మేలుకొలుపు
సంపుటి – 1 సంచిక -4 15.6.91
గతస్ఫూర్తి - అవశ్యం భావి
ఆర్యులారా; పరిణామశీలమైన జగతిలో చేతన పదార్థానికో
ప్రత్యేకత ఉంది. అది విషయ గ్రహణమే. ఇవి మూడు రూపాలలో వినియోగంలో ఉండి
వ్యక్తమవుతున్నది. 1) గ్రహణమూ, 2)
అట్టి పెట్టుకోవడమూ, 3) వినియోగించు కోవడమూ. వీటి క్రమం కూడా
పై సంఖ్యా క్రమంలోనే. ముందుగా గ్రహించిన గాని అట్టి పెట్టుకోలేము. చక్కగా నిలువ
యున్న గాని వినియోగించుకోలేము. ఈ మూటినీ సాధారణ దృష్టినుండి జ్ఞానమన్న పదంతోనే, వ్యవహరిస్తున్నా, జ్ఞానము, స్మృతి,
స్మరణము అన్న పదములు ఆయా స్థితులకు నిర్ధిష్ట సంకేతము లౌతాయి. అయితే,
జ్ఞానోత్పత్తి కాధారమేమి? అనుభవమే. అది
యింద్రియార్థ సన్నికర్ష వల్ల [ప్రమాణముచే] ఏర్పడుతుంది. ఆ యనుభవాలనే
గ్రహిస్తున్నాము. గ్రహింపబడి నిలువయున్న యనుభవాల (విషయముల) ఆధారముగనే వర్తమానము
నుండి భవిష్యత్తు వైపు కదులుతున్నాము గ్రహింపబడుతున్న యనేకానేక యనుభవ పరంపరల మధ్య
అనివార్యముగ ఏర్పడుతున్న సారూప్య వైరూప్యతల వలన అనుకూల, ప్రతికూల
పరిస్థితు లేర్పడుట, అందుండి యిష్ట ఫలములూ, అనిష్ట ఫలములూ భోగింపబడుట జరుగుచున్నది. ఇది సర్వులకూ నిత్యానుభవమే.
అట్లు ఇష్ట ఫలప్రాప్తి, అనిష్ట ఫలప్రాప్తి (కావాలనుకున్నవి లభించక
పోవుట, వద్దనుకున్నవి వచ్చి పడిపోవుట) అన్న యవాంఛనీయ
స్థితులేర్పడుట కారణమేమి? అది తొలగించుట ఎట్లు? అన్నది మీమాంస (పరిశీలన లేక విచారణ) చేయదగియున్నది. అందువల్లనే ప్రతి
మానవునకూ తన కేర్పడుతున్న యనుభవ పరంపరల పట్ల సరైన యవగాహన అవసరమగుచున్నది జీవితం
పట్ల అనగా వ్యక్తి, సమాజమూ, ప్రకృతి
వీటి మధ్యనున్న అనుకూల, ప్రతికూల సంబంధాలూ, జీవిత ధ్యేయమూ, తత్సిద్ధికైన సాధన క్రమమూ వీటి పట్ల
సమగ్రమైన యవగాహన యున్న గాని అతని జీవితము సక్రమముగ నడువజాలదు. కనుకనే జీవనానికి
అనేకానేక మార్గములను (కూటి కొరకు కోటి విద్యలు) ఎవరెవరి యిష్టమూ, సామర్థ్యమూ ననుసరించి వారు వారు ఆయా విద్యలనూ, వృత్తులను
స్వీకరించి నప్పటికీ, ఆధ్యాత్మ విద్య (నేనూ, నాదీయన్న
విషయములను బోధపరచు విద్య) మాత్రము సార్వత్రికమూ, సార్వ జనీనమూనై యున్నది .
ఏ విద్య పొందబడిన (ఎట్టి జ్ఞానము
పొందబడిన) మరెన్ని విద్యలు పొందబడక పోయిననూ ప్రమాదం లేదో, ఏది పొందబడక మరెన్ని
విద్యలు పొందబడిననూ నష్టం పోదో అట్టి ఆధార విద్యయే ఆధ్యాత్మ విద్య. ఈ విషయాన్ని
స్పష్టంగా గమనించినారు గనుకనే పూర్వీకులు జీవితం పట్ల అవగాహనను కలిగించు విద్యను
అందరకూ, ఆ పై జీవనాని కుపకరించు
నానా విద్యలను వారి వారి స్థితిగతుల ననుసరించి బోధించు విధానము నవలంబించినారు.
అయితే ఆధ్యాత్మ విద్యను గ్రహించజాలని స్థితిలోనున్న అల్ప మేధస్కులకు ఆ విద్య
బోధించుచున్న జీవన క్రమాన్ని మాత్రం అభ్యాస రూపంలోనూ, ఆచారాల
రూపంలోనూ (వాటిలో కొన్ని నేడు కాలం చెల్లినవిగా ఉన్నా యన్నది గమనార్హం) ప్రకటపరచి
వారినీ తమతో సహజీవన యాత్రికులుగా చేసికొని వారు మరో వంక సమాజాన్ని శాసించు
నడిపించు - శ్రేష్ఠులనదగ్గ వారలకు మాత్రంపై రెండు క్రమాలూ [ఆధ్యాత్మ విద్య-అది
బోధించు జీవన విధానము అన్నవి) అభ్యసించుట విధిగా స్వీకరించదగినవిగా చెప్పినారు.
అప్పటి సమాజ వ్యవస్థ రూపాన్ని బట్టి బ్రాహ్మణ, క్షత్రియ,
వైశ్యులకు అది విధిగా ఏర్పడింది. ఎందుకనగా తెలిసికొనుట, తెలియజేయుట యనునవి బ్రాహ్మణులకు స్వాభావిక కర్మలుగా నాడు భావింపబడింది. “అధ్యయనం,
అధ్యాపనం, బ్రాహ్మం కర్మ స్వభావజం’ 2) ధర్మబద్ధంగా జీవించుట,
సమాజమున్నూ అట్లే జీవించునట్లు శాసించుట, తద్భిన్న
క్రమాన్ని (అధర్మంగా జీవించు వారిని) శిక్షించుట క్షాత్ర కర్మగా చెప్పబడింది. 3) విలువలను కూడ బెట్టుట (కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావిజం)
అర్ధ సంచయము-పంపకము అన్న కార్యక్రమం వైశ్యులనబడే వాళ్ళకు విధింపబడింది.
ఈ మూడు వర్గాలూ సమాజం మొత్తం పట్ల బాధ్యత
కలిగియున్న వగుటచే వీరలకు ఆధ్యాత్మ విద్యా వివేకమూ- తదనుగుణ్య ఆచరణ అవశ్యమని చెప్పబడింది.
ఇచ్చట ఆధ్యాత్మ విద్యా వివేకమనగా తనను గూర్చి, తనతో సమాజానికీ, ప్రకృతికీ గల సంబంధాలను
గూర్చి వాటియెడ తాననుసరించదగిన తీరును గూర్చిన వివేకమనియే. నిజంగా జీవితాన్ని
సమగ్రంగా చూడగలిగిన నాడు, ఈ మూడు విధములైన
వ్యవస్థలూ-కాలానుగుణ్యముగ, లేక భాషా సౌలభ్యము ననుసరించి ఏయే,
పేరులతో పిలువబడ్డా ఏ కాలములోనైనా, ఏ
దేశములోనైనా ఉండక తప్పదని అవగతం కాగలదు. మానవ సమాజములో ఎన్ని రకములైన మార్పులూ, కూర్పులు జరిగినప్పటికీ, ఈ మూడు రూపాలూ, వీటి వీటి కార్య క్రమాల నమలు పరచుటకై ఆయా క్షేత్రాలలో కావలసియున్న భౌతిక
శక్తి లేక క్రియా శక్తి రూపమైన మరొక వర్గమూ, అవశ్యంగా కావలసి
ఉంది. శూద్రులన్న పేరున ఆ వర్గమే సూచింపబడింది. విరాడ్రూపంలో పాద స్థానం
వారికీయబడ్డది. అది గమన సంకేతం. సామాజిక కార్యాలకు ఆధార స్థానం.
గమనిక:- ఈ విషయం అనేక విమర్శలకు
(అనుకూలంగానూ, ప్రతి కూలంగానూ) లోను చేయబడింది. చేయబడుతుంది, చేయబడవలసి
కూడా ఉంది. కనుక విపుల పరిశీలన అవసరమైన ఈ యంశాన్ని మరొక తూరి ప్రత్యేకించి
ప్రస్తావిస్తాను.
ఈ చతుర్వూహ వ్యవస్థలో గానీ, వ్యవస్థాంతర్గత వ్యక్తుల విధి నిర్వహణలో గాని
ఏ భాగంలో (వివేకం లోపించినా) లోపమేర్పడ్డా అధర్మం పుట్టుతుంది. ఇక్కడ అధర్మం అన్న
పదం వాడడం వెనుక నా వుద్దేశము అహిత ఫలజనకం అని మాత్రమే. దానితో సమాజంలో ఎక్కడో ఒక
చోట పొందగూడనిది, పొందబడడమూ, పొందవలసినది
పొందబడకపోవడమూ అన్న స్థితి ఏర్పడుతుంది. వెంటనే అట్లు పొందగూడనిది పొందిన
వారినుండి లేక పొందవలసినది పొందలేక పోయిన వారినుండి ప్రతిఘటన ఏర్పడుతుంది. అట్లా
ప్రారంభింపబడి శాఖోపశాఖలుగ విస్తరింపబడి నట్టిదే నేడు నానా విధ అస్తవ్యస్థతలతో
కానుపించు సామాజిక వికృత రూపం. ఇది తరచుగా సామాజిక నాయకుల చేతనూ, సాంప్రదాయ ప్రవర్తకుల - ప్రచారకుల- చేతనూ కూడా మాటి మాటికీ చెప్పబడుతున్న
విషయమే.
అయితే విచారించదగ్గ విషయమేమంటే నేడు
వినబడుతున్న ఆయా నినాదాల వెనుక, పూర్వీకులలో జాలు వారిన హృదయగత లోకకళ్యాణ కాంక్ష, దానిని
సాధించుటకై వారు పడిన తపన మృగ్యమై, మంచివాడుగా గుర్తింపు
పొందాలనో, మరో విధమైన స్వార్థపూరిత ఫలకాంక్షయో ప్రముఖ
స్థానాన్ని ఆక్రమించుకుని ఉంటున్నది ఎక్కువమందిలో. ఈనాడు లోక హితైషులూ, మేధావులూనైన వారలను అమితంగా కలవరపరుస్తున్న యంశమేమో ఆలోచించగలరా? అధర్మమూ, స్వార్ధమూ, భద్రతారాహిత్యమూ
పెచ్చు పెరిగినవనీ ముందుముందు మరింకనూ బలపడి క్రమపరచలేని స్థితి ఏర్పడవచ్చునన్నదే
ఆ యంశం.
అయితే ఆయా సంఘాలలోని ధార్మికులూ, లోకహితైషులూ వారివారికి తోచిన రీతిలో
సంస్కరణకై యత్నిస్తూనే యున్నారు. వారు హితాభిలాష లేనివారని యనము గానీ పై యవాంఛనీయ
స్థితులన్నిటికీ గల కారణాన్ని - మూల కారణాన్ని అనైనా యనొచ్చు - గమనించి కారణ నాశాన్నే
లక్ష్యంగా కలిగి అందుకు
తగిన ప్రణాళిక నేర్పరచుకుని అమలు
పరచుచున్నారా? అన్నది పరిశీలనాంశమని చెప్పుచున్నాము.
ప్రాచీన (తాత్విక ధార్మిక పరమైన) మేధావులలో
ఈ విషయమై యన్వేషణ నిశితంగానూ, లోతుగానూ చేయబడిందని చెప్పగలము. అదే స్థాయికి చెందిన
వివరణాత్మకమైన - సారభూతమైన - వివేకం కలవారు నేడు అసలు లేరని చెప్పలేముగానీ, అట్టి జ్ఞానము సమాజాన్ని ప్రభావితం చేయగల
రూపులోనూ, స్థాయిలోనూ (సంస్థల, వ్యక్తుల
సంఘటనా శక్తి) నేడు లేదని చెప్పగలము. ఎందువల్ల నేడు ఆ విద్య దుర్బలమై ఉంది?
ఈ విషయాన్ని పరిశీలించే ముందు మరొక
అంశాన్ని గమనించవలసియుంది. మానవ జీవితాన్ని చూస్తే జీవన యాత్రలో ఏ రూపమైన యత్నమైనా
ఫలవంతం కావడానికి అవశ్యంగా జ్ఞానశక్తీ, క్రియాశక్తీ, తగినంత సామర్ధ్యము కలిగి ఉండడమూ, అవి పరస్పరం సహకరించుకుంటూ పనిచేయడమూ జరుగ వలసియుంది. “అగ్రతః చతురోవేదాక్,
పృష్ఠతః సశరం ధనః” అన్న సూక్తి ఈ భావానికి చెందినదే. ఇది తాత్విక
విలువ కలిగిన యంశము కూడా. ఈ విషయాన్నే వివరణాత్మకంగా యిలా చెప్పుకోవచ్చు. కర్త,
ఉద్దేశము, పరికరాలు, విధానమూ
అన్న నాలుగింటి సమాహారమే ఏ ప్రయత్నం యొక్క ఫల ప్రాప్తికిగానీ హేతువు - ఆధారము - కాగలదు. కర్తయనగా స్వతంత్రం కలిగి
యుండడమూ, ఉద్దేశ్య స్థానములో సాధ్యము విషయమైన కోర్కె -
క్రియోన్ముఖత్వ స్థాయిలో తీవ్రత కలిగి – యుండడమూ, పరికరాలు చేయాలనుకున్న పనికి చెందినవిగానూ, శక్తివంతమైనవి గానూ ఉండడమూ, విధానమన్న దానిలో పరికరాలను క్రమపరచగల, శక్తివంతం చేయగల
మరియు ఫలోత్పత్తి (పని పూర్తి అయ్యే వరకు) పర్యంతం పని చేయించ గల జ్ఞానం కలిగి
యుండడమూ, పై నాలుగూ యిలా సమకూడినప్పుడు మాత్రమే ఏ కార్యమైనా
ఫలవంతం కాగలదు.
పైన పేర్కొన్న సామాజిక రుగ్మతకు కూడా
(ఉండవలసిన స్థితి ఉండక పోవడానికి లేక రాక పోవడానికి, అట్లే అక్కర లేనిది ఉండడానికి పోక పోవడానికి)
ఈ నాలుగూ లేకపోవడమో, కొన్ని లేకపోవడమో, ఉన్నా తగిన స్థాయిలో లేక పోవడమో కారణమౌతుంది. చూడవలసిందీ, సరిచేయువలసిందీ యిక్కడే. చూడ లేక పోవడమో, చూసినా అనేక ప్రభావాల వలన సరి చేయబడక పోవడమో అన్నదే
నేటి బలహీనత. ఇది వెనుకటి వాళ్ళు చెప్పినట్లు “ఏరు దాటదలచిన ఒక కుంటి వాని,
ఒక గృడ్డి వాని” కధను పోలి ఉన్నది.
నేడు సమాజంలో ప్రవర్తిల్లుతున్న
సంస్కరణాభిలాష కలవిగా చెప్పబడుతున్న సంఘాలలో (ఎక్కువ భాగం) మేము చూచినంత దనుక ఈ
రెండు రూపాలలో ఎక్కడో ఒక చోటనో మొత్తంగానో బలహీనత గోచరించింది. అంటే సరైన
వివేకం-సమ్యక్ దృష్టి లేక పోవడమో, బోధనలు ఆచరణ శూన్యంగా ఉండడమో జరుగుతున్నది. ప్రధానంగా సరిచేయబడవలసిన
విషయమిదే అయినా అప్రధానంగా చూడబడుతోంది. బుద్ధిచే నియంత్రించబడ్డ, కోరికలు (మనస్సు), దానిని అమలుపరుప గలిగిన, అదుపులో నున్న శక్తి వంతమైన యింద్రియాది సంఘాతము-క్రియాశక్తి, కర్మణ్యత (పనిచేయవలెనను బుద్ధి) ఇవే ఫలసిద్ధికి పాలుపంచుకో దగిన యంశములు
(వ్యక్తి నిర్మాణమన్న మాటకు అర్థం కూడ యిదే. కఠోపనిషత్ యిట్టి వ్యక్తినే విజ్ఞానవాన్
అని ప్రస్తుతిస్తున్నది.)
పూర్వీకులచే యీ విషయం గమనింపబడిన పిదపనే, ఆధ్యాత్మ విద్య జీవితం పట్ల సరైన యవగాహన
కలిగించు విద్య - ఆధార విద్యగానూ, బ్రహ్మ-బృహత్-విద్యగానూ
స్వీకరింపబడి, ప్రకట పరుప బడింది. మిగిలిన విద్యలన్నియూ దీని
అనుసరించదగి యున్నవి. ఈ విద్య కూడ ఒక క్రమానుగత అభ్యాసం (యోగ కర్మ) వలననే
సాధింపబడుతుంది. దీనికి మించి వ్యవస్థ సరిచేయ బడడానికి తగిన మార్గాంతరం లేదు.
ఇదిన్నీ మరల రెండు కోణాలలో ప్రణాళికా బద్ధం చేయబడిన గాని సమాజం మొత్తానికి
అనువర్తించ జాలదు. అవి. [1] స్వీయ నియంత్రణ (వివేక బలంచే తన మీద తను అదుపు) కలిగి
ఈ క్రమాన్ని పాటించడం (సమాజంలో కొంతభాగం మాత్రమే అట్టి సామర్థ్యం కలిగి ఉంటారు.) [2] అట్టి సామర్థ్యంలేని సాధారణ వ్యక్తుల పై సమిష్టి అదుపు (అది చట్టమూ,
న్యాయ వ్యవస్థ రాజ్యాంగము, పౌరుల బాధ్యత అన్న
వాటి నుండి ఏర్పడుతుంది) వలన వారిచే పాటింపబడుతుంది.
వ్యక్తి నిర్మాణమే సమాజ నిర్మాణానికి
ఆలంబన. వ్యక్తుల ఫలసిద్ధియే సమష్టి ఫలసిద్ధి ఔతుంది. భారతీయమైన (తాత్విక ధార్మిక
రూపమైన) ఆలోచన, ఆచరణలలో ఈ విషయం ప్రస్ఫుటంగానూ, ప్రముఖంగానూ ప్రతిపాదించబడినా ఈనాడు
మరుగునపడివున్న అంశమిది. అయితే నవీన మేధావులచే అత్యంత ప్రధానమూ, మౌలికమునైన ఆంశంగా, దీనిని
గమనించిన వారిలో R S.S స్థాపకులు
డాక్టర్జీ ఒకరు. ప్రస్తుతం మనం చేయవలసింది కూడా దీనిని యవగాహన చేసికొని ఆచరణ రూపంలోనికి
మార్చు కొనడమే.
సాంప్రదాయేతర సంఘాలలో ఈ విషయం (వ్యక్తి
నిర్మాణం) చాలవరకు అప్రధానంగా ఉంటున్నది. మరి ఆయా సంస్థల ప్రవర్తకులలో ఈ విషయం
అత్యవసరమైన విషయంగా ఎందువల్ల చోటు చేసికొన లేక పోయింది? ఎందుకు ప్రాధాన్యతను కోల్పోయింది? దీనిని రెండు కోణాల నుండి గమనించ వలసియుంది. [1]
విషయము ఎడల సమగ్రమైన యవగాహన (వివేకం) లోపించడం. [2] ప్రతి
వ్యక్తికి అతని జ్ఞానాని కవసరమైన సంవేదనలు సమాజమూ, ప్రకృతి
నుండే వస్తున్నాయి. ఈ విషయంలో ప్రవర్తకులకున్నూ జ్ఞానం సమకాలీన ప్రపంచం నుండీ
చరిత్రాధ్యయనం వలనా ఏర్పడుతున్నది కదా! అతను గమనిస్తున్న సమాజంలో వ్యక్తి నిర్మాణం
అత్యవసరమని ఘోషిస్తున్న సాంప్రదాయక సంఘాలు చాలవరకు నిర్వీర్యంగానూ, అంధవిశ్వాస ప్రాభవాలుగానూ, కేవల వాచా మాత్ర ప్రతిభ
(మాటలు కోటలు దాటుతాయంటారే అలా అన్నమాట) కలవి గానూ, మరోవంక
సోమరితనానికి, లేని గొప్పదనాలు ప్రకటించుకోడానికి కేంద్రాలు
గానూ కనుపిస్తున్నాయి.
గమనిక:-ఈ విషయమై మా పరిశీలనలోనూ ఎక్కువ
భాగం యిట్టి యనుభవాలే ఎదురైనాయి. ఆయా ఆశ్రమాల, సంస్థల అధిపతులలో కూడా లేనంత అహంకారమూ, తాము అసాధారణ
వ్యక్తులమన్న భావన, విద్యలోనూ, సాధన లోనూ,
నిష్ణాతుల మన్న భ్రమ ప్రముఖంగా అనుయాయులైన వారిలో గోచరించినాయి.
నిజంగా యివి అభ్యాసకులను భ్రష్టు పట్టించడానికి, విద్యలో అభివృద్ధి
నిరోధానికి కారణాలుగా ఉండగలవు. కానీ యివి గురువులచే గానీ, అనుయాయులచే
గానీ కూడా గమనింప బడుటలేదు.
ఈ యనుభవాల నుండి ఏర్పడిన జ్ఞానం
సాంప్రదాయేతర సంఘాల వారిలో ఆస్థిక సంఘాలపై చిన్న చూపునూ, వ్యతిరేక దృష్టినీ సృష్టించింది. ఆపై వారు
ప్రతి క్రియాత్మకంగా, వ్యతిరేక దృష్టినుండి ప్రణాళికల నేర్పరచుకుని ఆవేశాత్మకంగా
యుంటున్నారు. ఆలోచన-వివేకం ద్వితీయ స్థానానికి పడిపోయింది. అయితే ఆవేశాలు సమస్యలకు
పరిష్కారాలు కాలేవన్నది ఒక వాస్తవం. దానిని అందరం గమనించాల్సి ఉంది. ఇచ్చటనే మరొక సూక్ష్మమూ, సున్నితమూనైన
అంశముంది. ఆయా సంస్థల స్థాపకులందరూ వారు ఏయే వేదికల నుండి పనిజేస్తున్నా సమాజ శ్రేయస్సు
కాంక్షించే వాళ్ళే నన్నదే ఆ విషయము.
వారెవ్వరూ సమాజాన్ని చెడగొట్టాలన్న భావన
కలవారు మాత్రం కాదు. ఇకపోతే అందులోనున్న కపటులూ, స్వార్ధపరులూ అందామా!? అట్టివారు మన
సంఘాలలో మాత్రం తక్కువేంలేరు. అదీకాక నాస్తిక, హేతువాదాది
సంఘాలు ఆస్తిక సమాజం యొక్క వికృతరూపానికి, దాని ప్రవర్తనకు
ప్రతి క్రియాత్మకంగా ఏర్పడినవే నన్నది ఒక చారిత్రక వాస్తవం. మంచిని ఎక్కడ నుండైనా
స్వీకరించడం, స్వకీయమైన బలహీనతలను వదులుకునే యత్నం
నిజాయితీగా చేయడం మానవతకు, వికాసానికి ఆధార శిల వంటిది.
సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్న వర్గం
తమలో కూడా బలీయంగానే ఉందన్న విషయాన్ని నాటి బుషులు చాలా చక్కగా గమనించారు. ఉదాహరణకు
“అవిద్యాయామంతరే వర్తమానాః స్వయంధీరాః పండితమ్మన్యమానాః దంద్రమ్యమానాః పరియన్తి మూడాః
అంధేనైవ నీయమానా యదాంధాః” నడిపేవారూ, నడిపింపబడేవారూ యిద్దరూ గుడ్డివారే అయినా వారు తమకు తామే
వేత్తల మనుకుంటూ అజ్ఞానంలో- భ్రమలో మునిగి చరిస్తున్నారు. తిట్టును కూడా ఎంతో
వివేకవంతంగా పలకడంలోనే వారి ఔన్నత్యం గోచరిస్తుంది. ఇవి ఎంత వాస్తవమంటే ఈ నాటి ఆస్తిక-నాస్తిక
సంఘాలలో కూడా-సంఘాలలో నూటికి డెబ్బది ఐదుమందికి వర్తిస్తుంది ఈ శ్లోకభావం. ఆపై
పాతికలో కూడా మరికొందరు తేలవచ్చు నిశిత పరిశీలనలో. ఎందుకలా అనగలిగానంటే ఆస్తిక,
నాస్తిక భావాలకు చెందిన వారుగానే గదా సమాజం ఉన్నది. ఆ సమాజం
అధార్మికంగా ఉందన్నది యిరుపక్షాలు ఘోషిస్తున్న అంశమే. కాకుంటే ప్రతివర్గమూ తమ
ఎదుటి వర్గంలోని దోషాలను ఎత్తి చూపుతోంది. కనుక యిరు పక్షాలూ తమతమ పక్షంలోని
అధార్మికులను సంస్కరించడమో, యిరువురూ కలసి సమాజంలోని అధార్మికతను
తొలగించడమో చేయవలసి ఉంది. అదే సరైన సంస్కరణ కాగలదు.
అయితే ఆ సంస్కరణ అంతటి గుణాత్మకమైన
మార్పు ఎలా సాధ్యం?
సాంప్రదాయకులు తాము చెపుతున్న వ్యక్తి
నిర్మాణరూపమైన సాధనను త్రికరణశుద్ధిగా ఆచరించి ఆ విషయములో యితరులకు స్ఫూర్తిదాయకం
కాగలిగిన వ్యక్తిత్వాన్ని సముపార్జించుకోవాలి. అట్లే, ప్రతి క్రియాత్మకంగా ఏర్పడి ఉద్రేకాలలో
కొట్టుకు పోతున్న సాంప్రదాయేతర సంఘాలు కూడ తమ సంఘములలో వ్యక్తి నిర్మాణరూపమైన సాధనను
ప్రవేశ పెట్టగలగాలి. ఈ ప్రక్రియ ఒక్కదానివలన మాత్రమే ఆ గుణాత్మకమైన మార్పు సాధ్యం
కాగలదు. ఈ విషయమే ఒకింత గోప్యంగానైనా స్థితప్రజ్ఞస్యకాభాషా... యిత్యాది శ్లోకాలలో
వ్యక్తం చేయబడ్డది. మిగిలిన ప్రక్రియలన్నీ నేలవిడచిన సామువంటివే. వివేకవంతులీ
క్రమాన్ని పాటిస్తూ, సామాన్యులచే పాటింపచేయాలి. “యద్యదాచరతి
శ్రేష్ఠః తత్తదేవేతరోజనః” అన్నది మానవ స్వభావానికి చెందిన వాస్తవము గదా!
ఏతావాతా, సమాజ శ్రేయస్సుకు తగిన ప్రక్రియ, ఆయా సంస్థలు వ్యక్తి నిర్మాణం వైపు అభ్యాసరూప కర్మారంభం చేయడంలోనే యిమిడి
ఉంది. ఒకరు మరొకరిని విమర్శించుకుంటూనో, వ్యతిరేకించుకుంటూనో
పట్టించుకోకుండానో కాలం గడపటం అవివేకం. ఈ విషయంలో ఎవరికి వారు ప్రథమంగా తన వేపు
నుండి మార్పు రావలసి యున్నదనుకుంటూ యత్నారంభం చేయాలి. ఆ మార్పుకైన యత్నం అన్నది
కేవలం ఏదో ఒక కోణం నుండి గాక విప్లవాత్మకంగా [మౌలికమైన, గుణాత్మకమైన
మార్పు తేగల విధంగా] సమగ్రంగానూ, మహోధృతంగానూ సాగవలసి ఉంది. ఆత్మ
విమర్శా, సమ్యగ్యత్నమూ నన్నదే నేను సూచించ దలచుకున్న
పరిష్కార మార్గము. అప్పుడు మాత్రమే జ్ఞానం వివేకరూపాన్ని, యత్నం
యోగరూపాన్ని సంతరించుకుంటుంది. ఇంతకు మించి మార్గాంతరం లేదు. ఇందుకై ఆయా సంఘాల
వారందరు పరస్పరావగాహన, యోజనల కొరకై ముందుగా ఒక వేదిక
నేర్పాటు చేసికొనవలసి యున్నది. వైయక్తి కాధిపత్యాల నావలనుంచి కాగల కార్యానికై దృఢ
దీక్షితులు కాగలగాలి. ఇది ఇష్టం కంటే వివేకం పర్యవేక్షణలో జరుగవలసి యుంది. దీనికై అహంకార
శూన్యత, మేధావిత్వమూ, త్యాగనిరతి అన్న
సుగుణ సంపత్తికల వ్యక్తులు ముందుగా ముందుకు రావలసియుంది. అప్పుడే తగిన కదలిక
వస్తుంది. ప్రతిపక్షి సద్విమర్శకుడైన పక్షంలో అతను విమర్శించలేని ఆచరణ, వివేకమూ కలబోసిన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయవలసి ఉంది. ఈ విషయమై మనందరం
కలసి కదలాలన్నదే. నా యోచన. ఈ ప్రయత్నానికిన్ని ప్రేరణ అదే.
ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందించడం అన్నది చేతన పదార్థ
స్వభావం. స్పందించలేక పోవడం చైతన్యం యొక్క బలహీనతకు సూచన కాగలదు. ఉంటాను. సెలవ్.
నమస్సులతో.
సత్యాన్వేషణలో
మీ సురేంద్ర
No comments:
Post a Comment