవాలి. ప్రజల మనుషులుగా ఉండగలిగిన వాళ్ళను గుర్తించి ప్రతినిధుల్ని చేసుకోవాలి. ఆ దిశగా జనాన్ని మేలు కోలిపిందుకే అభ్యుదయ శక్తులు సంఘటితంగా ఈ ఐదేండ్లు కృషి చేయాలి.

ప్రజాస్వామ్యం ఊపిరిపోసుకోవాలంటే, 1. ప్రతిగ్రామాన గ్రామాభ్యుదయ సంఘాలు ఏర్పడడం, 2. గ్రామ సభలు సరైన రీతిలో ఆచరణకు రావడం వినా మరో దారిలేదు.

జ  అసాంఘిక శక్తులింతగా చెలరేగడానికి కారణం, అభ్యుదయ శక్తులు సంఘటితం కాకపోవడమే.

జ  దేశమింకా గొడ్డుపోలేదు. మంచివాళ్ళకు దేశంలో కొదవలేదు. అయితే వారంతా కలసికట్టుగా ఒక్కటికాలేకపోవడమే - అనైక్యతే - ఈ దేశ సమస్య.

గమనిక :- నడుస్తున్న రాజకీయాలపై పత్రికలో ఏమీ రాయకపోవడం ఏమీ బాగలేదు. ఏదో ఒకటి రాయండి! అన్న వత్తిడి మిత్రులనుండి రావడంతో, వాస్తవ పరిస్తితుల్ని చూస్తుండడం వల్ల కలిగిన మానసిక నిర్వేదం నుండి కలం ఈ విధంగా, ఒకింత పూర్వాపరక్రమం లేకుండానూ - కదలాడింది. వరుస క్రమాన్ని వదిలిపెట్టి వాస్తవాలెన్ని ఉన్నాయో నన్నది మాత్రం పట్టించుకోండి.

మన రేపటి లక్ష్యం - 2019 అవధిగా, ప్రజాస్వామ్య రక్షణకై ప్రజల్ని మేలుకొలిపే ఉద్యమం


ఆలోచించండి. ఆచరణకై కదలిరండి.

జనవాణి - సామాన్యుని మనస్సులోని మాట


1. జె.పి :- మనకవసరం లేని, మన అవసరానికి రాని, క్షుద్ర రాజకీయాలలో గెలవలేని, మంచి మేధావి.

2. కె. నాగేశ్వర్‌ :- జెపి తనలాటి మరో మేధావి, సంఘహితైషి అని తెలుస్తూనే ఉన్నా, తానంగీకరించరాని వైఖరి కనబరచాడన్న ఆవేశంతో, తానూ, అతనూ కూడా ఎంపిక కాకుండేలా పొరపాటు నిర్ణయం తీసుకున్న; 'తప్పు ఎవరు చేసినా ఒప్పన'నే ఆవేశ పూరితుడైన మరో మంచిమేధావి.

3. చంద్రబాబు :- భారత దేశ చరిత్రలో; మహాభారతంలో, గుప్తుల కాలంలో ఇరువురు రాజనీతిజ్ఞులు మరెవరితోనూ పోల్చడానికి వీలు కానంత ప్రజ్ఞావంతులుగ కనబడతారు. ఒకరు కృష్ణుడు కాగా మరొకరు చాణుక్యుడు. ఇరువురు అనుసరించిందీ, సామదాన భేద దండోపాయాలనే. ఇరువురిలో కనబడేదీ శతృపక్షాన్ని చీల్చడం, స్వపక్షాన్ని కూడగట్టడం అన్న ఎత్తుగడే. ఈనాడు రాజకీయముఖ్యులందరూ అనుసరిస్తున్నది ఈ పోకడనే అయినా, ఇప్పటివారందరిలోకీ ఈ విషయంలో విశేష ప్రజ్ఞను కలిగి ఉన్నవాడు చంద్రబాబే. ఎలాగంటే,

ప్రస్తుత రాజకీయంలో బలంగా పని చేస్తున్న సాంఘికాంశాలు 'కులం - మతం' అన్నరెండే. ఇక ప్రాంతమన్న దానినీ మూడో అంశంగా చెప్పుకోవచ్చు.

ఎ)    బి.సిలు, ఎస్‌.సిలు, ఎస్‌.టిలు, మైనారిటీలు అన్నవి కులంపేరున మతం పేరున కట్టగట్టుకుని ఉన్న ప్రధాన సామాజిక వర్గాలు :- 1. ఆర్‌. కృష్ణయ్యను కలుపుకోవడం ద్వారా, అంతమాత్రం సరిపోదని ఎరిగి, అతడే టి.డి.పి తరఫున తెలంగాణా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించడం ద్వారా, మిగిలిన అన్ని పార్టీలలోని బిసి ఓట్లను చీల్చడం ఆ మేరకు టి.డి.పికి ఆ ఓటర్లను జత చేయడం.

2. మాదిగ పోరాట సమితిని ఆలింగనం చేసుకోడం ద్వారా కృష్ణ మాదిగకు మద్దతు తెలపడం ద్వారా ఆ సామాజిక వర్గంలోనూ చేయతలపెట్టిందదే.

3. గిరిజన తెగలవారినీ అభ్యర్ధులుగ నిలపడం ఆ తరహా ఎత్తుగడే.

బి)    మతం పరంగా హిందువులూ, క్రైస్తవులు, ముస్లిములు ముఖ్యంగా చెప్పవలసినవారు.

1. బిజెపితో పొత్తు వల్ల హిందువుల తోడ్పాటు.

2. కె.ఎ.పాల్‌ను, అతనితో మిత్ర సంబంధాలు కలిగిన ఇతర క్రైస్తవ సంఘాలను కలుపుకోవడం ద్వారా వైకాపా ప్రభావాన్నుండి క్రైస్తవ ఓటర్లను చీల్చడం, తన జాబితాకు వారిని జతచేసుకోవడం

3. ముస్లిం పక్షంలోని ఎం.ఐ.యంతో ఎలానూ పొంతన కుదరదు గనుక, వారినలా ఉంచి ఇతర ముస్లిములను ఆకట్టుకునే యత్నం చేయడం.

4. జె.పిలాటి వారి నుండి ప్రతికూలత లేకుండా చూసుకోవడం, ఒకింత అనుకూలత ఉండేలా సంబంధాలు నెరపడం ద్వారా తన స్వీయ సామాజిక వర్గపు ఓట్లు చీలకుండా జాగ్రత్తపడడం - ఇలా సాగుతుంటుంది, చంద్రబాబు కృష్ణ, చాణక్య తంత్రం. అయితే కృష్ణ, చాణక్యులకూ, ఈయనకూ అత్యంత ప్రధానమైన ఒక తేడా ఉంది. వారిరువురూ ఆధిపత్య కాంక్షలేనివారు కాగా, ఈయన తాను రాజైతేనే ప్రజలకు మేలు జరుగుతుందనంటారు.

4. వై.యస్‌. జగన్‌ :- ఈయన ప్రధాన చట్రమంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినదైయ్యుండడం కీలకాంశం. ఈయనదీ చాణక్య తంత్రమే గాని, వీరి ఎత్తుగడంతా చాణుక్యుని అర్థశాస్త్రపు సూత్రాలకు సంబంధించిందిగా ఉంది. ఆ సూత్రం -  ప్రపంచంలోని ప్రతిదీసరుకే - ప్రతి సరుకూ ఏదో ఒక ధరకు అమ్ముడకుపోతుంది, అన్నదే. రాజకీయ క్షేత్రాలలో ప్రధానంగా రెండు రకాల సరుకులే ఉంటాయి. 1. ఓటర్లు 2. అభ్యర్థులు. ఈ రెండు సరుకులను కొనడం, అమ్మడంలో చాణక్యునకున్నంత ప్రజ్ఞతనకూ ఉందనుకుంటుంటాడీ జగనన్న. గెలుపు విషయంలో ఆయనకున్న ధీమా అంతా ఆ సరుకును ఏ దశలోనైనా కొనగలను అన్నదొక్కటే.

జ  అమ్మ విజయమ్మ బైబిలు పట్టుకుని కూచుంటుంది. వైయస్సార్‌ లేనిలోటు తనకెవరూ తీర్చలేరంటుంది. తన చావుతో గాని ఆలోటు తీరదంటుంది. వైయస్సార్‌ను గుర్తు చేసుకుని జగన్‌ను రాజును చేయమంటుంది.

ఇక వైకాపాకు ప్రధాన దిక్కుగా (ప్రచార సారథిగా) ఉన్న జగన్‌ సోదరి షర్మిల విషయం :- రాజకీయ పరిజ్ఞానంలేని, ప్రసంగ నైపుణ్యతలేని, పడికట్టు ప్రసంగాలు చేస్తుండే ఈ రాజకీయ కూన చంద్రబాబును, కాంగ్రెసునకు తిట్టడం, తన తండ్రిని పొగడడం, అన్నకు పట్టంకడితే రాజన్న పాలన వస్తుందనంటూ చెప్పిందే చెపుతూ, దాసరి పోకడ పోతుంటుంది.

5. కె.సి.ఆర్‌. :- ఈయన్న గురించి చెప్పుకోకుంటే, నడుస్తున్న అలగారాజకీయాల వివరాలు చెప్పుకున్నట్టే అవదు. గబ్బు నోరున్న, పోకిరీ భాషలో పి.హెచ్‌.డి చేసిన, దానిసరైన అర్థంలో రాజకీయానికి అర్థం చెప్పుకుంటే రాజకీయాలకు పనికి రాని కారెక్టరిది. సభ్యతా సంస్కారాలన్న వాటికి గానీ, నీతి నిజాయితీలన్న వాటికిగానీ, అందరంగీకరించే - సాధారణంగా మనం  చెప్పుకునే - అర్థాలుండవు ఈయనకు. కె.సి.ఆర్‌ అంటే మాట మీద నిలిచేటోడని అర్థం; అబద్దాలాడుడు చేతగానోణ్ణి నేనంటూ; పెద్ద అబద్దంతో ప్రసంగం మొదలెట్టగల దిట్ట. వివేకవంతులు సిగ్గుపడేంత ఎగ్గు భాష నిస్సిగ్గుగా మాట్లాడేయగల దిట్ట తన మున్నవాడు.

ఈ మధ్య జనసేన నేత; మోడీ, చంద్రబాబు సరసన కూర్చునే పరిస్థితి దాపురించడంతో తెగరెచ్చిపోయి, మరెవరూ దొరకనట్లు ఈ కేసి ఆర్‌ ను పట్టుకుని, తాటతీస్తానంటూ ఒక అవాకు విసిరాడు. మామూలుగానే మంట లెగేసే కెసిఆర్‌ ఇది విని ఊరుకుంటాడా?! పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి వాడు, వీడులతో పోనీకుండా, నే చిటికెన వేలు కదిపితే చిదిమేస్తరు నిన్ను 'నాకొడకా' అనీ అనేశాడు.

నాలుక్కోస్తానంటాడొకడు, చేతులు నరుకుతానంటాడింకొకడు, ఇక్కడుండనీయం పొండిరా కొడకల్లారా! అంటాడు మరొకడు, రా! చూసుకుందామంటాడింకొకడు, మరి కొందరైతే భౌతిక దాడులకూ సిద్దపడిపోతుంటారు. ఇక ఆంధ్రోళ్ళంతా దోపిడీ దారులే, పీకకోసుకుంటా, తల నరుక్కుంటా, లాంటి మాటలు కెసిఆర్‌కు ఊత పదాల్లాటివి.

ఎక్కడి రాజ్యాంగం ? ఎక్కడి ప్రజాస్వామ్యం? ఎక్కడి స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులు? దాదాపు అందరిదీ ఒకే మూస, ఒకే భాష

పెద్ద విడ్డూరం


1.    కెసిఆర్‌ - కాంగ్రెసు కుమ్మక్కైపోయారంటారు టి.డి.పి వాళ్ళు

2.     వైకాపా - కేసిఆర్‌ కుమ్మక్కైయ్యారంటారు కాంగ్రెసు వాళ్ళు.

3.     కాంగ్రెసు - టి.డి.పి అంటకాగుతున్నేౖ అనీ అంటారు వైకాపా వాళ్ళు, టి.ఆర్‌.ఎస్‌ వాళ్ళు

4.     మొదట టిఆర్‌ఎస్‌ - బిజెపితో పొత్తుకు యత్నించి విఫలమైంది. ఆ తరవాత, బిజెపితో పొత్తు పెట్టుకున్న టి.డి.పిని నీతిలేని పార్టీ అనడం మొదలెట్టింది.

5.     తెలంగాణా బిల్లు పాసైన వెంటనే, ''సోనియాకు తెలంగాణా జనం కృతజ్ఞులై ఉంటారు, ఆమె చలవే ఇదంతా'', అన్న కేసిఆర్‌- అదేనోటితో ఆమె గానీ, కాంగ్రెసు గానీ ఇవ్వలేదు, తన్నిలాక్కున్నాం తెలంగాణాను అంటున్నాడిప్పుడు.

6.     టి.డి.పి - తాము లేఖ ఇవ్వడం వల్లే తెలంగాణా ఏర్పాటు కుదిరింది అంటోంది.

7.     బిజెపి అనుకూలంగా ఉండడం వల్లే తెలంగాణా విభజన సాధ్యమైందంటుంది, బిజెపి

8.     సోనియాగాంధీ తలచుకొబట్టే, తెలంగాణా ఏర్పడిందంటుంది కాంగ్రెసు

9.     టి.డి.పి వల్లె తెలంగాణా విభజన జరిగిందంటాడు కిరణ్‌ కుమార్‌ రెడ్డి.

10.     టి.డి.పి వల్లే తెలంగాణా విభజన జరిగిందంటాడు వై.ఎస్‌ జగన్‌

11.     కె.సి.ఆర్‌ కడిగిన ఆణిముత్యం, కాల్చిన బంగారం అంటుంది టి.ఆర్‌.ఎస్‌

12.     తాను ముఖ్యమంత్రి కాకుంటే తెలంగాణా ఆంధ్రోళ్ళ  క్రింద బ్రతకాల్సిందేనంటాడు కె.సి.ఆర్‌

13.     కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాడా, గడీలపాలనే అంతా. ప్రతి దానికీ రేటుకట్టి అమ్మకంపెడతాడు అంటాడు చంద్రబాబు.

14.     ఒకణ్ణొకడు దొంగ అనుకోని వారు గానీ, దోపిడీ దారుడు, కుట్రదారుడు అనుకోని వారుగానీ కలిగ్గానికీ కనబడటంలా.

అలాంటివే మరికొన్ని విడ్డూరాలు


1.     కె.సి.ఆర్‌. హోమాలు చెస్తాడు. జంతుబలులూ ఇస్తాడు, వాస్తు జూపిస్తడు, జాతకాలూ, ముహూర్తాలు ముందు చూడాలంటాడు, బొట్టుపెడతడు, కనపడిన గ్రామ దేవతకల్లా మొక్కుతాడు. మతతత్వ వాదిని కాదు, సెక్కులర్‌నంటాడు.

2.     చేతిలో బైబిలుంటుంది, క్రైస్తవ మతం పుచ్చుకున్నారు. హిందూ దేవాలయాలనూ వదలరు, సగం భారం దేవుడిపైనే వేస్తుంటారు. భగవంతుని దయ అంటునే తామే సెక్కులర్‌ దోరణి వాళ్ళ మంటుంటారు జగన్‌ కుటుంబం.

3.     బిజెపి, ఎం.ఐ.యంలు, నేరుగా రెండు మతాలకు చెందిన వారుగా ఉంటూనే, ఎదుటి వారే మతతత్త్వ వాదులనీ, తాము సెక్కులరిస్టులమేననీ బుకాయించబోతారు.

4.     ఎర్రజెండాలోని కొందరిని మినహాయించితే, అన్ని పార్టీలలోనూ, ఉన్న వారిలో 99% ఆస్థికులే. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే రకరకాల మూఢనమ్మకాలతో అంటకాగుతున్న వాళ్ళే.

కె.ఎ.పాల్‌ :- సుమారుగా మతిస్థిరంతప్పిన ప్రగల్భాలరాయుడు. క్రీస్తు తన చేయిలోని వాడేనన్నట్లు, తన ఆశీర్వచనాల వల్ల ప్రపంచంలో ఎందరో రాజ్యాధినేతలైనట్లు పిట్టలదొర మాదిరి ఉట్టుట్టిగనే అరుస్తుంటాడు. ప్రపంచంలో 140 దేశాల అధినేతలు తన శిష్యులే నంటున్నాడు మొన్న టివిలో. చంద్రబాబును ఆశీర్వదించాడు. టి.డి.పి., బిజెపిలను క్రీస్తు ఆశీర్వదించమన్నాడనీ అనేశాడు.

ఇన్నీ అని, మీరు అధికారంలోకి వచ్చాక, అధికారంలో మాకూ ఒక కుర్చీ ఇవ్వండని ప్రాదేయపడి, ఈ మాట మరిచిపోకుండా గుర్తుంచుకోండని వేడుకున్నాడు.

కొన్ని ప్రశ్నలూ - సమాధానాలు


జ  గత 67 ఏండ్లలో జరిగిన ఎన్నికలన్నింటిలోనూ ఒక్కలాగే తేలిన నిజం ఏమిటో తెలుసా?

    ఓటరంత బుద్ది హీనుడు ఈ దేశంలో మరెవ్వరూ లేరన్నదే అది.

జ  రాజకీయ నాయకులు ప్రతిసారీ ఆడుతూ వచ్చిన పెద్ద అబద్దం ఏమిటో తెలుసా?

    ఓటరంత విచక్షణా శక్తి కలవారు మరెవ్వరూ లేరు. వారు సరైన సమయంలో సరైన తీర్పు చెప్పారు, అన్నదే అది.

జ     అన్ని ఎన్నికలలోనూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసిన అంశమేదో తెలుసా?

    2 లక్షల ఓట్లు వచ్చిన అభ్యర్థి ఓడినట్లు 2 లక్షల ఒక్క ఓటువచ్చిన అభ్యర్థి గెలిచినట్లు నిర్ణయించి, 2 లక్షల ఓట్లకు సున్నా విలువలను కట్టబెట్టిన ఎన్నికల విధానమే ఆ అంశం -

జ      అంతే కీలకమైన అప్రజాస్వామిక మనదగ్గ మరో అంశాన్ని చెప్పగలవా?

    విని అర్థం చేసుకోగలిగే తలనీకుండాలేగాని, చెప్పడానికి అలాంటివి చాలానే ఉన్నేౖ. ఇదిగో అలాంటి మరోటి. గత 67 ఏండ్లలోనూ 30% ఓట్లు వచ్చినవారే అధికారం చెలాయిస్తున్నారు 70% ఓట్లు చెల్లకుండా కొన్ని, ప్రతిపక్ష స్థానాన్నివ్వడానికి కొన్ని, ఉపయోగపడుతూ వచ్చినై

జ  చాలా చెప్పవచ్చన్నావు కదా! మరోటి చెప్పు అలాటి అంశాన్ని?

    తప్పుడు ఓటర్ల జాబితా + రిగ్గింగులను మినహాయించితే, 50% ఓటర్లె ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడం కాదంటావా?

జ  ఈ ఒక్కసారి అడుగుతాను, చాలా ఉన్నాయలాటివన్నావు కదా! పై వాటికి దీటైన అలాంటిదే మరొక అంశాన్ని చెప్పుచూద్దాం.

    ఏమి ఉబలాటం తండ్రీ! మరోటి, మరోటంటూ ఎన్నడుగుతావు? విని ఏమి చేస్తావు? మరికొన్నింటికీ లేదా అన్నటికీ సరిపెట్టుకోదగిన ఒక్క విషయం చెప్పి ఆగుతాను. నిజమో కాదో తెల్చుకో! నిజమేననిపిస్తే ఏమి చేస్తే బాగుంటుందోనూ ఆలోచించుకో.

జ  ప్రజాస్వామ్యంలో, ఓటరు ఓటే యడమంటే, తన ప్రతినిధిగా '5' ఏండ్లపాటు ఎవడు ఉండదగిన వాడో, తనకు తానుగా నిర్ణయించుకుని, ఆ నిర్ణయాన్ని ప్రకటించడమని. మరి ఆ పని చేయాలంటే తన తరపున ఉండదగిన వానినిగా ఎంచుకొనబోయే వ్యక్తి గురించి ఏమేమి తెలుసుండాలి?

1.     అభ్యర్థి ఏ ప్రాంతపు జనులకు ప్రతినిధిగా ఉండగోరుతున్నాడో ఆ ప్రాంతాన్ని గురించి అతనికి క్షుణ్ణంగా తెలిసుండాలి. అంటే ఆ ప్రాంతపు; అందరికీ వర్తించే అవసరాలు, ఎక్కువ మందికి వర్తించే అవసరాలు, కొద్ది మందికి వర్తించే అవసరాలు, విడివిడి వ్యక్తులకు సంబంధించిన అవసరాలు అన్న ప్రాధాన్యతా క్రమాన్ని గుర్తెరిగి పాటిటించే వాడైఉండాలి.

2.     వాటిని నెరవేర్చెందుకు ప్రభుత్వం తరపునుండి అందగల వనరుల; (తానుగా చేయగలిగినవి పాలన క్రమంలో అందివచ్చేటివి అన్న రకాలుంటాయి అందులో) గురించిన అవగాహన కలిగి ఉండాలి.

3.     ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలపై పెత్తందారీగా కాక, వారి ప్రతినిధిగా ఉండే వైఖరి కలిగి ఉండాలి.

4.     చట్ట సభలలో గాని, స్థానిక ప్రభుత్వాల సంబంధంగాగానీ ఎన్నికైతే, ఆమేరకు అందరికీ చెందిన వానిలా ప్రవర్తించగలిగి ఉండడం.

5.     రాజకీయాధికారం; సంపాదన కొరకు గాని, ప్రజలపై పెత్తనం చేయడానికి గానీ ఏర్పరచుకున్నది కాదని, అది అత్యున్నత సేవారంగమని, ప్రజలే అసలైన యజమానులనీ ఎరుక గలిగి దానికి తగినట్లు మసలుతుండాలి.

6.     ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేది గాకాక, ఓటరు కావాలని ఎంపిక చేసుకునేదిగా ఉండాలి ఆ ఎన్నిక.

జ  ప్రజాస్వామ్య బద్ద ఎన్నిక అంటే పై విధానంలో జరిగిన ఎంపికే అన్నంత వరకు కాదనేందుకే మీలేదు. కానీ మన అనుభవంలో వీటిలో ఏ ఒక్కటి అమలు కావడంలేదు. నిజమా? కాదా?

జ  పార్టీ స్వామ్యమే లేదా పార్టీల కూటమి స్వామ్యమే, ప్రస్తుతం ప్రజాస్వామ్యం పేరిట నడుస్తోంది. అక్కడ కూడా అతి కొద్ది మంది ఆధిపత్యమే చలామణి అవుతుంటుంది. ముఖ్యమైన పార్టీలలోనైతే ఏకనాయక స్వామ్యమే నడుస్తోంది. అవునా? కాదా?

జ     ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుగా పార్టీ, మతం, కులం, వర్గం, ప్రాంతం, లింగం, మంద మనస్తత్వాన్ని వాడుకునే అనుచర నాయకత్వం, అన్నవి బలంగా పని చేస్తున్నై. నిజమా? కాదా?

జ  అభ్యర్ధులుగా నిలబడే వారున్నూ తమ వ్యక్తిగత ప్రయోజనాల నెవరు నెరవేరుస్తారో ఆ పార్టీల వైపు మొగ్గడమూజరుగుతోంది.

జ      వీటన్నింటికంటే బలమైందిగానూ, మరింత సాధారణ రూపంలోనూ, డబ్బు, మందు, విందులను అందించడం అన్నదీ జరుగుతూ వస్తోంది. నిజమా? కాదా?

జ     ఇలా చిన్న చిన్న తాయిలాలకు చేయిచాచని మధ్యతరగతి ఓటర్లు, (ఉద్యోగుల, విద్యాధికులు, పట్టణాలలోని రకరకాల వ్యాపారస్తులు) అస్సల ఓటు వేయడానికి రాకపోవడమూ జరుగుతోంది. నిజమా? కాదా?

ఇదంతా అప్రజాస్వామికం కాక మరేమిటంటావు? జరుగుతున్నదంతా అప్రజాస్వామికమే.


ఉదా : ఈ ఎన్నికలలో ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం అభ్యర్థి, 10 నుండి 15 కోట్లు ఖర్చు పెట్టాల్ని ఉంటుందని ముఖ్యమైన పార్టీలన్నీ చెపుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. అలాగే ఒక లోకసభ స్థానానికి 30 నుండి 50 కోట్లు ఖర్చు అంచనా వేయబడుతోంది. అలా బలమైన పార్టీలన్నీ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణా, సీమాంధ్రలు రెంటికీ కలిపి, ప్రధాన పార్టీలుగా పోటీపడుతున్న టి.డి.పి, కాంగ్రెసు, టి.ఆర్‌.యస్‌, వైకాపా, బిజెపిల వరకు తీసుకున్నా, లెక్కల కొచ్చే లెక్కకు రాని మొత్తమంతా కలిపి; 10 వేల కోట్లు రూపాయల వరకుంటుందంటే, తెలియని వారికి ఆశ్చర్యంగానే ఉంటుంది గానీ, వాటిలోతుపాతులెరిగిన వారికి ఆశ్చర్య మనిపించదు.

1.డబ్బు, 2.కూలి, 3.మందు, 4.బిర్యాని, 5.రానుపోను ఖర్చులు ఇచ్చి జనాన్ని తరలించని బహిరంగ సభలు ఉండడమేలేదు. ఎలెక్షన్ల సందర్భంగా ఇదో వ్యాపారం క్రిందనూ మారిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో పెద్ద గ్రంథమవుతుంది. ఒక పెద్ద సభకు, అంటే సుమారు లక్షకుపైగా సమీకరణ జరిగిన సభకు, దినవారీకూలి (ఇది 200 నుండి 500 వరకు ఉంటోంది) రవాణా చార్జీలు, భోజనము, మద్యము అన్న వాటికన్నింటికీ కలిపి తలకు 500రు అవుతుందనుకున్నా లక్ష þ 500 = 5 కోట్ల రూపాయలు అవుతోంది, సభ ఏర్పాట్లకు, నాయకుల రాక పోకలు వగైరాలకు మరో రెండు కోట్లు అవుతుంది. మరింత మందిని సమీకరించాలనుకుంటే లెక్క ప్రకారం దానికి తగ్గట్టు లెక్క పెరుగుతుంటుంది.

కొన్ని నియోజక వర్గాలలో, ఎన్నికలబరిలో 10 నుండి 30 మంది వరకూ నిలబడుతున్నారు. ఉదా - మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి 30 మందికిపైగా అభ్యర్థులున్నారు. 32 లక్షల పైగా ఓటర్లున్నారు. అంటే అందులో పోలయ్యేది ఎంత? గతంలోనైతే 50% పోలయ్యేవేమొగానీ, ఈతూరి మాత్రం రకరకాల కారణాల వల్ల అక్కడ 60% పోలవ్వవచ్చు. కనుక 15, 18%ఓట్లు వేయించుకోగల వారు విజయ అవకాశాలున్న వారి జాబితాలో చేరిపోతారు. 1. టిడిపి + బిజెపి 2. టి.ఆర్‌.ఎస్‌, 3. కాంగ్రెసు 4. వైకాపా 5. లోక్‌సత్తా 6. కె. నాగేశ్వర్‌లు ప్రధానంగా పోటీలో ఉంటారు. అంటే 4 లక్షల ఓట్లు వేయించుకోగలిగితే గెలుపు పొందవచ్చన్నమాట. నా అంచనా ప్రకారం ఈ అంకెకు దగ్గరగా టి.డి.పి, టి.ఆర్‌ఎస్‌, కాంగ్రెసు, లుంటాయి. వైకాపా కొంతవరకు కాంగ్రెసు ఓట్లు చీలుస్తూ టిఆర్‌యస్‌కు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. లోక్‌సభ స్థానపు పరిధి క్రిందికి వచ్చే అసెంబ్లీ నియోజక వర్గాలలో జె.పి గానీ, కె. నాగేశ్వర్‌కు గానీ తమ వారనదగ్గ అభ్యర్దులుండరుగనక వారిరువురికీ 4 లక్షల ఓట్లు రావడం కష్టం. కనుక ఓడిపోడానికే ఎక్కువ అవకాశాలుంటాయి. మేధావు లిద్దరూ పోటీపడి, తమ కంటే ఎంతో కొంత తక్కువ అర్హత ఉన్నవారే ఎన్నికయ్యేందుకపరోక్షంగా దోహదపడుతున్నారన్నమాట.

రాయితీలు - రుణాల మాఫీ, అదనపు వివరాలు


ఉద్యోగుల జీతాలు కట్టడానికి తికాణా లేదు ఉన్నబడ్జెట్టునుండి. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ తలకో 70,, 80 వేల అప్పుల భారముంది పౌరులపైన, ప్రతిపార్టీ కూడా ఆచరణ సాధ్యంకాని హామీలను చేసేస్తూవస్తోంది. ఒకతను లక్షలోపు రుణాలు రద్దు చేస్తానంటాడు, మరొకడు లక్షేమి ఖర్మ రెండు లక్షలలోపు రుణాలు రద్దు చేస్తానంటాడు. కె.సి.ఆర్‌ అయితే ఒక్కోనికి 3 లక్షలు పెట్టి, రూపాయి తిరిగి చెల్లించనక్కరలేకుండా ఇళ్ళు కట్టిస్తానంటున్నాడు. 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తామని మరొకరు చెపుతారు. బిసిల సంక్షేమానికి 5, 6 వేల కోట్లు కేటాయిస్తానంటారు వేరొకరు. 10 సం||లు టాక్స్‌లు కట్టనక్కరలేదంటారు మరో అధినేత, ఇలా ఎవరిష్టమెచ్చినట్లు వారు వరాల వర్షాలు కురింపించేస్తున్నారు. వీరందరినీ ప్రజాస్వామ్య స్ఫూర్తితో నేనడుగుతున్నది ఒక్కటే ...

రుణాలు మాఫీ చేయడానికీ, రాయితీ లివ్వడానికి, తిరిగివ్వక్కరలేని రీతిలో ఇళ్ళు కట్టివ్వడానికీ, హజ్‌యాత్రకు డబ్బులు కేటాయించడానికి అదేమైనా మీ స్వార్జితమా? పిత్రార్జితమా? ప్రజాధనాన్ని అంటే అందరి నుండి పన్నుల రూపంలో సేకరించిన డబ్బును, కొందరికి అదీ ఓట్లడగడానికి వచ్చిన సందర్భంలో ఊరికే ఇచ్చేస్థామనడం ఎలా సరైందవుంతుంది. ఇంతకూ ఈ వాగ్థానాలన్నింటిని ఆయా పార్టీలకు చెందిన 1వ నంబరు స్థానంలోని వారే ప్రకటించేస్తుంటారేమిటి? తనకు పట్టంకడితే తాను వరాలిస్తాడన్నమాట.

ప్రజాస్వామ్య పద్దతిననుసరించి నాకున్న అవగాహనను బట్టి అయితే ఈ వరాలు, వాగ్ధానాలు, చేసిన ప్రతివాణ్ణీ; ఒక్క ఆ మాట అన్నందుకే (వాళ్ళను) మా ప్రతినిధిగా నీవు పనికిరావురా! ఇక ఇంటికెళ్ళు అని పంపించేయాలి.

1.    పాలన నిర్వహణలకూ, అభివృద్ధి అవసరాలకు ఉన్న డబ్బు చాలక, వడ్డీలకు ప్రపంచం నుండి అప్పులు తెస్తూ, వడ్డీలేని రుణాలిస్తావన్నమాట.

2.     తీసుకున్న రుణాలు గట్టిగా వసూలు చేయాల్సిందిపోయి, ఓట్లకోసం ఆ రుణాలు మాఫీ చేసి, ఆ భారం మిగిలిన, ఆ రకంగా డబ్బు వాడుకోని - వారినెత్తిన పెడతావన్నమాట.

3.     అందరికీ ప్రయోజన కరమైన ప్రాజెక్టులు, విద్యా, వైద్య  రంగాలకు కేటాయించిన నిధులను వాటికి తగ్గించి, ఇలా ఎన్నకల వాగ్థానాలు నెరవేర్చడానికి తరలిస్తారన్నమాట.

ప్రజాస్వామ్య స్ఫూర్తి సక్రమంగా అమలవుతుండాలంటే కనీసం రెండు ప్రక్రియలు చక్కగా ఆచరణలో ఉండాలి


1.     ముఖ్యమైన, కీలకమైన అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రతి సందర్భంలోనూ వాటిని; జనరల్‌ బాడీ సమావేశం ముందు చర్చకు పెట్టడం.

2.     ఆ జనరల్‌ బాడీ ఎంపిక చేసిన నిపుణులతోను కలుపుకుని ఉన్న అఖిల పక్ష కమిటీ ముందుకు ఆ అంశాన్ని తేవడం.

గమనిక :- వ్యవస్థకు సంబంధించినంతలో అసెంబ్లీ, పార్లమెంటులు జనరల్‌ బాడీ క్రిందికి వస్తాయి. పార్టీ రహిత ప్రజాస్వామ్యమే ప్రజాస్వామ్యానికి సార్థక రూపమైనా, ప్రస్తుతం నడుస్తున్నది పార్టీ సహిత ప్రజాస్వామ్యమేగనక, పార్టీల రూపంలోనే ప్రతినిధులుంటున్నారు కనుక, అన్ని పార్టీల అధికారిక ప్రతినిధులతో కూడిన బృందమే అఖిల పక్ష కమిటీ అనదగి ఉంటుంది.

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో చట్ట సభల్లో మెజారిటీ ఉండడాన్ని బట్టి, ఒకే పార్టీనో రెండు మూడు కలసో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా, నిజానికది ప్రజలందరికీ ప్రాతినిద్యం వహించజాలదు. కనుకనే ప్రభుత్వం సభకు (అసెంబ్లీకో, పార్లమెంటుకో) జవాబుదారీగా ఉండాలన్న నియమం ఏర్పడింది. అలా జరిగినప్పుడే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలు తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించడానికి తగి ఉంటాయి. ప్రస్తుతం ఆచరణలో అత్యంత కీలకమైన ఈ విధానం తిరగబడి నడుస్తోంది. ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో ఒక నిర్ణయానికి వచ్చి ప్రకటిస్తే క్యాబినెట్‌ సరేననడమో, వంతపాడడమో జరుగుతోంది. ఆ పిమ్మట చట్టం ప్రకారం దానిని సభముందుంచాలి గనుక ఉంచుతున్నారే గాని, సభల అభిప్రాయాలకు పరిగణన ఏ మాత్రం ఉండడంలేదు.

అఖిల పక్ష కమిటీ + నిపుణుల కమిటీల ఏర్పాటుకై ప్రభుత్వంపై వత్తిడి తేవాలి.

No comments:

Post a Comment