పి.డి. సుందర్రావు అన్నాయన ప్రపంచానికి సవాలంటూ ప్రకటించిన దానికి సమాధానంగా సత్యాన్వేషణ మండలి నుండి సురేంద్ర బహిరంగ లేఖ
అనేకులను పేరుపెట్టి మరీ మొరటుగా, అసభ్యంగా, తొడగొడుతూ, మీసాలు మెలిపెడుతూ ఆయన చేసిన ప్రసంగాల సి.డిలను మూడింటిని నేను జాగ్రత్తగా విన్నాను.
ఆయన అభిమానో, అనుయాయో, శిష్యుడో, బిడ్డడో తెలియదుగాని, నేను కర్నూలుకు, సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక జిల్లా సమావేశాలకు రాష్ట్ర బాధ్యునిగా హాజరైన సందర్భంలో, జగద్గురు అన్నాయన నన్ను కలసి బైబిలు విషయాల ప్రస్తావన తీసుకువచ్చారు. వాటి విషయంలో నాకూ ఉన్న అభిరుచికొద్దీ నాదైన శైలిలో కొద్దిసేపు ఆయనతో మాట్లాడాను. దాంతో మళ్ళా కలుస్తానని చెప్పి వెళ్ళారాయన. అటు తరువాత మరోక్రైస్తవ మిత్రున్నీ తొడ్కొనివచ్చి మళ్ళా కొంతసేపు బైబిలు విషయాలు మాట్లాడారు. ఆ సందర్భంలో భాషాపరంగా, పాత క్రొత్త నిబంధనల పరంగా నేను లేవనెత్తిన ప్రశ్నలకు కొన్నింటికి సమాధానం చెప్పలేక పోవడం, కొన్నింటికి పొరపాటు సమాధానం చెప్పడం, కొన్నింటికి అరకొర సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ఆయన, ఆయన వెంట వచ్చినాయనా, వారికి వారే గమనించి మీకు ధైర్యముంటే, మాకంటే ఎంతో తెలిసినవారు, మీలాంటి బైబిలు విమర్శకులకు సవాలన్నవారు, ఎందరినో ఓడించిన వారు, ఎందరికో సింహస్వప్నం వంటివారు అయిన పి.డి. సుందర్రావు గారితో మాట్లాడవచ్చుగదా అనన్నారు. ఆ సందర్భంలోనే దమ్ముంటే, మగతనముంటే లాంటి మొరటుపదాలు కొన్ని ప్రయోగించారు. నిజానికి ఏ సిద్ధాంతవిచారణకైనా కావలసింది నిజాయితీతో కూడిన పట్టుదలేగాని దమ్ములు, కొమ్ములు, రొమ్ములు ఎందుకండీ?! అవసరం లేదు కదా! ఆమాటే ఆనాడు వారితో చెప్పాను.